వేములవాడ, నవంబర్ 30: రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట్ల సీసీ కెమెరాలను అమర్చింది. వీటిని హైదరాబాద్లోని స్టేట్ కంట్రోల్ కమాండ్ సెంటర్కు అనుసంధానించింది. అయితే రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వసతి గదుల్లో విడిది చేస్తుండగా దర్శనానికి వెళ్లి వచ్చేలోపే చిల్లర దొంగలు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఇప్పటికే వరంగల్, హైదరాబాద్లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సెల్ఫోన్లు, కొంత నగదును కూడా అపహరించగా పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే స్వామివారి దర్శనం అనంతరం గదికి వచ్చేసరికి జరిగిన దొంగతనాల తీరుపై భద్రత లోపాలను భక్తులు ఎత్తి చూపడమే కాకుండా ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
కొత్తగా 194 సీసీ కెమెరాలు
భక్తుల విడిది కోసం నందీశ్వర, లక్ష్మీగణపతి, పార్వతీపురం, భీమేశ్వరసదన్ వసతి సముదాయాలు ఉన్నాయి. వీటిలో 550 గదులున్నాయి. అయితే ఇప్పటికే ఈ వసతి సముదాయాల్లో నందీశ్వరలో 11 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 34సీసీ కెమెరాలు, లక్ష్మీగణపతిలో ఆరు ఉండగా అదనంగా 24, పార్వతీపురంలో 4 ఉండగా అదనంగా 22, భీమేశ్వర సదన్లో నూతనంగా 24 సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. వసతి గదుల్లోనే 104 సీసీ కెమెరాలను బిగించనున్నారు. ఇప్పటివరకు భక్తులు వచ్చి వెళ్లే ప్రాంతాల్లోనే ఉండగా ప్రస్తుతం నూతనంగా ఏర్పాటుచేసే కెమెరాల ద్వారా ప్రతి వరండాను చూసే విధంగా కెమెరాల ఏర్పాటుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో వసతి గదుల్లో ఏ ప్రాంతంలోనైనా అనుమానితులు సంచరిస్తే ఇకపై సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే 100 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 194 సీసీ కెమెరాలతో కలిపి మొత్తం 294 కెమెరాలు భక్తుల భద్రత కోసం ప్రత్యేక నిఘా కొనసాగనున్నది. పార్కింగ్ ఏరియా, నటరాజ్ విగ్రహం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. రూ. 24లక్షలతో అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. డిసెంబర్ 15నాటికి కెమెరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేస్తామని ఆలయ డీడీ రఘునందన్శర్మ తెలిపారు.
ఆరు మెటల్ డిటెక్టర్లకు ప్రతిపాదనలు
భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ద్వారాల వద్ద ఆరు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేయనున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు రాష్ట్రటెక్నాలజీ సర్వీసును ఇప్పటికే దేవాలయ అధికారులు లేఖ ద్వారా కోరారు. అలాగే తనిఖీలు చేసేందుకు కూడా 10 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లను కూడా అందుబాటులోకి తేనున్నారు.
టెండర్ ప్రక్రియ పూర్తయింది..
25 లక్షలతో సీసీకెమెరాలను ఏర్పాటుచేస్తున్నాం. కొనుగోలుకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం వసతి గదుల్లో ప్రతి వరండాను చూపించేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. డిసెంబర్ 15నాటికి కెమెరాల బిగింపు పూర్తవుతుంది. ఆలయ పరిసరాలతో పాటు పార్కింగ్ స్థలాలను నిఘానీడలోకి తీసుకువస్తాం.
– రఘునందన్, రాజన్న ఆలయ డీఈ