కలెక్టరేట్, మార్చి 9: బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ వార్షిక ప్రణాళిక రుణాల లక్ష్య సాధింపులను వివరించారు. ఆర్థిక సంవత్సరం రుణాల లక్ష్యం రూ.2725 కోట్లుగా నిర్ణయించగా, ఇప్పటి వరకు బ్యాంకర్లు రూ.1850 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఎంఎస్ఎంఈ రుణ లక్ష్యం రూ.566 కోట్లు కాగా రూ.196 కోట్లు పంపిణీ చేసినట్లు ఎల్బీఎం మల్లికార్జున్ వివరించారు. ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రత్యేకించి రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అగ్రికల్చర్ టర్మ్ లోన్, వ్యవసాయ మౌలిక సదుపాయాల ఫండ్, పీఎంఎఫ్ఎంఈ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని చెప్పారు. మెప్మా పట్టణ స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో నిర్దేశిత లక్ష్యాన్ని మించి 145 శాతం లక్ష్యాన్ని సాధించడంపై బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. గ్రామీణ స్వయంసహాయక సంఘాల లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తూ రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న మిల్చి స్కీమ్ (రెండు పాడి గేదెల స్కీం) కింద జిల్లాలో ఇప్పటికే 1120 దరఖాస్తులు చేసుకోగా 602 మంది లబ్ధిదారులకు రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు సమ్మతి తెలియజేశాయన్నారు. ఇంకా 880 మంది ఎస్సీ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందన్నారు. లబ్ధిదారులతో బ్యాంకు మేనేజర్లు నేరుగా మాట్లాడి బ్యాంకు సమ్మతి పత్రాలు అందించి యూనిట్ల గ్రౌండింగ్కు సహకరించాలని కోరారు.
‘నాబార్డ్’ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2023-24ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో వార్షిక ప్రణాళికతో క్రాప్ లోన్లకు రూ.1401.85 కోట్లు, టర్మ్ లోన్లకు రూ.1763. 13 కోట్లు, ఎమ్మెస్ఎంఈలకు రూ.640.75 కోట్లు, మొత్తం ప్రాధాన్యతా రంగానికి రూ.2834.34 కోట్లుగా ప్రణాళిక రూపొందించారన్నారు. ఈ ప్రణాళిక ఆధారంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళికను నిర్ణయిస్తారని వెల్లడించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, యూబీఐ డిప్యూటీ రీజినల్ హెడ్ టీ వంశీకృష్ణ, ఆర్బీఐ ఎల్డీవో రాజేంద్రప్రసాద్, నాబార్డు డీడీఎం మనోహర్రెడ్డి, ఎస్బీఐ ఆర్ఎం రవిశేఖర్, టీజీబీ ఆర్ఎం గంగాధర్, కేడీసీసీబీ సీఈవో ఎన్ సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 9: మన ఊరు – మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం వెంకటాపూర్, దుమాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టిన డైనింగ్హాల్, కిచెన్షెడ్, ప్రహరీ నిర్మాణ పనులపై ఆరాతీశారు. వెంకటాపూర్లో చివరి దశలో ఉన్న మైనర్ పనులు, దుమాలలో ప్రహరీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. కమ్యూనిటీ సోక్పిట్స్ను తనిఖీ చేశారు. మొక్కలు నాటడం, సంరక్షణలో జాగ్రత్తలపై అడిగి తెలుసుకున్నారు. దుమాలలో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. గొల్లపల్లిలో డీఈవో రమేశ్ మన ఊరు- మన బడి పనులు, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. ఇక్కడ ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ పాశం సరోజన, ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్రెడ్డి, ఎండీ జబ్బార్, ఎంఈవో దూస రఘుపతి, డీఈ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు గొట్టెముక్కల శేఖర్, బూర రవీందర్, కోల రమేశ్, రాధారపు శంకర్, కదిరె శ్రీనివాస్ ఉన్నారు.