కలెక్టరేట్, జనవరి 10 : జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతి, ప్యాకేజీ-9,12 పెండింగ్ పనులపై రెవెన్యూ, అటవీ, ఇంజినీరింగ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్-2 ఫేజ్ -1 పెండింగ్ భూసేకరణ, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
ప్యాకేజీ-9, 11 పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ ప్రాజెక్టుల పూర్తికి ఇంకా నిధులు కావాల్సి వస్తే సంబంధిత సమగ్ర ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఆర్డీవో మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బొద్దుల గంగయ్య, ఎస్వైపీ ఈఈ సంతు ప్రకాశ్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.