పెద్దపల్లి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రామగుండానికి వస్తున్నారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టిన ఆయన, అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో పద మూడు నియోజకవర్గాలకు గాను పది సభలు పూర్తి చేశారు. మొదటగా గత నెల 15న హుస్నాబాద్, 17న సిరిసిల్ల, ఈ నెల 2న ధర్మపురి, 3న కోరుట్ల, 7న మంథని, పెద్దపల్లి, 17న ఒకే రోజు కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.
ఆ తర్వాత సోమవారం (ఈ నెల 20) మానకొండూర్ సభకు హాజరైన గులాబీ బాస్, శుక్రవారం గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రామగుండం ప్రజా ఆశీర్వాసభకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీ ప్యాడ్ నుంచి సభా స్థలికి ఐదు నిమిషాల్లో చేరుకొని తిరిగి వెళ్లిపోయేలా రామగుండం పోలీస్ కమిషనరేట్లో హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. ఎలాంటి సంఘటలు చోటు చేసుకోకుండా రామగుండం సీపీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రజా ఆశీర్వాద సభకు రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, కమీషనరేట్ ఆవరణలోని హెలిప్యాడ్ను ఆయన పరిశీలించి, సూచనలు చేశారు. అలాగే నియోజకవర్గంలోని రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 50 డివిజన్లు, అంతర్గాం, పాలకుర్తి మండలాలు, రామగుండం అర్బన్ మండలం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. స్టేడియంలో షామియానాలు, వేలాది మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేస్తున్నారు.
వాటర్ ప్యాకెట్లు కూడా తెప్పిస్తున్నారు. అంబులెన్స్లు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. రామగుండం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ప్రగతి పదాత కేసీఆర్కు మనమంతా కృతజ్ఞతగా ఉండాలని, పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాసభకు సింగరేణి కార్మికులు వేలాదిగా తరలిరావాలని టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య కోరారు.
గోదావరిఖని, నవంబర్ 23: స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం జరగనున్న సీఎం కేసీఆర్ భరోసా ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్, సీనియర్ సివిల్ కోర్టు, భవన కార్యాలయంతో పాటు రామగుండం అభివృద్ధి ఎంతగానో సహకరించిన అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్కు ప్రజలు అఖండ స్వాగ తం పలికాలని కోరారు.
ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్లో మరిన్నీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టను న్న సీఎం కేసీఆర్కు రాబోయే ఎన్నికల్లో మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆయన వెంట రామగుండం ఎన్నికల ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, సీనియర్ నాయకుడు కౌశికహరి, మేయర్ బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకర్ రావు పాల్గొన్నారు.