మెట్పల్లి/జగిత్యాల రూరల్/ కోల్సిటీ/గంగాధర: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు శివాజీ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మెట్పల్లి పట్టణంలోని ఆదర్శనగర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని కొనియాడారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం ఆఫీసు వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ అందరి వాడని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. యువత శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.