మంథని, సెప్టెంబర్ 10: చాకలి ఐలమ్మ, జ్యోతిబాఫూలే, సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కు ఓటు అనే ఆయుధంతో సేవకుడినే నాయకుడిగా ఎన్నుకోవాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు. వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని మంథనిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రంతో కలిసి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు.
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మంథనిలో తొలుత ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ తర్వాత ఎందరో మహనీయుల విగ్రహాలను నెలకొల్పి వారి చరిత్రను, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించడం ఆనందంగా ఉందన్నారు. మంథనిలో గత పాలకులు మహానీయుల విగ్రహాలను, చరిత్రను బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తెలియనివ్వకుండా వారి తండ్రి విగ్రహాలను పెట్టి వారికే మొక్కాలని ప్రజలకు సూచించడం బాధ కలిగించిందన్నారు.
ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న తనపై కాంగ్రెస్ నాయకులు ఛలోక్తులు పేల్చడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, అందుకే మంథనిలోనే ఇల్లు కట్టుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. మన తలరాతలను మార్చే శక్తి ఉన్న ఓటును నేటికి కొంత మంది సద్వినియోగం చేసుకోకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. ఇప్పటికే ఎందరో మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని, మంథని అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ సర్పంచ్ ముక్కా వీరరాఘవులు, మంథని తొలి ఎమ్మెల్యే గులుకోట శ్రీరాములు, తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్బాఫూజీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం విగ్రహాలను కూడా త్వరలోనే మంథనిలో నెలకొల్పుతామన్నారు.
ప్రతి ఏడాది జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం ఎస్ఐలు రాణి, దివ్య, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు లింగం అంజలి, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురిని సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం రజక సంఘం నాయకులు పుట్ట మధూకర్ను ఘనంగా సన్మానించారు. వర్ధంతి సభలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహణ కమిటీ కన్వీనర్ పోతరాజు సమ్మయ్య, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలతాశంకర్లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు రవి, సత్యనారాయణ, రజక సంఘం నాయకులు కొల్లూరి సమ్మయ్య, రాజయ్య, పైడాకుల నాగరాజు, పోతరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ మనుమడు భావోద్వేగం
మంథనిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మనుమడు, వరంగల్ జిల్లా పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం భావోద్వేగానికి లోనయ్యారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం, వారి చరిత్రను భావితరాలకు తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహిస్తుండన్ని అభినందించారు. తన నానమ్మ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఉమ్మడి జిల్లాలోనే తొలిసారి 2015లోనే మంథనిలో ఏర్పాటు చేయడం, ఏరియాకు చాకలి ఐలమ్మ చౌక్గా నామకరణం చేయడం, కూరగాయల మార్కెట్కు చాకలి ఐలమ్మ పేరు పెట్టిన తీరును ఆయన ప్రశంసించారు. పాలకుర్తిలో పుట్టిన ఐలమ్మ ఉద్యమ చరితను, మంథనిలో మననం చేసుకొని గుర్తించడంపై భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తమ నానమ్మ త్యాగాన్ని గుర్తించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.