ధర్మపురి, జూన్13: ‘మహిళా సాధికారత, సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేస్తున్నారు. అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలి. దేశానికే ఆదర్శంగా నిలవాలి’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ధర్మపురి ఎస్హెచ్ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవానికి హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం మాట్లాడారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు సీఎం కేసీఆర్ మానవీయకోణాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. మహిళా సంక్షేమానికి ప్రతి బడ్జెట్లో వేలాది కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ కిట్ ద్వారా 13,90,636 మందికి సాయం చేశామని, మహిళల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ అందజేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు రక్షణగా సఖీ కేంద్రాలు, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇవి దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నాయని వివరించారు. నాడు ఏ ఊళ్లో చూసినా మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం గ్రామాల్లోని బావులు, బోర్ల వద్ద కనిపిస్తుండేవారని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ భగీరథుడిలా మారి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందిస్తున్నారని కొనియాడారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించింది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించేందుకు, సేవలు సమర్థవంతంగా అందించేందుకు వారి జీతాలను స్వరాష్ట్రంలో 300శాతం పెంచామని గుర్తుచేశారు. అలాగే మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. కాగా, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళ ఉద్యోగులను మంత్రి ఈశ్వర్, కలెక్టర్ యాస్మిన్ భాషా శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీలు ఎడ్ల చిట్టిబాబు, బాధినేని రాజమణి, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, సుధారాణి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో ప్రవీణ్, ఐసీడీఎస్, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం
మహిళ ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటేనే సమాజం బాగుంటుందనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ మహిళ సంక్షేమంపై దృష్టి సారించారు. అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం ఉచితంగా అన్ని రకాల పరీక్షలు చేయిస్తున్నది. అలాగే ఆరోగ్య లక్ష్మి కింద ప్రభుత్వ దవాఖానలో కాన్పు అయితే మగశిశువుకు రూ.12వేలు, ఆడపిల్లకు రూ.13వేల సాయాన్ని అందజేస్తున్నది. జిల్లాలో 23,734 మందికి కేసీఆర్ కిట్లు అందజేశాం. 34,275 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 3769 మందికి షాదీ ముబాకర్ సాయం ఇచ్చాం. జిల్లాలోని 380 గ్రామాల్లో 201 మంది మహిళా సర్పంచులు ఉండడం గర్వకారణం. 18 జడ్పీటీసీ స్థానాల్లో 9 మంది మహిళలే ఉండడం గొప్ప విషయం.
– యాస్మిన్ బాషా, కలెక్టర్