కొండగట్టును దేశంలోనే గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రూ.వంద కోట్లే కాదు, అవసరమైతే రూ.వెయ్యి కోట్లయినా కేటాయిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే మరోసారి కొండగట్టుకు వస్తానని ప్రకటించిన ఆయన, ముందుగా రెండు మూడు మాసాల్లో కొండపైన నీటి వసతికి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభించాలని, ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో తరచుగా తాను కొండపైకి పర్యటనకు వస్తానని చెప్పారు. కొండగట్టు పరిసరాల్లోని 1400 ఎకరాల్లో అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. బుధవారం అంజన్న క్షేత్రాన్ని సందర్శించిన ఆయన, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు, వాస్తు శాస్త్ర నిపుణులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు. వాస్తు నుంచి పర్యాటకం వరకు అన్ని అంశాలపైనా లోతుగా అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి, అంజన్న ఆలయ ప్రశస్తిని స్వయంగా వివరించారు. నీటి వసతి కోసం అప్పటికప్పుడే అంచనాలు సిద్ధం చేయించగా, సీఎం అంకితభావం, ఆధ్యాత్మిక చింతనకు అధికారులు, వాస్తు నిపుణులు ఆశ్చర్యపోయారు. కొండగట్టు అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లా ప్రజలు, అంజన్న భక్తులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
– జగిత్యాల, ఫిబ్రవరి 15, (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, ఫిబ్రవరి 15, (నమస్తే తెలంగాణ) : దేశంలోనే దివ్య క్షేత్రంగా, మహిమాన్విత స్థలంగా కొండగట్టును తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంకురార్పణ చేశారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖ ఈ నెల 7న జీవో 49ని జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, రూ.వంద కోట్ల మంజూరు తర్వాత అభివృద్ధి పనుల పరిశీలన, ప్రణాళికల రూపకల్పన కోసం అంజన్న పుణ్యక్షేత్రాన్ని సీఎం కేసీఆర్ బుధవారం స్వయంగా సందర్శించారు. హెలికాప్టర్లో జేఎన్టీయూ కళాశాలకు వచ్చిన ఆయన, అక్కడి నుంచి నేరుగా కొండపైకి వెళ్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం పక్కనే ఉన్న సమావేశ మందిరంలో ఆలయ అభివృద్ధి, ప్రణాళికల రూపకల్పన కోసం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వాస్తు శాస్త్ర నిపుణులు, ఆలయ అర్చకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన సమీక్షా సమావేశంలో అనేక అంశాలను ప్రస్తావించారు. తిరుమల తరహాలో కొండపైకి వచ్చేందుకు ఒక దారి, కొండ దిగేందుకు మరో దారిని ఏర్పాటు చేయాలని సూచించారు. గుట్ట దిగేందుకు ఘాట్రోడ్డును వినియోగించాలని, దీని విస్తరణకు తక్షణమే రూ.30 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు.
రెండు నెలల్లో కొండగట్టుపైకి నీటి సరఫరా జరిగేలా చూడాలని, వెంటనే మిషన్ భగీరథ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీటిని తరలించే పనులను చేపట్టాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్కు సూచించారు. ఈ నీటితోనే పనులు మొదలవుతాయని చెప్పారు. వరదకాలువ ద్వారా కాళేశ్వరం నీటిని ఎత్తిపోతలతో కొండగట్టు దిగువన ఉన్న సంతలోల్లలొద్దికి తరలించాలని, అక్కడి నుంచి కొండగట్టు గుట్టపైకి తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ వెంటే కొండదిగువన ఉన్న సంతలోళ్లలొద్దికి పంపించి, అప్పటికప్పుడు అంచనాలు రూపొందింపజేశారు.
