“సంక్షేమం.. అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కండ్లు. సంక్షేమం మాట మరువం. అభివృద్ధి పథాన్ని వీడం.” అంటూ తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలుగా మారిపోయాయి. ఈ రెండూ సమంగా సాగినప్పుడే జనుల సౌభాగ్యం సాధ్యమవుతుందని తెలిసిన దార్శనిక పాలకుడు కేసీఆర్ కృషితో జిల్లాలో సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేరుతున్నాయి. ఆసరా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు, సీఎంఆర్ఎఫ్ ఇలా ఎన్నో పథకాలతో సబ్బండ వర్గాలు సంతోషపడుతున్నాయి. రైతుబంధు, బీడీ పింఛన్ల అమలులో మిగిలిన జిల్లాల కంటే అధికం ప్రయోజనం చేకూరుతున్నది. 24గంటల ఉచిత విద్యుత్ వినియోగంలోనూ జిల్లానే అగ్రస్థానంలో ఉన్నది.
– జగిత్యాల/రాయికల్, డిసెంబర్ 5
పేదింట్లో ‘కల్యాణ’ కాంతులు
పేదింటి ఆడపిల్లల పెండ్లికి సాయం చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో ధైర్యం నింపింది. ఆడపిల్ల పెండ్లి తమకు భారం కాబోదన్న భరోసా ఇచ్చింది. జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా 18 మండలాలు, ఐదు మున్సిపాలిటీ పరిధిలో 38,565 మందికి 340.43 కోట్ల సాయం అందింది.
1.25 లక్షల విద్యుత్ పంప్సెట్లకు ఉచిత విద్యుత్
రాష్ట్ర సర్కారు రైతుకు నిరంతరం నాణ్యమైన కరెంట్ ఉచితంగా ఇస్తున్నది. అధిక వ్యయం అవుతున్నప్పటికీ రైతుల సంక్షేమం దృష్ట్యా భారం భరిస్తున్నది. ఈ పథకం వల్ల ఎక్కువగా లబ్ధిపొందుతున్న జిల్లాల్లో జగిత్యాలనే అగ్రస్థానంలో ఉన్నది. జిల్లాలో నీటి వసతి పుష్కలంగా ఉండడం, మిషన్ కాకతీయ, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాల వల్ల భూగర్భ జలాలు క్రమంగా పెరుగుతూ వస్తుండడంతో రోజురోజుకూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం జిల్లాలో 1,22,692 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మరో మూడు వేల కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 3హెచ్పీ సామర్థ్యం కలిగినవి 1.01 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉంటాయని, మిగిలిన పాతిక వేలల్లో 20 వేల కనెక్షన్లు 5 హెచ్పీ సామర్థ్యం కలిగినవి ఉంటాయని చెబుతున్నారు. మూడు నుంచి నాలుగువేల కనెక్షన్లు 7.5 హెచ్పీవి ఉన్నాయంటున్నారు. వీటికి విద్యుత్ వినియోగం కోసం ఏటా కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
345 మందికి ‘దళితబంధు’
దళితుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అమలు చేస్తున్నది. ఈ పథకం కింద మొదటి దశలో జగిత్యాల జిల్లాలో 345 మందికి లబ్ధి కలిగింది. ధర్మపురి నియోజకవర్గం పరిధిలో 81 మందికి, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల అంతర్భాగంగా ఉన్న మండలాలైన కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో 64 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింది.
పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా
రోగాల బారిన పడిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) భరోసానిస్తున్నది. ఎమ్మెల్యేల సిఫారసులతో అందజేసే ఈ సాయం వల్ల వేలాది మందికి మేలు జరుగుతున్నది. ఇలా ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గంలో 5,100 మందికి 10.12 కోట్లు, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో 16,783 మందికి 38.27 కోట్లు, కోరుట్ల నియోజకవర్గంలో 4864 మందికి 18.46 కోట్ల సాయం అందింది. మొత్తంగా మూడు నియోజకవర్గాల పరిధిలో 26,747 మందికి 66.85 కోట్ల లబ్ధి చేకూరింది.
కుటుంబాలకు రైతుబీమా సాయం
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. రైతు ఎలా చనిపోయినా కుటుంబాలకు అండగా నిలువాలన్న ఉద్దేశంతో రైతుబీమాను అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద జగిత్యాల జిల్లాలో ఏటా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్న దాదాపు 1.40 లక్షల మందికి రైతు బీమా వర్తిస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో మరణించిన 3,082 మంది రైతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున దాదాపు 152.03 కోట్ల క్లెయిమ్ అందింది.
1667.28 కోట్ల రైతుబంధు
వ్యవసాయిక జిల్లా అయిన జగిత్యాలలో రైతుల సంఖ్య గణనీయంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందిన జిల్లాలో జగిత్యాల తొలిస్థానంలో నిలుస్తున్నది. 2018 నుంచి ఇప్పటి వరకు జిల్లా రైతులకు 1667.28 కోట్ల సాయం అందింది. ఇందులో ఈ యేడాది వానకాలానికి సంబంధించి జిల్లాలో 2,15,673 మంది రైతుల ఖాతాల్లో 207.57 కోట్లు జమచేశారు.
ప్రతి నెలా 47.83 కోట్ల పెన్షన్లు
జిల్లాలో అన్ని రకాల పెన్షనర్లు 2,28,593 మంది ఉండగా, వీరికి ప్రతి నెలా వివిధ పెన్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం 47.83 కోట్లు మంజూరు చేస్తున్నది. వీరిలో 64,186 మంది వృద్ధులకు 12.93 కోట్లు, 44,844 మంది వితంతువులకు 9.04 కోట్లు, 17,489 మంది వికలాంగులకు 5.27 కోట్లు, 3,448 మంది గీత కార్మికులకు 69 లక్షలు, 2270 మంది చేనేత కార్మికులకు 45 లక్షలు, 750 మంది ఏయిడ్స్ పేషెంట్లకు 15 లక్షలు, 1797 మంది బోధకాలు బాధితులకు 36 లక్షలు, 83 మంది డయాలసిస్ పేషెంట్లకు 1.67 లక్షలు, 4621 మంది ఒంటరి మహిళలకు 93 లక్షలు ఇస్తున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా బీడీ కార్మికుల సంఖ్య జగిత్యాల జిల్లాలోనే నమోదు కాగా, 89,105 మందికి 17.96 కోట్ల పెన్షన్ను ప్రతి నెలా అందిస్తున్నది.