కలెక్టరేట్, మే 22: తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను సాధించుకున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీటీచర్లకు పేస్కేల్ ఇప్పించిన ఘనత టీఎన్జీవోస్కే దక్కిందని స్పష్టం చేశారు. వీఆర్వోలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇతర శాఖల్లో సర్దుబాటు, తాజాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధ్దీకరణకు హామీ లభించడంలో కీలక భూమిక పోషించామని చెప్పారు. సోమవారం కరీంనగర్లో టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ను ఘనంగా సత్కరించారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాకు చేరుకున్న వీరికి సంఘం బాధ్యులు బైక్ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్ నుంచి సంఘం కార్యాలయం దాకా ఊరేగింపు చేపట్టారు. పటాకలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం టీఎన్జీవోస్ భవన్లో ఆత్మీయ సన్మానం చేశారు. వేద పండితులు వీరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సీపీఎస్ రద్దుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పీఆర్సీ, ఈహెచ్ఎస్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
సీపీఎస్ అమలు బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించిన కేంద్రం, 2004 నుంచి ఉద్యోగులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జమచేస్తున్న 20శాతం కంట్రిబ్యూషన్ మాత్రం తిరిగి చెల్లించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రంపై పోరాటానికి ఉద్యోగులందరం ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. అనంతరం టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా దారం శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంగెం లక్ష్మణ్రావు, కోశాధికారిగా ముప్పిడి కిరణ్, అసోసియేట్ అధ్యక్షుడిగా రాగి శ్రీనివాస్ ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు నరసింహాస్వామి, హర్మిందర్సింగ్, తిరుపతిరెడ్డి, ఎంఏ హమీద్, సత్యనారాయణగౌడ్, రాజేశ్ భరద్వాజ్, పరమేశ్వర్, విక్రంరెడ్డి, శంకర్, ప్రవీణ్, సుదర్శన్, మంజిత్సింగ్, శారద, సబిత, సునిత, కోట రామస్వామి, కాళీచరణ్, సుద్దాల రాజయ్య, అర్బన్ తహసీల్దార్ సుధాకర్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.