మాది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం. నాకు ఒకప్పుడు 12 ఎకరాల భూమి ఉండేది. అప్పట్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నా నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేదు. అపుడు ఈ ప్రాంతంలో భూములకు రేట్లు లేవు. ఇరవై ఏండ్ల కింద 12 ఎకరాల్లో 14 వేలకు ఎకరం లెక్కన మూడెకరాలు అమ్ముకున్న. అపుడు మా ఊళ్లల్ల బతుకుడే కష్టముండే. ఈ ప్రాంతంల భయంకరమైన కరువు ఉండేది. 30 మీటర్ల లోతు బావులు తవ్వినా రెండెకరాలు పారకపోవు. అందుకే ఈ ప్రాంతంల భూములు కొనెతానికి ఎవరూ ముందుకు రాకపోవు. మూడేండ్లకెళ్లి తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ కింద నీళ్లిస్తున్నరు.
తరాల తరబడి నీళ్లు లేక బీళ్లుగా ఉన్న మా భూములు ఇప్పుడు బంగారం పండిస్తున్నయి. ఒకప్పుడు ఎకరానికి 14 వేలకు అమ్మిన నా భూమి ఇపుడు అదే ఎకరానికి రూ.30 లక్షలు. మూడేండ్లళ్ల ఇసోంటి పరిస్థితి చూస్తమని ఏనాడు అనుకోలె. మూడేండ్ల కింద రోడ్డు పక్కన ఉన్న నా భూమి 10 లక్షలకు ఎకురం ఉండె. ఇపుడు రూ.90 లక్షలు, రూ.కోటికి అడుగుతున్నరు. దీనికి కారణం కాళేశ్వరం నీళ్లు రావడమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంల ఉంటే మా పరిస్థితి ఇట్ల ఉండేటిది కాదు. ఎక్కడేసిన గొంగడి గక్కన్నే అన్నట్టే మా పరిస్థితి ఉండేది. ఇపుడు సుతం తప్పిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీళ్లియ్యరు. కరంటియ్యరు. మల్ల ఎప్పటి సిప్ప ఎనుగుల్నే అన్నట్టు మా బతుకులు ఆగమైతయి. అందుకే రైతులు సోయి లేకుంట ఓట్లేయ్యద్దు..
– ముసుకుల కిష్టారెడ్డి, సీతారాంపూర్, చిగురుమామిడి మండలం
ఎండుగులా మారిన వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఈ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చింది. అన్ని విషయాలను పక్కన పెట్టి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించి చేయూతనిచ్చింది. 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం వంటి విప్లవాత్మక ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీటి వ్యవస్థను పటిష్ట పర్చింది. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యకు పురికొల్పిన అంశాలను పరిశీలించి ఆ వ్యవస్థల నాడిపై దెబ్బకొడుతూ రైతుబంధు పేరుతో వ్యవసాయానికి పెట్టుబడి సహాయాన్ని అందించింది. రైతులు అప్పుల పాలు కాకుండా రక్షణ కల్పించింది. భూగర్భ జలాలను వృద్ధి చేసే లక్ష్యంతో మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలను పునరుద్దరించింది.
పుష్కలమైన నీళ్లు, నాణ్యమైన కరెంట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు ఎకరం, రెండెకరాలు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఉన్న భూమి మొత్తాన్ని సాగులోకి తెచ్చుకుని బంగారు పంటలు పండిస్తున్నారు. ఈ సంస్కరణలతో వ్యవసాయం గాడిలో పడడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారింది. ఒకప్పుడు అప్పుల కోసం చేయిచాపిన రైతులు ఇప్పుడు ఇతరులకు అప్పులు ఇచ్చి ఆదుకునే స్థితికి వచ్చారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల కనబరుస్తున్న ప్రాధాన్యతను జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీటిని రైతులకు దూరం చేయాలనే కుట్ర కోణంలో ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పదేళ్లలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా రైతులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. రైతులు బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా ఉన్నారని విషయాన్ని గ్రహించిన ఆ పార్టీ రైతులపై విచక్షణా రహితంగా విషాన్ని చిమ్ముతోంది. ఒకవేళ తప్పిదారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు రైతులు ప్రయోజనం పొందుతున్న వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉన్నది. ఒకప్పుడు నీళ్లు, కరెంట్ లేక రైతుల భూములకు ధరలు ఉండేవి కావు. ఇప్పుడు ఈ సదుపాయాలు కల్పించిన తర్వాత గత మూడు నాలుగేళ్లలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రధాన రహదారుల వెంట ఉన్న భూములకు ఎకరాకు రూ.కోటి నుంచి రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది.
ఏ మారుమూల ప్రాంతమైనా ఎకరాకు రూ.50 లక్షలకు తక్కువ ధరలు లేవు. ఇప్పుడు తప్పిదారిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ మునుపటి పరిస్థితులు పునరావృతం కాకతప్పదనే చర్చ జరుగుతోంది. అంతే కాకుండా, ధరణి వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఇప్పటి వరకు రైతుల చేతిలో ఉన్న భూములు తిరిగి అధికారుల చేతికి వెళ్లిపోతాయి. రైతుబంధుకు ధరణి వ్యవస్థ ఇప్పటి వరకు సమాచార కేంద్రంగా ఉంది. దీనిని తొలగిస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి పహాణీకో, లేదా మరేదైనా సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అంతే కాకుండా, ఈ వ్యవస్థను రద్దు చేసి గతంలో ఉన్న రకరకాల కాలమ్స్ను జోడిస్తే ఇప్పటి వరకు రైతులకు ఉన్న హక్కులు వికేంద్రీకరించబడి సంబంధం లేని వ్యక్తులకు హక్కులు సంక్రమించే ప్రమాదం పొంచి ఉంది. అటు నీళ్లు, కరెంట్, ఇటు ధరణి తొలగింపు వల్ల కలిగే అనర్థాలు వెరచి భూముల ధరలు పదేళ్ల ముందు ఉన్న వాటి కంటే మరీ అధ్వానంగా పడిపోక తప్పని పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పదేండ్లు కష్టపడి నిర్మించుకున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలక తప్పదని, మునుపటిలాగే గ్రామీణ ప్రాంత యువత వలసలు వెళ్లే పరిస్థితులు వస్తాయనే భయపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ల కరెంట్ కష్టాలు తప్పవు. ఇప్పుడు 24 గంటలు ఫుల్ కరెంట్ ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో రాత్రుళ్లు కరెంట్ ఇచ్చేవాళ్లు. అదికూడా ఎప్పుడు ఇత్తరో తెలవదు. కరెంట్ కోసం ఎదురుచూసి కరెంట్ వచ్చిన తర్వాత అందరూ రైతులు ఒక్కసారే మోటర్లు ఆన్చేస్తే లోవోల్జేజితో మోటర్లు కాలిపోతుండే. ఏడాదిలో కనీసం మూడు, నాలుగు సార్లయిన మోటర్లు కాలిపోయిన రోజులు ఉన్నాయి. కాని ఇప్పుడు నాణ్యమైన కరెంట్ వస్తుండడంతో మోటర్లు కాలిపోతలేవు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు చూసినం. మళ్లీ వాటిని కొని తెచ్చుకోం. అందుకే మాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి. మళ్లీ కేసీఆర్ సారే రావాలి.
-బాషబోయిన సంపత్ యాదవ్, రైతు (మానకొండూర్)
కరీంనగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించింది. కరెంట్, నీళ్లు లేక రైతులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంట్ కోసం ఆందోళనకు దిగిన రైతులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించి గుర్రాలతో తొక్కించి చంపిన సందర్భాలను సైతం అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. రాత్రి మూడు గంటలు, పొద్దంతా నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతుల ఉసురు పోసుకుని పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికీ అదే తీరుతో రైతులపై విరుచుకుపడుతోంది.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ సీఎం కేసీఆర్ దుబారాకు పాల్పడుతున్నారని, కేవలం మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ విషయాన్ని రైతులు మర్చిపోకముందే తను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ 10 హెచ్పీ మోటర్లు పెడితే మూడెకరాలు మూడు గంటల్లో పారుతుందని చెప్పడంతో రైతులకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అంతే కాకుండా, రైతుల భూములకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చి పట్వారీ వ్యవస్థను తొలగించారు. అధికారుల చేతిలో ఉన్న భూములనే రైతుల చేతిలో పెడుతూ ధరణి పేరుతో ఒక పటిష్టమైన వ్యవస్థను తెచ్చారు. దీనిపైనా కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అధినేత రాహుల్గాంధీ ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పడం రైతుల్లో కలకలం సృష్టిస్తోంది..
