గోదావరిఖని, జూన్ 9 : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదావరిఖని శివారు నది వంతెనపై కాసేపు ఆగారు. నిండుగా ఉన్న గోదావరి నదిని చూసి సంతోషం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, నది వద్ద వేద బ్రాహ్మణులతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదావరికి నమస్కరించి, హారతిచ్చారు. పూలు, చీర సమర్పించారు. అంతకుముందు వంతెనపై సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రామగుండం ఎమ్మెల్యే చందర్ తదితరులు ఉన్నారు.