అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రగతిప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు జగిత్యాల, వేములవాడకు రానున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదకొండు సభల్లో పాల్గొని జోష్ నింపిన ఆయన, బీఆర్ఎస్ అభ్యర్థులు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా ఆదివారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఆయాచోట్ల బీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
విజయవంతం కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. శనివారం జగిత్యాలలో రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్, వేములవాడలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గాలను అన్నివిధాలా అభివృద్ధి చేసిన అధినేత కేసీఆర్కు కృతజ్ఞత తెలిపేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
– రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ/ జగిత్యాల కలెక్టరేట్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ)/ వేములవాడ/ జగిత్యాల కలెక్టరేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అన్ని విధాలా కలిసొచ్చిన పూర్వ కరీంనగర్ గడ్డ నుంచే ఈ సారి కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో హుస్నాబాద్ వేదికగానే ప్రారంభించి, విజయం అందుకొని అధికారం చేపట్టిన ఆయన, మరోసారి ఇక్కడి నుంచే రంగంలోకి దిగారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా లో పద మూడు నియోజకవర్గాలకు గాను పదకొండు సభలు పూ ర్తి చేశారు. గత నెల 15న హుస్నాబాద్, 17న సిరిసిల్ల, ఈ నెల 2న ధర్మపురి, 3న కోరుట్ల, 7న మంథని, పెద్దపల్లి, 17న ఒకే రోజు కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 20న మానకొండూర్, 24న రామగుండం సభలకు హాజరై దిశానిర్దేశం చేశా రు. ఇప్పటి వరకు అన్ని చోట్లా సభలు గ్రాండ్ సక్సెస్ కాగా, ఆదివారం జగిత్యాల, వేములవాడలో నిర్వహించే సభలకు హాజరుకాబోతున్నారు. ఎన్నికల వేళ ప్రజలను చైతన్యం చేయనున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్కు మద్దతుగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో ప్రజా ఆశ్వీరాద సభ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులంతా సన్నాహాలు చేస్తున్నారు. శనివారం సభా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ పరిశీలించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు మద్దతుగా ఆదివారం వేములవాడ కోర్టు సమీపంలోని మైదానంలో ప్రజా ఆశ్వీరాద సభకు నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులంతా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, సీనియర్ నాయకులు లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్రెడ్డి, తీగల రవీందర్గౌడ్ అన్ని మండలాల కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
గులాబీ బాస్ ఆదివారం జగిత్యాల, వేములవాడ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ ల విజయవంతం కోసం బీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ కోసం సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ గ్రామ స్థాయి నుంచి మొదలుకొని, పట్టణ స్థాయి, ముఖ్య కార్యకర్తలు, బూత్కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులంతా కలిసి కట్టుగా రెట్టింపు ఉత్సాహంతో కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావాలని పిలుపునిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ మరో జగిత్యాల జైత్రయాత్రను తలపించాలని రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తో కలిసి శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో సభ ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రగతి ప్రదాతకు కృతజ్ఞత తెలుపాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తులో చేయబోయే ప్రణాళికను సీఎం వివరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజేశంగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, కౌన్సిలర్లు రాజ్కుమార్, శివకేసరి బాబు, బీఆర్ఎస్ నాయకులు ఒద్ది రాంమోహన్రావు, సమిండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.