డోర్నకల్ ;‘కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే. చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి జగదీశ్రెడ్డిలకు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నీటి పన్ను ఉన్నదని, తెలంగాణలో నీటి తీరువాను, పాత బకాయిలను రద్దు చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే కాలువల్లోకి నీళ్లు వచ్చాయని, వెన్నవరం, పెన్పహాడ్ కాలువల్లో బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయన్నారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగించిన పాపం కాంగ్రెస్దేనని అన్నారు. కాంగ్రెస్ను నమ్మితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లేనని అన్నారు. ఇక తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటూ వేయొద్దన్నారు. బీజేపీకి ఓటేస్తే మోరీల పారేసినట్లేనని అన్నారు. యుద్ధం చేసేటోని చేతిలోనే కత్తి ఉండాలని, పంట పొలాల్లో నీళ్లు పారాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి జగదీశ్రెడ్డిలను నిండు మనసుతో దీవించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.