బొగ్గు గని కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. 11వ వేతన ఒప్పందానికి సంబంధించి బుధవారం కోల్కతాలో జరిగిన వేజ్బోర్డు సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. 10.5 శాతం ఎంజీబీ (మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్స్) మాత్రమే ఇస్తామని కోలిండియా యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించడంతో ఏడోసారి సమావేశం వాయిదా పడింది. ఇప్పటికే 17 నెలలు ఆలస్యమైన ఒప్పం దం ఈ సారి కూడా ఫైనల్ కాకపోవడంతో కార్మికలోకం భగ్గుమంటున్నది. కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో మరోసారి ఆందోళనబాట పట్టబోతున్నది. ఈ నెల 9న దేశవ్యాప్తంగా గనుల్లో నల్లబ్యాడ్జీల తో నిరసనలు తెలిపేందుకు నిర్ణయించింది. కార్మికులకు మెరుగైన వేతనాలు సాధించేందుకు మరో పోరాటానికి సిద్ధమవుతామని టీబీజీకేఎస్ స్పష్టం చేస్తున్నది.
గోదావరిఖని, నవంబర్ 30 : బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందంపై బుధవారం కలకత్తాలో జరిగిన ఏడో సమావేశం కూడా ఎటూ తేలకుండానే మళ్లీ వాయిదా పడింది. 2021 జూలై 1 నుంచి అమలు కావాల్సిన ఈ ఒప్పం దానికి సంబంధించి ఏడుసార్లు సమావేశాలు జరిగినా వాటిలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందంపై ఆది నుంచీ డీపీఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్) గైడ్లైన్స్ను సాకుగా చూపుతూ వస్తున్న కోలిండియా యాజమాన్యం బుధవారం కూడా అదే విషయాన్ని ప్రస్తావిం చింది. దీనికి తోడుగా బొగ్గు పరిశ్రమలో అధికారులతో సమానంగా కార్మికులకు సంబంధించిన బేసిక్ను ఉంచలేమని పేర్కొంటూ మొండికేసింది. ఈసారి 3 శాతం వేతనాల పెంపునకే మొదట మొగ్గు చూపిం ది.
నాలుగు జాతీయ సంఘాల నాయకులు 28 శాతం ఎంజీబీని (మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్స్) ప్రకటించాలని కోరినా ప ట్టించుకోలేదు. మొదట 10శాతం ఇస్తామని చెప్పింది. తర్వాత ఒత్తిడితో మరో అర శాతం పెంచి 10.5 శాతానికి మించి ఇవ్వ లేమని మొండి వైఖరి ప్రదర్శించింది. ఈ నెల 9న దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో ప్రొటెస్ట్ డేగా పరిగ ణించాలని, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలు పాలని జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయిం చాయి. జనవరి 7న రాంచీలో జరిగే జాతీయ సంఘాల కన్వెన్షన్లో బొగ్గు గనుల్లో సమ్మె నిర్వ హించే అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుం టామని పేర్కొన్నాయి. ఇటు సింగరేణిలో గుర్తింపు కార్మిక సం ఘంగా ఉన్న టీబీజీకేఎస్ కేంద్ర ప్రభుత్వం, జాతీయ సంఘాలపై ఒత్తిడి తెచ్చేలా ముందుకుసాగుతామని స్పష్టం చేసింది. అందుకు ఒక కార్యచరణ రూపొందించుకొని మరో పో రాటానికి సిద్ధమవుతామని చెప్పింది.
నిరసనలకు సిద్ధమవుతాం..
11వ వేతన ఒప్పందానికి సంబంధించి కోలిండియా, సింగరేణి యాజమాన్యాల వైఖరికి నిరసనగా ఈనెల 9న దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతాం..4 జాతీయ కార్మిక సంఘాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. కోలిండియా యాజమాన్యం వైఖరి వల్లే సమావేశం వాయిదా పడింది. జనవరి 7న రాంచీ లో జరిగే 4 జాతీయ సంఘాల కన్వెన్షన్లో వేతన ఒప్పం దానికి సంబంధించి చర్చించి, అవసరమైతే సమ్మె నోటీసు ఇస్తాం. – రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, వేజ్బోర్డు సభ్యుడు
కేంద్ర వైఖరితోనే ఆలస్యం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్లనే బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఆలస్యమవుతున్నది. బొగ్గు బ్లాకులను ఆమ్మడం, కోలిండియాలో వాటాలను విక్రయించడం ద్వారా కేంద్రం రూ.వేల కోట్లు కూడబెడుతున్నది. కార్మికులకు సంబంధించిన వేతనాల విషయంలో డీపీఈ గైడ్లైన్స్ వంటివి పెట్టి ఇబ్బందులు పెడుతున్నది. కేంద్ర వైఖరిని అడ్డుకోవడం, 11వ వేతన ఒప్పందంలో నాలుగు జాతీయ కార్మిక సంఘాలు గట్టిగా మాట్లాడకపోవడం పెద్ద సమస్యగా కనిపిస్తున్నది. ఇప్పటికే పలుసార్లు సమావేశాలు జరిగినా ఏ ఒక్క ఆంశం పరిష్కారం కాకపోవడం వారి వైఖరిని తెలుపుతున్నది. జాతీయ కార్మిక సంఘాల వైఖరిని మేం వ్యతిరేకిస్తున్నం. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ సూచనలతో బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతనాల కోసం గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ముందుకు సాగుతుంది. నిరసనలు, ఆందోళనలు చేపడుతాం. కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నం.
– బీ వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు