‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, ఆపై కార్యాలయంలో నిర్వహించిన అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను వేదపండితులు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ భవన్లో నాగ్పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్ను సీఎం కేసీఆర్ కూర్చోబెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది పలకాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగాణ పథకాలు వివరిస్తామని, దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని స్పష్టం చేశారు.
నాగ్పూర్ తరువాత ఔరంగాబాద్, పుణెలోనూ పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీలు కేశవరావు, సంతోష్కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జీవన్రెడ్డి, దానం నాగేందర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ అధినేత కేసీఆర్కు మరాఠా నాయకులు ఘన స్వాగతం పలికారు. నాగ్పూర్ పట్టణమంతా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా గులాబీ హోర్డింగ్లు దర్శనమిచ్చాయి.