కలెక్టరేట్, ఫిబ్రవరి 2: జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని ఖాళీ స్థలాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయో రికార్డుల్లో ఉండాలని, వాటిపై తనిఖీ చేయాలని, ఆక్రమణలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇంటింటికీ నీటి సరఫరా విషయంలో క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని పరిశీలించి, సమగ్ర నివేదికను అందించాలన్నారు. శ్రీరాజరాజేశ్వర జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై ఆరా తీశారు. సిరిసిల్లలోని టెక్స్టైల్ పార్క్లో ఎన్ని పరిశ్రమలు అనుమతి పొందాయి? ప్రస్తుతం ఎన్ని కొనసాగుతున్నాయి అనే వివరాలను టెక్స్టైల్ పార్క్ ఆర్డీడీ అశోక్రావును అడిగి తెలుసుకున్నారు. మొత్తం 116 పరిశ్రమలు అనుమతి పొందాయని, ప్రస్తుతం 62 కొనసాగుతున్నాయని జేడీ తెలిపారు. మిగతా పరిశ్రమలు వివిధ కారణాలతో మూతపడ్డాయని వివరించారు.
అనంతరం శ్రీరాజరాజేశ్వర జలాశయం వద్ద చేపపిల్లల పెంపకం, అందుకు కావాల్సిన స్థలం, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగం పరిధిలో 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పనులు మంజూరయ్యాయి.. ఎన్ని పూర్తయ్యాయి అనే వివరాలను సమర్పించాలని ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ శివారులో చేపడుతున్న కేంద్రీయ విద్యాలయం నూతన భవన నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో క్రిటికల్ కేర్ యూనిట్, క్వార్టర్ల నిర్మాణాలకు కావాల్సిన భూములను సేకరించాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.
అలాగే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డులోని గోడౌన్లో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల మొదటి స్థాయి తనిఖీ ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. ఈనెల 5వ తేదీ నుంచి ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్, ఆర్డీవోలు ఆనంద్కుమార్, మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, ఆర్డీడీ అశోక్రావు, మిడ్ మానేరు ఈఈ జగన్, జౌళి శాఖ ఏడీ సాగర్, ఇంట్రా ఈఈ జానకి, గ్రిడ్ ఈఈ విజయ్కుమార్, సీపీవో శ్రీనివాసచారి, డీపీవో రవీందర్, డీఈవో రమేశ్కుమార్, ఆర్అండ్ బీ ఈఈ శ్యామ్సుందర్, శివప్రసాద్, శ్రీనివాస్, రాఘవేందర్, కమిషనర్లు ఆయాజ్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.