వేసవిపూట పేదోడి ఫ్రిజ్ రంజన్కు ఆదరణ పెరుగుతున్నది. ఫ్రిజ్లు, వాటర్ కూలర్లలోని నీటి కన్నా.. మట్టిపాత్రల్లోని నీరు ఆరోగ్యదాయకం కావడంతో వీటికి డిమాండ్ ఉంటున్నది. ఎండలతోపాటే కొనుగోళ్లు పెరుతుండగా, తయారీదారుల్లో సంతోషం కనిపిస్తున్నది.
జగిత్యాల, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : ఎండకాలం మొదలైందంటే చాలు.. ఏ ఇంటనైనా మట్టికుండనో, సురాయినో ఉండాల్సిందే. ఇది దశాబ్దం కిందటి మాట! కానీ, కాలక్రమేణా ఆధునీకరణ మోజుకు మట్టి పటువ ఆదరణ కోల్పోయింది. వీటి స్థానాన్ని ఫ్రిజ్లు, వాటర్ కూలర్లు ఆక్రమించాయి. మట్టి కుండలు, రంజన్లు, సురాయిలు కనుమరుగు కాగా, వీటి తయారీపై ఆధారపడ్డ వారు క్రమంగా ఇతర వృత్తులవైపు మళ్లాల్సి వచ్చింది. కానీ, కరోనా తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది.
ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెరిగి, పూర్వ పద్ధతుల ఆచరణపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పూర్వకాలం నాటి పద్ధతుల్లో ఆహార, ఆరోగ్య రహస్యాలు దాగి ఉండడంతో మనుషులు మళ్లీ అటువైపు మళ్లుతున్నారు. కాటన్ దుస్తుల వినియోగం, రాగి, ఇత్తడి పాత్రల వినియోగం మొదలు పెట్టారు. ఫ్రిజ్, వాటర్ కూలర్లలో నిలువ చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి, మళ్లీ మట్టి పాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, వేసవి ప్రవేశించినప్పటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రంజన్లను జోరుగా విక్రయిస్తున్నారు.
ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్తోపాటు ఎక్కువగా ‘ఆదిలాబాద్ రంజన్లను అమ్ముతున్నారు. ఐదు లీటర్ల నుంచి ఇరవై లీటర్ల సామర్థ్యం ఉన్న రంజన్లు అందుబాటులో ఉంచుతున్నారు. కాలానికి అనుగుణంగా రంజన్లకు నళ్లాలను (కొలాయిలు) కూడా అమర్చుతున్నారు. వేసవి మొదలైనప్పటి నుంచి నిత్యం పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారు. గతంలో కుండలు, చిన్న,పెద్ద సురాయిలను అమ్మినా.. ఇప్పుడు వాటికి ఆదరణ లేక తయారీ దాదాపుగా నిలిచిపోయిందని అమ్మకందారులు చెబుతున్నారు. కేవలం రంజన్లను అమ్ముతున్నామని, 100 నుంచి మొదలుకొని 300 వరకు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. రంజన్లు, మట్టి కుండలతోపాటు, అన్నం వండుకునే పాత్రలను సైతం అమ్ముతున్నామంటున్నారు.
ఫ్రిజ్లు, నీటి కూలర్లు, ప్లాస్టిక్ డబ్బాల్లోని నీరు తాగితే గొంతు సంబంధ సమస్యలు వస్తున్నాయి. ఫ్రిజ్ నీళ్లు తాగితే దాహం తీరడం లేదు. అందుకే ఇప్పటికీ రంజన్లోని నీటినే తాగుతున్నాం. రంజన్ నీరు చల్లగా ఉండడంతోపాటు మట్టిలో ఉన్న రసాయన పదార్థాలు అందులోని సూక్ష్మక్రిములను సంహరిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఫ్రిజ్లు ఇంట్లో వాడినా ఇప్పటికీ రంజన్ నీళ్లను మాత్రమే తాగుతున్నాం.
– మ్యాడారం రాములు (రిటైర్డ్ టీచర్)
మేం కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు సురాయిల్లో నీటిని నింపుకొని తాగేది. పెద్ద కుటుంబాలు ఉన్న ఇండ్లల్లో పెద్దపెద్ద కుండలు, కొంత ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్లు రంజన్లు వాడేది. విద్యార్థుల గదుల్లో మాత్రం సురాయిలే ఉండేది. సింహం మూతి ఆకారంలో సురాయిలు అందంగా కనిపించేవి. జానపద చిత్రాల్లో రాజులు సురాయిల్లో నీళ్లు పోసుకొని తాగినట్లుగా మేం సురాయిల్లో నీళ్లు పొసుకొని తాగి ఫీలయ్యే వాళ్లం. కాలం మారింది. ఫ్రిజ్లు, కూలర్లే కనిపిస్తున్నాయి. అయినా రంజన్లలో చల్లగైన నీటిని మించిన నీరు లేదు. మట్టివాసనతో కూడిన చల్లని నీటిని తాగితే కలిగే తృప్తే వేరు.
– డాక్టర్ మామిడిపెల్లి సత్య ప్రకాశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జగిత్యాల)