టెన్ హెచ్పీ మోటర్లు వాడితే బాయిల వచ్చే నీటి ఊట సరిపోతదా. ఇప్పటి వరకు ఉన్న మోటర్లకు ఊట అందేది. అంత పెద్ద మోటర్లు పెడితే గంట సేపట్ల ఖతమైతయ్. అంత ప్రెషర్తోటి పోస్తె నీళ్లెట్ల కట్టాలి. ఒడ్డు కట్టలు ఎక్కడికక్కడ తెగిపోతయ్. అంత పెద్ద మోటర్లకు కరెంటు కావాల్నంటే ట్రాన్స్ఫార్మర్లు మొత్తం మార్చాలె. ఒకటేసారి అందరూ మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్.. మోటర్లు లో వోల్టేజీతో కాలిపోతయ్. ఇంకా మీటర్లు పెడతామంటున్నరు. గింత పెద్ద మోటర్లకు ఎంత బిల్లు రావాలె. అదంతా ఎవరు కట్టాలె.. నాకున్న ఏడున్నర ఎకురాలకు మూడ గంటల కరెంటు ఏ మూలకు సాలుతది. నాలాంటి వాళ్లెందరో రైతులు నష్ట పోతరు? గీ మాత్రం కాంగ్రెస్ నాయకులకు సోయి లేదా? తెల్వదా?. నాడు సమైక్య రాష్ట్రంల కరెంటు కష్టాలు చూడలేదా? మోటర్లు కాలిపోతే వాటికయ్యే ఖర్చు ఎంతయ్యేదో తెల్వదా?. బుద్ధున్నోడు మళ్లీ ఆ కష్టాలు మళ్లీ తెచ్చుకుంటడా?. నాటి సర్కారుల ఉన్నోళ్లు గీ కాంగ్రేసోళ్లు కాదా?.
– గాజర్ల మల్లా రెడ్డి, రైతు, ముంజంపల్లి(మానకొండూర్)
కాంగ్రెస్ను నమ్మితే రానున్న రోజుల్లో భూములు అమ్ముకోవాల్సి వస్తది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ చాలా మంచిగున్నది. దీంతోటి నిమిషాలల్ల భూమి రిజిస్ట్రేషన్ అయితంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుంట వారం రోజులల్ల పట్టాదారు పాస్బుక్ ఇంటికి వస్తంది. మన భూమి అమ్మాలన్నా.. మన వేలు ముద్ర అవసరం. ఎంత గొప్ప అధికారులు అయినా ఏం చేయలేరు. ఏ అధికారికి, దళారికి రూపాయి ఇవ్వాల్సిన అవపరం లేకుంట ఈజీగా రిజిస్ట్రేషన్ అయితంది. కాంగ్రెస్ అచ్చేది లేదు.. సచ్చేది లేదుగానీ, ధరణిని రద్దు చేస్తాంటున్నరు. అట్ల చేస్తే మళ్లీ దళారులు, అవినీతి అధికారుల రాజ్యం మొదలైతది. రైతులు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తది. ఇప్పటి దాక కాంగ్రెస్తోని పడ్డ బాధలు చాలు. రైతులకు మేలు జేస్తున్న ధరణి కోసమైనా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలె.
-యార కుమార్, యువరైతు, రామకృష్ణాపూర్ (వీణవంక)
మూడు గంటల కరెంటుతో ఏం పారుతదో చెప్పాలే. మడి కూడా తడ్వదు. ఎవుసం ఉన్నోడు.. ఎవుసం చేసేటోడు ఎవడూ మాట్లడడు. ఎవుసం చేసేటోడికి తెల్తది. ఎంత కరెంటిత్తే.. ఎన్ని ఎకరాలు పారుతదో. ఎవుసం గురించి తెల్వనోనికి ఓటెట్లా ఏత్తం. వేసేదే లేదు. పదేళ్లుగా 24గంటల కరెంటును సూత్తనం. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినంక.. చెరువులల్ల పూటిక తీసినంక.. బావులల్ల నీళ్లు బాగున్నయ్. మోటార్లు పెట్టుకుంటున్నం. పొలాలు మంచిగ పారుతున్నయ్. ఎండిపోతలేవు. పంటలు పండుతున్నయ్. కడుపు నిండా తింటన్నం. కంటినిండా నిద్రపోతున్నం. కాంగ్రెస్సోళ్ల మాటలు నమ్మితే రైతన్నోడు సచ్చుడే. సంపే పార్టీలను ఎందుకు గెలిపిత్తం. బీఆర్ఎస్కే ఓటేత్తం. సీఎం కేసీఆర్నే గెలిపించుకుంటం.
-గుర్రం మల్లారెడ్డి, రైతు, ఎడ్లపల్లి(జమ్మికుంట)
రైతులతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతంది. రైతులకు ఇప్పుడు 5 హెచ్పీ మోటర్లు సరిపోతన్నయి. 24 గంటల కరెంట్, పుష్కలంగా నీళ్లు ఉన్నయి కావట్టి ఏ ఇబ్బంది లేకుంట పంటలు పండిస్తున్నరు. 10 హెచ్పీ మోటర్లు పెడితే బావుల్లోని నీళ్లు రెండు గంటలల్ల ఖాళీ అయితయి. 10 హెచ్పీ మోటర్ కొనాలంటే రూ.75 వేలదాక ఖర్చు అయితది. బీఆర్ఎస్ సర్కారు అచ్చినంక వ్యవసాయానికి కరెంట్ మంచిగ అందుతంది. ఒక్కసారి మోటర్ పెట్టి అస్తే పొలం మొత్తం పారుతంది. మళ్ళా కాంగ్రెస్ అత్తే ఎనుకటి రోజులు అత్తయి. రైతులకు కండ్లల్ల నీళ్లే మిగులుతయి. కాంగ్రెసోళ్ల మాయమాటలకు మోసపోయేది లేదు. రైతులతో చెలగాటం ఆడుతన్రు. వాళ్ళను నమ్మి ఆగమయ్యేది లేదు. మళ్లా బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటం.
-తాండ్ర శంకర్, రైతు, చల్లూరు (వీణవంక)
కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు చూసినం. ఇప్పుడా కష్టాలన్నీపోయి ప్రశాంతంగా ఎవుసం చేసుకుంటున్నం. ఇలాంటి సమయంలో ఎవుసానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడే నాయకులకు రాష్ర్టాన్ని అప్పగించలేం. చూస్తూ, చూస్తూ మళ్లీ కరెంటు కోతలు తిరిగి తీసుకువచ్చుకోలేం కదా. ఆ పార్టీ వస్తే రైతుల ఆగమైతరు.. వ్యవస్థనే నాశనమైతది. భూముల రేట్లు పడిపోతయ్.. ఎవుసం మూలకు పడుతది. మళ్లీ వలసలు పోవాల్సి వస్తది. రైతుల గురించి పట్టించుకునే ప్రభుత్వం పాలిస్తున్నందుకు సంతోషంగా ఉన్నం. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజలు వస్తయి.
– చిందం సంజీవ్, రైతు, అల్గునూర్ (తిమ్మాపూర్)
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతదా. గా కరెంట్తోని పంటలు పండించడం సాధ్యమైతదా. కాంగ్రెస్ నాయకులు ఇష్టమచ్చినట్లు మాట్లాడుతున్నరు. వాళ్లు అసలు ఎవుసం గురించి ఏం తెలుసు. వాళ్ల మాటలు నమ్మితే మళ్లీ కరెంట్ కష్టాలు వస్తయి. ఎవుసం మూలకు పడుతది. రైతులు ఇప్పుడు 24 గంటల కరెంట్తో సంతోషంగా బతుకుతున్నరు. నాడు కరెంట్ లేక పంటలు సాగు చేయడానికి ఇబ్బందులు పడ్డాం. రాత్రి పూటే కరెంట్ ఇచ్చేటోళ్లు. పంటకు నీళ్లు పెట్టడానికి పెట్టడానికి బావుల వద్దకు పోయేటోళ్లం. పాములు, తేళ్లు కుట్టి ఎంతో మంది రైతులు చనిపోయారు. 3 గంటల కరెంట్ ఇస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. 24 గంటల కరెంట్ ఉండాలంటే సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలి.
– గోనె వీరారెడ్డి, రైతు, మర్రివాణిపల్లి (ఇల్లందకుంట)
మాది ఒకప్పటి కరువు ప్రాంతమైన చిగురుమామిడి మండలం. నాకు పదిహేను ఎకరాల 20 గుంటల భూమి ఉండేది. ఇంత భూమి ఉన్నా రెండు మూడు ఎకరాలకు మించి సాగు చేసేటోన్నిగాదు. నీళ్ల కోసం ఎన్ని బావులు తవ్వినా, బోర్లు వేసినా మూడెకరాలకు మించి సాగయ్యే పరిస్థితి లేకుండె. ఇల్లు గడవక, అప్పులు తేరక 2011లో నాలుగు లక్షల యాభై వేలకే రెండెకరాలు అమ్ముకున్న. తెలంగాణ వచ్చినంక తోటపల్లి నుంచి కాళేశ్వరం నీళ్లచ్చినయ్. నాడు అమ్ముకున్న భూమి పక్కనే ఇంకో 11 ఎకరాలున్నది. ఇప్పుడది ఎకరానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలు పలుకుతంది. పదేండ్లల్ల.. భూమి రేట్లు ఇంతగనం పెరిగినయ్.
నాకు ఇంకోకాడ అంటే కరీంనగర్- హుస్నాబాద్ మేన్ రోడ్డుకు ఆనుకుని రెండెకరాలున్నది. పదేండ్ల కింద ఎకరానికి 10 లక్షలకు ఇస్తమని అన్నరు. ధైర్యంరాక ఆపిన. ఇప్పుడు ఇదే భూమి ధర ఎకరానికి కోటికి అడుగుతున్నరు. మంచిగ నీళ్లచ్చినయ్. కరెంటు వస్తంది. నేను ఎందుకు అమ్మాలె. అనుకుని ఇస్త లేను. తెలంగాణ రాకపోయి ఉంటే.. కాళేశ్వరం నీళ్లు రాకున్నట్టయితే గదే కాంగ్రెసో, ఇంకో పార్టో రాష్ర్టాన్ని పాలిస్తే మా పరిస్థితి ఇట్ల ఉండేదా..? నీళ్లు లేక, కరెంట్ లేక ఎకరమో, రొండెకరాలో పారిచ్చుకొని బతికెటోళ్లం. ఇప్పుడు తప్పిపోయి కాంగ్రెస్ వచ్చిందా? మా పని అయిపోతది. భూముల ధరలు పడిపోతయి. రేపటి కాలం అప్పుడే భూములు అమ్ముకుంటే మంచిగుండు అనే పరిస్థితి వస్తదని నేను అనుకుంటున్న.
– ముసుకుల సుధాకర్రెడ్డి, సీతారాంపూర్, చిగురుమామిడి మండలం
కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే రైతులం ఉరేసుకున్నట్టే. నాటి రోజులు మల్లస్తయ్. కౌలు రైతుల కోసం చట్టం తీసుకొస్తామని చెప్పడం పట్టాదారుల రైతుల్లో భయాన్ని కలిగిస్తున్నది. ఈ చట్టంతో పట్టాదారుడికి మధ్య, కౌలు రైతుల మధ్య దూరాన్ని పెంచుతుంది. కౌలు రైతుల ఒప్పంద చట్టంతో అనేక భూ సమస్యలు తలెత్తడమే కాకుండా కోర్టుల వరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ చట్టం అమలులోకి వస్తే పట్టాదారులు వ్యవసాయం మానేస్తారే కానీ, కౌలు రైతులకు ఒప్పందం చేయడానికి ససేమేరా ఒప్పుకోరు. ఒకవేళ కౌలు ఒప్పందాలు చేసిన తర్వాత భూమిపై హకులు కోల్పోతామనే భయం పట్టాదారుల్లో ఉన్నది. గ్రామంలో మా అన్నదమ్ములకు ఉన్న 10 ఎకరాల పొలాన్ని తాతల కాలం నుంచి కౌలుకు ఇస్తున్నామే కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. వారితో ఎలాంటి సమస్యలు రాలేదు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న కౌలు చట్టంతో పట్టాదారుడి రైతుల భూములకు రక్షణ కరువైతుంది. కౌలు రైతుల చట్టాన్ని పట్టాదారులు ఎవరూ అంగీకరించరు.