మహిమాన్విత, దివ్యక్షేత్రంగా మార్చాలి
కొండగట్టు ఆలయానికి రూ.వంద కోట్ల కేటాయింపు పెద్ద అంశం కాదని, దేశంలోనే మహిమాన్విత, దివ్యక్షేత్రంగా మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో అంజన్న ఆలయం అంటే కొండగట్టు అనేంత గొప్పగా రూపొందించేందుకు రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆలయ మహిమ, పురాణ ప్రశస్తి, చారిత్రక విషయాలను స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం విశేషం. యాదాద్రి నిర్మాణానికి స్థలం, ఇతర సహజ వనరులు లేవని, కొండగట్టు విస్తరణకు మాత్రం అనేక అవకాశాలున్నాయన్నారు. సువిశాలమైన స్థ లం అంజన్నకు ఉందని చెప్పారు. దాదాపు 700 ఎకరాల స్థలంలో ఆలయానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశాలున్నాయన్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలుగని రీతిలో వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కొండపైకి వచ్చేందుకు ఒకదారి, దిగేందుకు మరోదారిని ఏర్పాటు చేయాలని, రహదారులు సైతం వాస్తుకు అనుగుణంగా నిర్మించాలని సీఎం సూచించారు.
కొండపైన నీటి వసతి కల్పన కోసం వరద కాలువకు లిఫ్ట్ ఏర్పా టు చేసి, సంతలోల్లలొద్దిలోకి ఎత్తిపోయాలని చెప్పిన ముఖ్యమంత్రి, అక్కడే ఉన్న నీటి పారుదల శాఖ అధికారులను క్షేత్రస్థాయికి పంపించి, ప్రణాళికలు రూపొందింపజేశారు. అలాగే, కొండపైన పార్కింగ్ కోసం 86 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సూచించారు. ఇక ఆలయంలోని గర్భగుడి, మూలవిరాట్ను మినహాయించి అన్నింటిలోనూ మార్పులు చేయాలని, ఆగమ శాస్త్రం, వాస్తు శాస్త్రం ఆధారంగా వీటి నిర్మాణాలు ఉండాలని చెప్పారు. ప్రధాన ఆలయం రెండెకరాల విస్తీర్ణంలో ఉండాలన్నారు. కొండగట్టు చుట్టూ 1500 ఎకరాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉందని, ఆలయ విస్తరణలో అటవికి ఇబ్బందులు రావద్దని ఆదేశించారు.
అటవిని మరింతగా అభివృద్ధి చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. రెండు మూడు మాసాల్లో కొండపైకి నీటి వసతి ఏర్పాట్లు పూర్తి కావాలని, తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న సీఎం, ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో తరుచుగా తాను కొండపైకి పర్యటనకు వస్తానని చెప్పారు. పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే మరోసారి కొండగట్టుకు వస్తానని ప్రకటించారు. కరీంనగర్ లేదా జగిత్యాలలో రాత్రి బస చేసి, ఉదయం 6 గంటలకే కొండపైకి చేరుకొని కొండపై ఉన్న దర్శనీయ స్థలాలన్నింటినీ దర్శిస్తానని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన, ఆలయ ప్రశస్తి, మహిమాన్విత క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తపన, వాస్తు, ఆగమ శాస్త్రం నుంచి మొదలుకొని పర్యాటక రంగం వరకు ప్రతి అంశంపై ఆయనకు ఉన్న సాధికారికత చూసి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆనందంలో జిల్లా వాసులు, అంజన్న భక్తులు
సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ.వంద కోట్లు మంజూరు చేయడం, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన కోసం స్వయంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం, సమీక్ష నిర్వహించడం, స్వామి క్షేత్రాభివృద్ధికి ఏకంగా రూ.వెయ్యి కోట్లయినా వెచ్చిస్తానని ప్రకటించడం జగిత్యాల జిల్లా వాసులు, అంజన్న భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. పరమ పవిత్రమైన, భక్తుల కొంగు బంగారంగా పేరుగాంచిన కొండగట్టు అంజన్న క్షేత్రం సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తెలంగాణ సాధన తర్వాత కొండపైన పుష్కరిణి నిర్మాణం, మంచినీటి వసతి ఘాట్రోడ్డు అభివృద్ధి, డార్మెంటరీ నిర్మాణం, ఈవో కార్యాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారు.
