కలెక్టరేట్, జనవరి 8: భారత్ రాష్ట్ర సమితి నగర శాఖ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు చల్ల హరిశంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆదివారం నియామకపత్రం అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా మరో సీనియర్ నాయకుడు గడ్డం ప్రశాంత్రెడ్డి, యూత్ విభాగం నగర అధ్యక్షుడిగా దీకొండ కులదీప్ వర్మ, జనరల్ సెక్రటరీగా బోనకుర్తి సాయికృష్ణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలో మొదట నగరం నుంచే కమిటీలు, అనుబంధ విభాగాలకు నియామకాలు చేపట్టారు. మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పొన్నం అనిల్కుమార్గౌడ్, పలువురు కార్పొరేటర్ల సమక్షంలో నియామక ప్రక్రియ జరిగింది. అనంతరం నూతన కమిటీ సభ్యులు మంత్రి గంగుల కమలాకర్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వారికి మంత్రి శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
పనితీరుకు పట్టం..
నగర అధ్యక్షుడిగా నియమితుడైన చల్ల హరిశంకర్ 2013లో టీఆర్ఎస్లో చేరి, స్వరాష్ట్ర పోరుకు అలుపెరుగకుండా శ్రమించారు. మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు ప్రియశిష్యుడిగా ఉంటూ తనకున్న యువజన సంబంధాలతో యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేశారు. 2014లో తన సతీమణి స్వరూపారాణిని 41వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. 2020 ఎన్నికల్లోనూ 37వ డివిజన్ నుంచి రెండోసారి తన సతీమణిని పోటీలో నిలపగా కార్పొరేటర్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి ఆమెను వరించింది. 2015 నుంచి పార్టీ జిల్లా సభ్యత్వ ఇన్చార్జిగా కొనసాగుతూ కరీంనగర్, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి నియోజకవర్గాల్లో కార్యకర్తల సభ్యత్వాల ఆన్లైన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసి, రాష్ట్ర నాయకుల అభినందనలు పొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా మంత్రి గంగుల గెలుపులో క్రియాశీల పాత్ర పోషించారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా జిల్లాలోని పలు అసెంబ్లీలకు ఇన్చార్జిగా వ్యవహరించారు. అలాగే, జిల్లా కేంద్రంలో నిర్మించిన పార్టీ భవనానికి స్థల సేకరణ, బిల్డింగ్ డిజైన్ చేసి, నిర్దేశించిన గడువులోపు నిర్మాణం పూర్తి చేసి, మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించారు.