చొప్పదండి, జులై 20: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలను దోచి పెద్దలకు పంచిపెడుతున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. నిత్యావసరాలపై జీఎస్టీ విధించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పెట్రో ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచిన కేంద్రం నిత్యావసరాలైన పాలు, పెరుగును కూడా వదలకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ ప్రధాని మోదీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.