గతేడాది రామకోటిని ప్రత్యేకంగా రాయించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, క్షేత్రంలో రామకోటి స్తూపాన్ని నిర్మింపజేశారు. కాగా, సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతో పాటు, క్షేత్రా న్ని దర్శించుకొని, అవసరమైతే రూ.వెయ్యి కోట్లు అయిన కేటాయిస్తామని ప్రకటించారు. ఆలయా న్ని దేశంలోనే గొప్ప క్షేత్రంగా మార్చుతామని ప్రకటించడంతో జిల్లా ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కొండగట్టు అంజన్న భక్తులు ముఖ్యమంత్రి ఔదార్యానికి, ఆయన ఆధ్యాత్మిక చింతనకు, అంజన్నపై ఉన్న భక్తికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యాదగిరిగుట్ట ఎలాగైతే విశ్వవ్యాప్త క్షేత్రంగా మారిపోయిందో అలాగే, కొండగట్టు సైతం మారుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పర్యటన సక్సెస్
ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన అత్యంత ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో జరగడంతో జిల్లాలోని అధికార బృందం, ప్రజాప్రతినిధులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఉదయం 11 గంటల సమయంలో హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి మొదట విహంగ వీక్షణం ద్వారా క్షేత్రాన్ని పరిశీలించారు. తర్వాత స్వామివారిని దర్శించుకొని అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ క్షేత్రాన్ని పరిశీలించి, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించడం, యాదగిరి గుట్టను నిర్మించిన అనుభవంతో కొండగట్టు నిర్మాణానికి స్వయంగా ప్రణాళికలు రూపొందించడం, భారీగా నిధులు కేటాయిస్తానని ప్రకటించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమీక్షలో మంత్రులతోపాటు ఎంపీ దీవకొండ దామోదర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కు మార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజ య్, జీవన్ రెడ్డి, కోరుకంటి చందర్, విప్ బాల్క సుమన్, మండలి చీఫ్ విప్ భాను ప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సివిల్ సప్లాయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీఎంవో అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, ఆర్అండీ అధికారులు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆలయ స్థపతి ఆనందర్ సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
భారీ బంబోబస్తు
పర్యటన నేపథ్యంలో పోలీసుశాఖ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచే పోలీసు సిబ్బంది కొండ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హెలికాప్టర్ దిగే జేఎన్టీయూ ప్రాంతంలో పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టారు. జేఎన్టీయూ వైపునకు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అలాగే, దిగువ నుంచి కొండగట్టు పైకి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేశారు. కొద్దిమంది ప్రజాప్రతినిధులను మాత్రమే కొండపైన ఉన్న వై జంక్షన్ వరకు అనుమతించారు. కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన 1300ల మంది పోలీసులతో పూర్తి భధ్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి కొండగట్టు పర్యటనలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వోరుగంటి రమణారావు, దావ సురేశ్, జడ్పీటీసీ సభ్యుడు కొండపల్కల రాంమోహన్రావు, ముత్యంపేట సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మల్యాల సర్పంచ్ మిట్టపెల్లి సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్లు అయిల్నేని సాగర్రావు, రాంలింగారెడ్డి, మధుసూదన్రావు, బీఆర్ఎస్ మల్యాల మండల శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, కొడిమ్యాల ఎంపీపీ మెన్నేని స్వర్ణలత, నాచుపల్లి సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, హిమ్మత్రావుపేట సర్పంచ్ పునుగోటి కృష్ణారావు, బీఆర్ఎస్ కొడిమ్యాల మండల అధ్యక్షుడు పులి వెంకటేశ్గౌడ్, తదితరులు ఉన్నారు.
ఘన స్వాగతం..
కొండగట్టుకు వచ్చిన సీఎం కేసీఆర్కు జేఎన్టీయూ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రులు అల్లోల ఇద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా, అడిషినల్ కలెక్టర్ మంద మకరంద్ పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతించారు. ఆలయంలో కేసీఆర్కు దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, ఆలయ ఈవో వెంకటేశ్, ఆలయ అర్చకులు, ఆలయ ఫౌండర్ ట్రస్టీ తిరుకోవెల మారుతి స్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.