కొత్తపల్లి, ఏప్రిల్ 13: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్వాహకులకు సూచించారు. కొత్తపల్లి మండలం మలాపూర్, బద్దిపెల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది.. ఆయా సెంటర్ల పరిధిలో ఎంత మంది రైతులు ఉన్నారు.. ఇంకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం రానుంది.. అన్ని సౌకర్యాలు కల్పించారా అని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. సరైన తేమశాతం వచ్చేలా ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ శాతం పేరిట ధాన్యానికి ఎలాంటి కోత విధించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రైస్ మిల్లర్లు సైతం ధాన్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్నా రైతులు మా దృష్టికి తీసుకువస్తే పరిషారానికి కృషి చేస్తానని తెలిపారు.
కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలతో పాటు రైస్ మిల్లర్లకు గన్నీ బ్యాగులు అందించాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయా సెంటర్ల ఇన్చార్జులు, మిల్లర్లు ధాన్యాన్ని తకువ ధరకు కొనవద్దని, ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మలాపూర్లో కొనుగోలు కేంద్రం వద్ద విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు నిర్మించాలని కలెక్టర్కు రైతులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం రజినీకాంత్, నాయబ్ తహసీల్దార్ సురేందర్, ఆర్ఐ అరుణ్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.