రైతన్నలు, నేతన్నల ముందు ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలు పారలేదు.. మోసపూరిత మాటలు.. ప్రలోభాలు పనిచేయలేదు..ఎత్తులు ఫలించలేదు.. అభివృద్ధి, సంక్షేమంవైపే సకలజనం నిలిచింది. నిరంతరాయంగా ఉచితంగా కరెంట్ ఇస్తున్న సర్కారుకే జైకొట్టింది. అమాత్యుడు రామన్నకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఏకపక్షంగా పట్టం గట్టింది. వెరసీ సెస్పై మరోసారి గులాబీ జెండా ఎగిరింది.
భారత రాష్ట్ర సమితి విజయభేరీ మోగించింది. బీఆర్ఎస్గా మారిన అనంతరం మొదటిసారి జరిగిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెట్(సెస్) ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకుగాను 15 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలువగా, మరోసారి సెస్పై గులాబీ జెండా రెపరెపలాడింది. జాతీయ పార్టీగా రూపుదిద్దుకున్న తర్వాత అఖండ విజయం సాధించడంతో గులాబీశ్రేణుల్లో జోష్ నెలకొన్నది.
– కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), వేములవాడ
కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేములవాడ : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ఎన్నికల్లోవార్ వన్సైడ్ అయింది. 15 డైరెక్టర్ స్థానాలనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. శనివారం పోలింగ్ జరుగగా, 87,130 మంది ఓటర్లకుగాను 73,189 మంది (84శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం వేములవాడ ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అథారిటి సుమిత్ర, సెస్ ఎన్నికల అధికారి మమత పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపును ప్రారంభించారు. 202 పోలింగ్ కేంద్రాల్లోని 252 బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను తెరిచి వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల వారీగా లెక్కించారు.
మొదటగా రుద్రంగి, వీర్నపల్లి ఫలితారాగా, 12 స్థానాలకు సంబంధించిన ఫలితాలను రాత్రి తొమ్మిది గంటల వరకు వెల్లడించారు. మిగిలిన వేములవాడ రూరల్ డైరెక్టర్ స్థానానాకి రీకౌంట్ నిర్వహించి, రాత్రి 11 గంటల వరకు ఫలితం వెల్లడించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థ్థి ఆకుల దేవరాజు గెలిచారు. సుమారు 13 గంటలపాటు లెక్కింపు జరగగా, 15స్థానాల్లోనూ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కౌంటింగ్ ప్రక్రియను కోఆపరేటివ్ ఎన్నికల అధికారులతోపాటు కలెక్టర్ అనురాగ్జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డే పరిశీలించారు. ఇక మండలాల వారీగా జరిగిన డైరెక్టర్ స్థానాలకు వచ్చిన ఫలితాలను నేరుగా ఎన్నికల అధికారి మమత ప్రకటించి డిజిటల్ ఎల్ఈడీ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించారు.
అభివృద్ధికే పట్టం
స్వరాష్ట్రంలో సిరిసిల్ల ఎంతో ప్రగతి సాధించింది. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. అమాత్యుడి చొరవతో వ్యవసాయం, వస్త్రపరిశ్రమ పండుగలా మారింది. ప్రభుత్వం నేతన్న సంక్షేమానికి అండగా నిలిచింది. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్, సర్కారు విద్యార్థుల యూనిఫాం దుస్తుల తయారీ ఆర్డర్లలతో చేతినిండా పని కల్పించింది. అలాగే మరమగ్గాలకు 50 శాతం విద్యుత్ రాయితీని ఇచ్చింది. ఇంకా కోట్లాది రూపాయలు వెచ్చించి అనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. అలాగే మెట్టప్రాంతమైన జిల్లాను సస్యశ్యామలం చేసింది.
ప్రాజెక్టులు నిర్మించి, గోదావరి జలాలను పారించింది. నాడు ఎడారిని తలపించిన జిల్లాలో నేడు భూగర్భజలాలు 6 మీటర్లకు ఎత్తుకు పెరిగి యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి లోను చేస్తున్నది. ఇంకా వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ ఇచ్చింది. దేశంలోనే తొలి సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడడమే కాదు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా తీర్చిదిద్దింది. నాడు రెండు మూడు మండలాలకో సబ్ స్టేషన్ ఉంటే, నేడు రెండు గ్రామాలకో సబ్ స్టేషన్ ఏర్పాటైంది. ఇదంతా కండ్లముందే కనిపిస్తుండగా, సిరిసిల్ల ప్రజానీకం ప్రతిపక్షాల మాటను తిప్పికొట్టింది. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు జైకొట్టి, అభివద్ధికే పట్టం కట్టింది.
ప్రభావం చూపిన రామన్న సందేశం
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం (ఈ నెల 23న) మంత్రి కేటీఆర్ జిల్లా రైతులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద యం నుంచి మధ్యాహ్నం దాకా 13 మండలాల్లోని అన్నదాతలతో ముచ్చటించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సిరిసిల్లలో జరిగిన వివరిస్తూనే.. తెలంగాణ రాక ముందు ఎలా ఉన్నదో.. ఇప్పుడెలా ఉన్నదో పోల్చి చూడాలని సూచించారు. ఎనిమిదిన్నరేండ్లలో రైతులు, నేతన్నలు, ఇలా అన్ని వర్గాలకు అండగా ఉన్నామని, మీకు మంచి చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని నొక్కి చెప్పారు. సెస్ను కాపాడుకోవాలని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. ఇలా అమాత్యుడు ఫోన్ చేసి మాట్లాడడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. చేసిన అభివృద్ధి, సంక్షేమం కండ్ల ముందరే కనిపించడంతో ఆయన సందేశం ప్రభావం చూపింది. పోలింగ్ రోజు ఎన్నడూ లేనివిధంగా ఓటోత్సాహం కనిపించగా, ఆ రోజే గులాబీ గెలుపు ఖాయమైంది.
పెరిగిన పోలింగ్తోనే స్పష్టం
సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు నల్లేరు మీద నడకేనని ఓటింగ్ రోజే తేలిపోయింది. శనివారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. గెలుపు ఏకపక్షమనే అభిప్రాయం ఆ రోజే వ్యక్తమైంది. నిజానికి సెస్ చరిత్రలో ఎప్పుడూ ఓటింగ్ 75 నుంచి 80శాతం దాటలేదు. కానీ, ఈ సారి మాత్రం 84 శాతం (87,130) రికార్డుస్థాయిలో నమోదుకావడంతో గులాబీ జోష్ కనిపించింది. భారీ ఓటింగ్పై సర్వత్రా చర్చ జరగ్గా, మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్లో ఇచ్చిన సందేశంతోనే జనచైతన్యం వెల్లువెత్తిందని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికే ఓటర్లు జైకొట్టారని, తమ గెలుపు ఏకపక్షమని ధీమా వ్యక్తం చేశారు.
సిరిసిల్ల సెగ్మెంట్లో భారీ ఆధిక్యం
అన్ని స్థానాల్లో ఫుల్ మెజారిటీ
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, డిసెంబర్26: సిరిసిల్ల సెగ్మెంట్లోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు భారీ ఆధిక్యం సాధించింది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఎనిమిది సెస్ డైరెక్టర్ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఫుల్ మెజారిటీతో విజయభేరీ మోగించారు. ప్రజలంతా మంత్రి కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులకు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు విశ్వాసాన్ని చాటారు.
పట్టణపరిధిలోని టౌన్-1 స్థానంలో దిడ్డి రమాదేవి సమీప బీజేపీ మద్దతు పరిచిన అభ్యర్థి మోర శైలజపై 548 ఓట్లమెజార్టీతో గెలిచారు. ఇక సిరిసిల్ల టౌన్-2 పరిధిలో దార్నం లక్ష్మీనారాయణ తన ప్రత్యర్థి బీజేపీ మద్దతుదారుడైన సుభాష్రావుపై 2433 భారీ మెజార్టీతో విజయం సాధించారు. తంగళ్లపల్లి డైరెక్టర్గా చిక్కాల రామారావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై జలగం ప్రవీణ్పై 2545 ఓట్లు మెజార్టీ సాధించారు. గంభీరావుపేట అభ్యర్థి గౌరినేని నారాయణరావు తన సమీప బీజేపీ మద్దతునిచ్చిన అశోక్పై 2718 ఓట్లు భారీ మెజార్టీ సాధించారు.
ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్గా వరుస కృష్ణహరి తన సమీప ప్రత్యర్థి బీజేపీ మద్దతునిచ్చిన గుండాడి వెంకట్రెడ్డిపై 466 ఓట్లతో, వీర్నపల్లి సెస్ డైరెక్టర్గా మాడ్గుల మల్లేశం యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీజేపీ మద్దతుదారుడైన జీ లక్పత్పై 517ఓట్ల తేడాతో గెలిచారు. ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ స్థానానికి సందుపట్ల అంజిరెడ్డి తన సమీప బీజేపీ బలపరిచిన అభ్యర్థి మట్ట వెంకటేశ్వర్రెడ్డిపై1936 ఓట్లతో విజయం సాధించారు. ఇక ఇల్లంతకుంటసెస్ డైరెక్టర్గా మల్లుగారి రవీందర్రెడ్డి తన ప్రత్యర్థి స్వతంత్య్ర అభ్యర్థి మద్దతునిచ్చిన భూంపల్లి రాఘవరెడ్డిపై 1628 ఓట్లతో గెలించారు.