ధర్మపురి, నవంబర్1: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారు. ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ జరగనున్నది. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి సుమారు లక్ష మంది సభకు హాజరయ్యే అవకాశం ఉండగా, వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కమలాపూర్ రోడ్డు వైపు, జంబిగద్దె ఎదురుగా ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్, జగిత్యాల రోడ్డు వైపు వక్ఫ్బోర్డు స్థలంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. అలాగే హెలిప్యాడ్ నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలోనే సభకు ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. నాయకులకు, అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ అభిమానులు తరలిరావాలని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.