వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న రామడుగు మండలంలో పర్యటించనున్నారు. వరంగల్ నుంచి నేరుగా హెలీక్యాప్టర్లో వచ్చి, గాయత్రీ పంప్హౌస్ సమీపంలోని దత్తోజీపేట వద్ద ఉన్న హెలీప్యాడ్లో మధ్యాహ్నం 3 గంటలకు దిగుతారు. అక్కడి నుంచి నేరుగా రామచంద్రాపూర్ గ్రామానికి వెళ్లి, దెబ్బతిన్న మస్క్మిలన్, వాటర్ మిలన్, వరి, మక్క పంటలను పరిశీలిస్తారు. అనంతరం హెలీప్యాడ్ వద్దకు చేరుకొని హైదరాబాద్ పయనం కానుండగా, పర్యటనకు అధికారులు అంతా సిద్ధం చేశారు. బుధవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు ఏర్పాట్లను పరిశీలించారు.
కరీంనగర్, మార్చి 22 (నమస్తే తెలంగాణ)/రామడుగు: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈ సారి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడే పడ్డాయి. ప్రధానంగా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, గంగాధర, చొప్పదండి మండలాల్లో అపారనష్టం వాటల్లింది. కరీంనగర్ జిల్లా మొత్తంగా 23,116 ఎకరాల్లో పంట నష్టం జరిగితే, ఈ మూడు మండలాల్లోనే 13,699 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తున్నది. రామడుగు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వరి, మక్క తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేసే లక్ష్మీపూర్, రాంచంద్రాపూర్, వెంకట్రావుపల్లి, గుండి, దత్తోజిపల్లిలో అత్యంత విలువైన మస్క్మిలన్తోపాటు వాటర్ మిలన్ తదితర పంటలు దెబ్బతిన్నాయి. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ద్యావ రాంచంద్రారెడ్డి అనే రైతుకు చెందిన పదెకరాలలో మస్క్మిలన్ పంట దెబ్బతిని, సుమారు 60 లక్షల దాకా నష్టం వాటిల్లించింది. గుండి గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీనివాస్, కత్తి రవికి చెందిన ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటు గంగాధర మండలంలోని కురిక్యాల, కొండన్నపల్లి, గట్టుభూత్కూర్, తాడిజెర్రి, గర్శకుర్తి, కాసారం, వెంకటయ్యపల్లి, కాచిరెడ్డిపల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో వరి, మక్కతోపాటు కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చొప్పదండి మండలం మంగళ్లపల్లిలో వాటర్ మిలన్ దెబ్బతిన్నది. భూపాలపట్నం, చొప్పదండి, వెదురుగట్ట, చాకుంట, రుక్మాపూర్, గుమ్లాపూర్ మండలాల్లో వరి, మక్క, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తంగా చూస్తే రామడుగులో 4,053 మంది రైతులకు చెందిన 5,825 ఎకరాలు, గంగాధర మండలంలో 2,322 మంది రైతులకు చెందిన 4,755 ఎకరాలు, చొప్పదండిలో 1,320 మందికి రైతులకు చెందిన 3,119 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా మొత్తంలో 14,287 మంది రైతులకు చెందిన 23,116 ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, చొప్పదండి నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనే 7,695 మంది రైతులకు చెందిన 13,699 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది
వడగండ్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు మంత్రులు, ఎమ్మెల్యేలు భరోసానిస్తున్నారు. నష్టపరిహారం విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితర అధికారులతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రామడుగు, చొప్పదండి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. నష్టపోయిన రైతులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి మాట ఇచ్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వినోద్కుమార్ కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఆయన పర్యటన ఖరారైనట్లు తెలుస్తున్నది.
వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, ఈ పర్యటన సవ్యంగా సాగేలా చూడాలని అధికారులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. గురువారం మధ్యా హ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో వస్తారని చెప్పారు. బుధ వారం దత్తోజిపేట శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించారు. రాంచంద్రాపూర్లో వడగండ్లకు దెబ్బతిన్న రైతు కత్తి అంజలి రవీందర్కు చెందిన కర్భూజ పంటను పరిశీలించారు. ఆయన వెంట కొక్కెరకుంట విండో చైర్మన వొంటెల మురళీకృష్ణారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, పైండ్ల శ్రీనివాస్, చాడ శేఖర్రెడ్డి, కొలిపాక మల్లేశం, పూడూరి మల్లేశం, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్, రత్నాకర్రెడ్డి, బండారి చరణ్ తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యా హ్నం రామడుగు మండలంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో వచ్చి, లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ సమీపంలోని దత్తోజిపేట వద్ద ఉన్న హెలీప్యాడ్లో దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా రాంచంద్రాపూర్ గ్రామానికి వెళ్లి, అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారెడ్డి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం హెలీప్యాడ్ నుంచి దెబ్బతిన్న పంట భూముల వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. రైతుల పంటలను కూడా పరిశీలించారు. మరోవైపు పంటనష్టంపై సమగ్ర నివేదికతో సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, డీఏవో శ్రీధర్, ఉద్యావవన శాఖ అధికారి శ్రీనివాస్, నీటిపారుదల శాఖ అధికారులు, రూరల్ ఏసీపీ కరుణాకర్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా తదితరులు ఉన్నారు.