పెద్దపల్లి, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో పెద్దఎత్తున ధాన్యం రైతుల చేతికొచ్చింది. జిల్లాలోని 13 మండలాల్లో 2లక్షల 4వేల ఎకరాల్లో లక్షా11వేల మంది రైతులు వరి సాగు చేయగా, 4.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందు కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, డీసీఎంఎస్, సహకార సంఘాల ఆధ్వర్యంలో 307 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా కాంటాలు, గన్నీ సంచులతోపాటు హమాలీలు, లారీలను అందుబాటులో ఉంచారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే విధంగా టర్ఫాలిన్లను సైతం అందుబాటులో ఉంచి, కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల్లో ఏర్పాటు చేసిన 307 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,39,315 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటి వరకు 35కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేశారు. 1,38,574 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా 272 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 60-65వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
సన్న రకాలతోపాటు నిత్యం వినియోగించే కామన్ రకాల వరి పంటను సాగు చేయడంతో ప్రైవేట్గా సైతం మార్కెట్లో ఈ ఏడాది మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఆడ్తి వ్యాపారులు, రైస్మిల్లర్లు నేరుగా రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. త్వరగా నగదు కూడా ఇవ్వడంతో రైతులు సైతం వారికి విక్రయించేందుకు ఆసక్తి చూపారు.
జిల్లాలో ఈ ఏడు సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుపై ప్రజలు సైతం ఆసక్తి చూపారు. జిల్లాలో 40వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని నేరుగా ప్రజలు రైతుల వద్ద కొనుగోలు చేశారు. అదే విధంగా రైతులు పండించిన పంటనే సీడ్ కోసం సైతం ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. సీడ్ కోసం దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు సేకరించుకున్నారు. మొత్తంగా 80వేల మెట్రిక్ టన్నుల వరకు ఇలా వినియోగమైంది. దీంతో కొనుగోలు కేంద్రాలకు భారం తప్పింది.
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నం. ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవుతుంది. ధాన్యం కొనుగోళ్ల కోసం 307 కేంద్రాలు ఏర్పాటు చేసినం. ఇప్పటికే 35 కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయింది. 272 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 60-65వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రానున్న 15 రోజుల్లో కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– దోమ ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి (పెద్దపల్లి)