– ఏనుగుల సంపత్, పట్టాదారుడు, కొత్తపల్లి, (హుజూరాబాద్టౌన్)
ధరణి తీసేస్తే మళ్లీ భూ పంచాయితీలే. నాటి కాంగ్రెస్ పాలనలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. పట్వార్లకు చేతివాటం ఇస్తే రికార్డులు తారుమారు చేస్తరు. భూ రికార్డుల్లో పేర్లను, విస్తీర్ణంలో మార్పులు చేసుకోవచ్చని, ఖాళీ భూములను ఆక్రమించుకోవచ్చని కాంగ్రెసోళ్ళ ఆలోచన. కానీ, ధరణితో ఏ రికార్డుల్లో ఎంత భూమి ఉందో.. ఎవరి పేరున ఉందో మన మొబైల్లోనే వివరాలు చూసుకోవచ్చు. అక్రమాలు జరిగితే మన మొబైల్కు సమాచారం వస్తది. అర్ధగంటలనే భూములు రిజిస్ట్రేషన్లు అయితన్నయి. వారం, పది రోజులల్లనే పట్టాదారు పాస్బుక్లు పోస్టు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తన్నయి. పట్టా చేసుకోవాల్సి వస్తే యజమాని వేలు ముద్రలు అవసరం. కాబట్టి వేరే వారికి మార్పిడి చేయకుండా భద్రంగా ఉంటది. రైతుల భూములు భద్రంగా ఉండాలంటే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలె.
– ఎండీ యాసిన్, రైతు (వీణవంక)
నాకు రెండెకరాల భూమి ఉంది. ధరణి లేకముందు భూమికి గ్యారెంటీ ఉండేది కాదు. ఎప్పుడు ఎవరి పేరు మీదకు పోతదో తెలువకపోవు. భూముల పట్టాల కోసం అధికారులకు వద్దకు వెళ్లినా పట్టించుకోకపోదురు. నేను చాలా సార్లు ఇబ్బందులు పడ్డా. పట్టాల్లో ఎక్కని భూములు మరొకరి పేరు మీద వచ్చేవి. ధరణి వచ్చిన వెంటనే భూములకు భద్రత వచ్చింది. కేసీఆర్ సార్తోనే మా భూములకు మంచి విలువ పెరిగింది. కాంగ్రెస్ లీడర్లు ధరణి తీసేసి భూమాత తీసువస్తమని చెప్తున్నరు. అట్లా చేస్తే రైతులకు కంటిమీద కునుకుండదు.. కాంగ్రెస్ అచ్చేది లేదు.. సచ్చేది లేదు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న ఈ సర్కారును కాపాడుకోవాలి. అప్పుడే రైతులు రంది లేకుండా బతుకుతరు.
-కంకణాల తిరుపతిరెడ్డి, రైతు (ఇల్లందకుంట)
కాంగ్రెస్ నాయకులు రైతులపై కుట్ర చేస్తున్నట్టున్నరు. ఆ పార్టీ తప్పిదారి అధికారంలకు వస్తే ఎవుసం పడావు వడుతది. కరెంటు సక్కగ ఉండక, సాగునీరు లేక, ధాన్యం కొనే పరిస్థితి ఉండక సాగు భూమి తగ్గుతది. మళ్లీ వలసలు మొదలైతయ్.. పదేండ్ల నుంచి మంచిగ బతుకుతున్నం. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన ధరణి పోర్టల్తో భూములమ్మడం కొనడం సులభంగా మారింది. నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం ధరణి తెచ్చినంక నాకు రైతుబంధు, రైతు బీమా వస్తున్నది. గతల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు రోజుల తరబడి తిరిగెటోళ్లం. గ్రామాల్లో కొంద మంది పైరువీకారులు మాజీ పట్వారీలను పట్టుకుంటేనే పనయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పని తొందరగా అవుతున్నది. స్లాట్బుక్ కాగానే ఇచ్చిన టైంకి వెళ్తే తాసీల్దార్ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నడు. వెంటనే ప్రొసీడింగ్ ఇచ్చి, నెలలో నేరుగా ఇంటికే పాసుపుస్తం వస్తున్నది. భూములకు ధరణితో భద్రత వచ్చింది. కాంగ్రెసోళ్లు మళ్లీ పాత పద్ధతి తెస్తమంటున్నరు. అది వస్తే రిజిస్ట్రేషన్కు రోజుల తరబడి తిరగాలె. రైతుల కోసం పని చేస్తున్న కేసీఆర్నే మళ్లీ గెలిపించుకుంటం.
-మ్యాడద తిరుపతిరెడ్డి, రైతు, వంతడుపుల (ఇల్లందకుంట)
కాంగ్రెసోళ్లను నమ్మితే ఊళ్లు ఆగమైతయ్. మునుపటి రోజులు మల్లత్తయ్. కరెంటు కోతలు, తాగు, సాగు నీటి కష్టాలు మొదలైతయ్. తెలంగాణ సరారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో రైతులందరికీ ఎంతో మేలు జరుగుతంది. భూములు అమ్మిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటలేవు. తొందరగా రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేలా ధరణి అందరికీ అందుబాటులో ఉంది. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ ధరణి తీసేసి ఇంకేదో తెస్తరట. తీసుకొచ్చేది భూమాత కాదు.. భూమాయ చేసి ముంచెటట్టున్నరు. అందుకే కాంగ్రెసోళ్లను నమ్మేదే లేదు. అందుకే కేసీఆర్ సార్కే మా మద్దతు.
– మల్లెత్తుల శ్రీను, రైతు, గొల్లపల్లి(తిమ్మాపూర్ రూరల్)
కేసీఆర్ సారు వ్యవసాయానికి 24 గంటల కరెంటిత్తుంటే.. కాంగ్రెసోల్లు మూడు గంటలే ఇత్తమంటే ఎట్లా. అసోంటి పార్టీని నమ్మేది లేదు. సీఎం కేసీఆర్ కృషితో ఇప్పుడిప్పుడే రైతులమంతా బాగుపడుతున్నం. దీన్ని ఓర్వలేక మళ్ల రైతులను కూలీలుగా చేసేందుకు ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ మమ్ములను మోసం చేసేందుకు వత్తంది. 10 హెచ్పీ మోటర్లు కొత్తగా కొనాలంటే పైసలెక్కన్నుంచి వత్తయి. అసలు అంత పెద్ద మోటర్లు ఎందుకు కొనాలె. మూడు గంటల కరెంటు ఫుల్లు అయితదని కాంగ్రెస్, మోటర్లకు మీటర్లు పెట్టాల్నని బీజేపోళ్లు అంటున్నరు. అసలు ఈ రెండు పార్టీలు మా రైతులను ఏం చేయాలనుకుంటన్నయి. మా అసోంటి పేద రైతులను కేసీఆర్ బాగు చేయడం వాళ్లకు ఇష్టం లేదు. మీటర్లు పెడితే నెల నెలా వేల రూపాయలు కట్టాలె. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే దానితోని పైపులు కూడా మార్చుకోవాలె. పాత పైపులైన్లు తీసేసి, కొత్తగా కొనుక్కచ్చుకుని మల్ల పైపులైన్లు వేసుకోవాలె. ఇదంతా చేసుకునేందుకు తక్కువ ఖర్చయితదా?. కాంగ్రెస్ అచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్లీ కేసీఆర్కే వోట్లేసి ఆయననే గెలిపిత్తే ఇవన్నీ ఇబ్బందులు రావు కదా. అందుకే మేమంతా కారు గుర్తుకే ఓటేయల్నని నిర్ణయించుకున్నం.
-కనుకయ్య, రైతు, బొమ్మకల్ (కలెక్టరేట్)