వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యం నెరవేరబోతున్నది. స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది. గతేడాది నవంబర్లో రామగుండం, జగిత్యాల మెడికల్ కాలేజీలు మొదలై దిగ్విజయంగా నడుస్తుండగా, శుక్రవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది.
నేడు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనుండగా, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పాల్గొననున్నారు. ఆయాచోట్ల కృతజ్ఞతగా భారీ ర్యాలీలు తీయనుండగా, అందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాకో వైద్య కళాశాల అందుబాటులోకి రానుండగా, ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు స్థానికంగానే వైద్య విద్యను అభ్యసించే అవకాశం లభించబోతున్నదని సంతోషంగా చెబుతున్నారు.
– కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)
సీట్లన్నీ మన ప్రాంతం బిడ్డలకే
తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు మెడికల్ కాలేజీలే ఉండేవి. వీటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) ఉమ్మడి ఏపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్నాయి. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీని ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నది. అంటే దాదాపు ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి పాలకులు తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండే కాలేజీలు. అవి.. ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ. మొత్తంగా చూస్తే కేవలం నాలుగు జిల్లాల్లోనే మెడికల్ కాలేజీలు ఉండేవి. దాంతో వైద్య విద్య కలగానే ఉండేది. ఎంబీబీఎస్ సీట్లకు కొరత ఉండడంతో ఔత్సాహిక విద్యార్థులు చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లి రూ.లక్షలు పెట్టి చదువుకోవాల్సి వచ్చేది. ఇలాంటి సమయాల్లో ఎంతో మంది మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అంతేకాదు, క్వాలిటీ విద్య కూడా అందడం లేదు. నిజానికి ఒక్క ఉమ్మడి జిల్లా నుంచే విదేశాలకు వెళ్లి ఏటా ఎంబీబీఎస్ చేస్తున్న వారి సంఖ్య 300 నుంచి 400 వరకు ఉంటుందని అంచనా. కానీ, స్వరాష్ట్రంలో ఈ పరిస్థితి మారుతున్నది. రాష్ర్ట ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన 34 వైద్య కళాశాలల్లోని 85 శాతం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ తెలంగాణ ప్రాంత విద్యార్థులకే చెందుతాయి. ఏటా 1,820 ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. అదే ఉమ్మడి జిల్లాలో చూస్తే.. జగిత్యాలలో 150 సీట్లు, రామగుండంలో 150 సీట్లు, అలాగే కొత్తగా ఏర్పాటయ్యే కరీంనగర్, సిరిసిల్లలో 100 సీట్ల చొప్పున మొత్తం 500 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
వీటితోపాటు కరీంనగర్లో ఉన్న మరో రెండు ప్రైవేట్ కాలేజీల్లో 400 సీట్లు ఉన్నాయి. దీంతో మన రాష్ట్ర బిడ్డలు ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడింది. జిల్లాల వారీగా ఏర్పాటైన కాలేజీల్లో ఆ జిల్లా నుంచే పదికిపైగా విద్యార్థులు సీట్లు దక్కించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో వైద్య విద్య కలసాకారం అవుతుండగా ఉమ్మడి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ప్రారంభోత్సవం
రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా గతేడాది నవంబర్ 15న ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించించింది. అప్పుడే జగిత్యాల, పెద్దపల్లి జిల్లా రామగుండంలో కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఆ కాలేజీల్లో ఫస్టియర్ తరగతులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం సెకండియర్ అడ్మిషన్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. తాజాగా, రాష్ట్ర వ్యాప్తంగా మరో తొమ్మిది కాలేజీలను శుక్రవారం వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అందులో మన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల కాలేజీలు ఉన్నాయి. ఆయాచోట్ల పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ హాజరు కానుండగా, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఏర్పాట్లను పరిశీలించారు. అయితే, కరీంనగర్లో 16 నుంచి తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శీలం లక్ష్మీనారాయణ తెలిపారు.
కరీంనగర్లో భారీ ఏర్పాట్లు
మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనుండగా, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా వేదికను ఏర్పాటు చేశారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, తదితరులు పాల్గొననున్నారు. రేకుర్తి నుంచి కొత్తపల్లి పరిధిలోని మెడికల్ కళాశాల వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ తీయనున్నారు. ఈ సమయంలో కరీంనగర్, జగిత్యాల రహదారిలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ నుంచి వెళ్లే వాహనాలు చింతకుంట మీదుగా వెలిచాల ఎక్స్రోడ్ మీదుగా జగిత్యాల వెళ్లడానికి, జగిత్యాల నుంచి వచ్చే వాహనాలు వెలిచాల ఎక్స్రోడ్ నుంచి కరీంనగర్ చేరుకోవాలని ఇప్పటికే సూచించారు.
కరీంనగర్/రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 14 (తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏమూల ఎవరికి ఏ కష్టం వచ్చినా సకాలంలో వైద్యం అందేది కాదు. మార్గం మధ్యలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. మరోవైపు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య కూడా అందని ద్రాక్షగానే ఉండేది. ఉద్యమ సమయంలో ఇవన్నీ కండ్లారా చూసిన కేసీఆర్.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య ప్రమాణాలను మెరుగు పరచడంపై దృష్టి సారించారు. పేదలకు మెరుగైన సేవలు అందిస్తూనే జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే గతేడాది నవంబర్ 15న జగిత్యాల, పెద్దపల్లి జిల్లా రామగుండంలో వైద్య కళాశాలలను హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన ఆయన, నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయాచోట్ల అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
కరీంనగర్, సెప్టెంబర్ 14 (తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ నిరంతర పర్యవేక్షణతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాగా, కళాశాల నిర్మాణానికి గతంలోనే 150 కోట్లను కేటాయించింది. కరీంనగర్కు సమీపంలోని కొత్తపల్లి పట్టణ శివారు విత్తనోత్పత్తి సంస్థకు చెందిన సుమారు 25 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే, 2023-24 విద్యా సంవత్సరంలోనే తరగతుల నిర్వహణకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో 7 కోట్ల నిధులు వెచ్చించి విత్తనోత్పత్తి సంస్థకు చెందిన నాలుగు గోదాములను కళాశాల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దింది.
తాత్కాలికంగా రెండు లెక్చరర్ గదులు, సెంట్రల్ లైబ్రరీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలు, హాస్టల్, స్టాఫ్ క్వార్టర్స్, ల్యాబ్, తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చింది. కళాశాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, ఇప్పటికే 90 సీట్లను భర్తీ చేశారు. అందులో 10 మంది విద్యార్థులు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. మొదటి సంవత్సరం అటానమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ తరగతులు నిర్వహించనున్నారు. అవసరమైన ఫ్యాకల్టీలో ఐదు ప్రొఫెసర్, మరో ఐదు అసోసియేట్ ప్రొఫెసర్స్, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, తదితర పోస్టులను ఇప్పటికే భర్తీ చేశారు. పరిపాలనా విభాగానికి అవసరమైన అన్ని పోస్టులను భర్తీ చేశారు.