రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్కు పితృ వియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి తండ్రి మల్లయ్య బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మంత్రిని పరామర్శించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంతాపం తెలుపగా, మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.
కలెక్టరేట్, జనవరి 4 : రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్కు పితృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మంత్రి తండ్రి గంగుల మల్లయ్య (87) బుధవారం గుండెపోటుతో మరణించడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. సాయంత్రం 4 గంటల సమయంలో కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని మంత్రి స్వగృహంలో మల్లయ్య కన్నుమూశారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి తన తండ్రి మరణవార్త తెలియడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మల్లయ్యకు నలుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. కమలాకర్ నాలుగో కొడుకు. మల్లయ్య మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, మంత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంటికి తరలి వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. గురువారం ఉదయం స్థానిక మానేరు తీరాన ఉన్న అలకాపురి కాలనీలోని శ్మశానవాటికలో మల్లయ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మరణవార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. బాధలో ఉన్న మంత్రిని ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కూడా ఫోన్లో పరామర్శించారు. మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
మంత్రి గంగులను ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ కరీంనగర్లోని మంత్రి నివాసానికి చేరుకున్నారు. మల్లయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి గంగుల కుటుంబసభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు.