చొప్పదండి, ఆగస్టు 22: సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు నడిపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అసెంబ్లీ సమావేశాల్లో పీహెచ్సీని100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో దవాఖాన నిర్మాణం కొరకు రూ.37 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో గతంలో 30 పడకలు ఉన్న దవాఖాన 100 పడకల దవాఖానగా మారనున్నది. దవాఖాన నిర్మాణం కొరకు పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న మూడు ఎకరాల 28 గుంటల స్థలాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంబంధిత అధికారులతో పరిశీలించారు. అధికారులు దవాఖాన నిర్మాణం కొరకు స్థలం వివరాలను నిర్ధారించి, నివేదిక తయారు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
తగ్గనున్న వ్యయప్రయాసాలు
క్లిష్టమైన ఆరోగ్యసమస్యలు వస్తే మండలవాసులు కరీంనగర్ నగరానికి పరుగులు పెడుతున్నారు. ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి వేలకు వేలు ఫీజులు, మెడిసిన్ కు చెల్లిస్తున్నారు. చొప్పదండి దవాఖాన అప్గ్రేడ్ అయితే ఇక అలాంటి వ్యయప్రయాసలకు తావే ఉండదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వైద్యారోగ్యశాఖ దవాఖానలో అధునాతన వైద్యపరికరాలు సమకూర్చనున్నది. వైద్యపరీక్షలకు అత్యాధునిక ల్యాబ్ అందుబాటులోకి రానున్నది. దవాఖానలో 9మంది సివిల్ సర్జన్లు, 12 మంది డిప్యూటీ సివిల్ సర్జన్లు, 25 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 45 నుంచి 50 మంది నర్సులు, ఐదుగురు ఫార్మసిస్ట్లు, ఆరుగురు ల్యాబ్ అసిస్టెంట్లు ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. దవాఖాన అందుబాటులోకి వస్తే చొప్పదండి మండలంతో పాటు, జులపల్లి, రామడుగు, ధర్మారం మండలాలకు చెందిన ప్రజలకు వైద్యసేవలు చేరవవుతాయి. దవాఖానను అప్గ్రేడ్ చేస్తున్నందుకు మండలవాసులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
త్వరగా నిర్మాణం చేస్తాం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మేజర్ గ్రామపంచాయతీ ఉన్న చొప్పదండిని మున్సిపాలీటీగా మార్చారు. మున్సిపాలిటీని సుమారు రూ. 120 కోట్ల నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నా. చొప్పదండిలో ఉన్న పీహెచ్సీని 30 పడకల దవాఖానను వంద పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేయాలని కోరగా, సీఎం కేసీఆర్, హరీశ్రావు వెంటనే మార్చారన్నారు. పనులను త్వరగా ప్రారంభించి యుద్ధప్రాతిపదికన వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడతాం.
-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
దవాఖాన అప్గ్రేడ్ అయిన తర్వాత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. మండలంలోని పీహెచ్సీ అప్గ్రేడ్ కావడంతో ప్రజలకు మరింత దగ్గరగా సేవలు అందుతాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కృషి చాలా ఉంది. మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్కు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు
– గుర్రం నీరజ, మున్సిపల్ చైర్పర్సన్ చొప్పదండి
తీరనున్న ప్రజల కష్టాలు
చొప్పదండి పట్టణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు అంది ప్రజల కష్టాలు తీరుతాయి. పట్ణణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే కృసిచేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు, మంజూరు చేసిన మంత్రి హారీశ్ రావుకు,సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
– మాచర్ల సౌజన్య, జడ్పీటీసీ చొప్పదండి
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
మా ఊర్లోని చిన్న దవాఖానను పెద్ద దవాఖానగా మారుతుందని తెలిసింది. సీఎం కేసీఆర్ సార్ పేదల గురించి ఆలోచించే గొప్ప నాయకుడు. కాబట్టే సరారు దవాఖానలను బాగు చేస్తున్నారు. మాలాంటి పేదోళ్లు ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డబ్బులు గుల్లా చేసుకోకుండా మంచిపని చేస్తున్నారు. కేసీఆర్ సార్కు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఏదైనా పెద్ద ఆరో గ్య సమస్య వస్తే కరీంనగర్ నగరానికి పోయేటోళ్లం. బస్సు ఖర్చులు, వైద్యం ఖర్చులు భరించలేని పరిస్థితి. ఇప్పుడు మాఊర్లోని పీహెచ్సీ పెద్ద దవాఖానగా మారుతుండడంతో మా కష్టాలు తీరుతాయి.
-కల్లెపెల్లి కోమల, చొప్పదండి