కలెక్టరేట్, మార్చి 27: వేసవిలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వేసవి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి కూలీలు, కార్మికులు ఉదయమే పనులు చేయాలని సూచించారు.
జనసంచారం అధికంగా ఉన్నచోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువులు, పక్షులు, వన్యప్రాణులు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే సత్వరమే చికిత్స అందించి దవాఖానకు తరలించాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధి కూలీలకు, గ్రామాల్లో ప్రజలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. వేసవిలో తాగునీటిని పొదుపుగా వాడాలని ప్రజలకు సూచించారు.
జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పైప్లైన్ మరమ్మతులు ఉన్న చోట వెంటనే పనులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో పవన్కుమార్, డీపీవో రవీందర్, డీఆర్డీవో శ్రీధర్, సీపీవో కొమురయ్య, అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, డీఎంహెచ్వో డా.సుజాత, జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎఫ్వో నర్సింగారావు, హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, సీఎస్ ఏసీపీ కాశయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెయిడ్ న్యూస్ను గుర్తించడంతో పాటు ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్కుమార్, సమాచార పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్కుమార్, ఏపీఆర్వో వీరాంజనేయులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కొండయ్య, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, డీఐవో శివరాములు, ఉష, శ్రీధర్, రాజ్కుమార్, రాంబాబు, చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.