CM KCR | స్వరాష్ట్రంలో ఆలయాలకు పునర్జీవం పోస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగిరి గుట్టను అద్భుత క్షేత్రంగా మలిచారు. 1,250 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా భువిపై వెలిసిన వైకుంఠంగా తీర్చిదిద్దారు. కృష్ణశిలలతో దేవతామూర్తులు, మందిరాలు, కళావైభవం ఉట్టిపడే ఆళ్వారుల విగ్రహాలతో దేశంలోనే ప్రశస్త్యమైన క్షేత్రంగా విలసిల్లుతుండగా, అదే తరహాలో కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దేశంలోనే దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అంకురార్పణ చేశారు. ఇటీవలే 100 కోట్లు మంజూరు చేసిన ఆయన, బుధవారం కొండగట్టులో మూడు గంటలకుపైగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణంపై రెండు గంటలకుపైగా సమీక్షించి, దిశానిర్దేశం చేశారు. దేవాలయ విస్తరణకు సేకరించాల్సిన భూములు, సంబంధించిన అంశాలపై మ్యాపును పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అంజన్న క్షేత్ర స్థల పురాణం గురించి స్వయంగా వివరించారు.
ఆలయ అభివృద్ధికి అవసరమైతే రూ.వంద కోట్లే కాదు, రూ.వెయ్యి కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆలయ నిర్మాణ సమయంలో తరుచుగా తాను కొండపైకి పర్యటనకు వస్తానని, పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే మరోసారి వచ్చి సమీక్షస్తానని చెప్పారు. దేశంలోనే అద్భుతమైన ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడున్నదంటే కొండగట్టు పేరే వినపడేలా అత్యంత గొప్పగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. గర్భాలయం, అందులోని మూలవిరాట్ను ముట్టుకోకుండా ఆగమ, వాస్తు శాస్త్ర ప్రకారం ఆలయాన్ని సంపూర్ణంగా విస్తరించాలని సూచించారు. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు చేపడుతూనే, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. కొండగట్టు అభివృద్ధి బాధ్యతలను సీఎంవో కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్, జగిత్యాల కలెక్టర్, రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖ, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
– జగిత్యాల, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
– సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం 11.03గంటలకు హెలికాప్టర్లో కొండగట్టు ప్రాంతానికి చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కొండగట్టు పరిసరాలను పరిశీలించారు. తర్వాత సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూలో హెలీప్యాడ్లో దిగారు. 11.28గంటలకు ప్రగతిరథం ద్వారా రోడ్డుమార్గాన గుట్టపైకి చేరుకున్నారు. ఈవో కార్యాలయం నుంచి కాలినడకన ఆలయానికి వెళ్లారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా, ఆలయం లోపలికి వచ్చారు. 11.33గంటలకు స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పరిసరాలను పరిశీలించారు.
మధ్యాహ్నం 12.05గంటలకు ఆలయం పక్కన ఉన్న సమావేశ మందిరానికి వెళ్లారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులు వాస్తు, ఆగమ శాస్త్ర నిపుణులు, అర్చకులతో రెండు గంటలకుపైగా సమీక్షించారు. 2.25 గంటలకు బయటకు వచ్చి, జేఎన్టీయూలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. 2.40గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.