మెట్పల్లి, డిసెంబర్ 2: ఈ నెల 7న జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పిలుపు నిచ్చా రు. మెట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలాల ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు, రైతులు, యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యేలా చూడాలన్నారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాలతో పాటు అన్ని గ్రామాల నుంచి ప్రజలు సీఎం సభకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం సభకు ప్రజలను తరలించేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీలు మారు సాయిరెడ్డి, తోట నారాయణ, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, చంద్రశేఖర్రావు, ఆర్బీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ చీటి వెంకట్రావు, మండలాధ్యక్షుడు ఎలాల దశరథరెడ్డి, తోట శ్రీనివాస్, నల్ల తిరుపతిరెడ్డి, దారిశెట్టి రాజేశ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.