ఉమ్మడిపాలనలో చితికిపోయిన కులవృత్తులకు రాష్ట్ర సర్కారు జవసత్వాలు నింపుతున్నది. తరతరాలుగా వృత్తులను నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. తాజాగా ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందించాలని సంకల్పించింది. వేగంగా లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అందజేయాలని నిశ్చయించింది. దీంతో కులవృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారు. తమ తలరాత మార్చాలని కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు.
– కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ వ్యవస్థలో కీలకమైనవి కులవృత్తులు. బలహీనవర్గాలకు ఆ వృత్తులే జీవనాధారం. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, నకాశి, మేర, కంసాలి, నాయీ బ్రాహ్మణ, రజక ఇలా అనేక వృత్తులు క్రమంగా కనుమరుగై పోతున్నాయి. రెండు దశాబ్దాల కాలంలో అంతరించిపోయే పరిస్థితికి వచ్చాయి. అయినా నాటి పాలకులు పట్టించుకో లేదు. కనీస సాయం అందించలేదు. దీంతో తరతరాలుగా వృత్తిని నమ్ముకుని జీవించిన ఎంతో మంది ఇతర పనుల్లోకి మళ్లారు. పొట్టకూటి కోసం దినసరి కూలీలుగానూ మారారు. కొంత మంది మాత్రం ఇప్పటికీ ఆ కులవృత్తుల్లోనే కొనసాగుతూ కొన ఊపిరితో బతుకీడుస్తున్నారు. ఉద్యమ సమయంలో వీరి పరిస్థితిని కండ్లారా చూసిన కేసీఆర్, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొండంత అండగా నిలుస్తున్నారు. సబ్సిడీ రుణాలు, పింఛన్లు, బీమా, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తూ కులవృత్తులకు జవసత్వాలు కల్పిస్తున్నారు. నేత కార్మికులు, గొల్లకుర్మలు, మత్స్యకారులు, గీతకార్మికులు, రజక, నాయి బ్రాహ్మణులు ఇలా అన్ని వర్గాలకూ సాయం అందిస్తున్నారు. అలాగే అట్టడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు 2018లో 35 కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా ప్రకటించారు.
ఆర్థిక భరోసా కోసం రూ. వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ను ఏర్పాటు చేయించారు. దశాబ్దాలుగా దగా పడుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ఏడాది న్నర క్రితం విప్లవాత్మకమైన దళితబంధు పథకానికి అంకురార్పణ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులవృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గురువారం కేబినెట్లో నిర్ణయించింది. ఇందుకు విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేసి తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆయా వర్గాలకు ఆర్థిక సాయం అందజేయాలని నిశ్చయించింది. దీంతో కులవృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ బతుకుల గురించి ఏ ముఖ్యమంత్రి ఆలోచించ లేదని, కేసీఆర్ తమకు ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించడం గొప్పవిషయమని చెబుతున్నారు.
సీఎం సారు సల్లంగుండాలె..
మేం ఎన్నో ఏండ్ల సంది బుట్టలు, గుల్లలు, చాటలు అమ్ముకొని బతుకుతున్నం. ఇంటోళ్లందరం పొద్దంతా కష్టపడి రోజుకు రూ. 400 నుంచి 600 దాకా సంపాదిస్తం. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి వారి జాతరకు వచ్చే భక్తులు ఇక్కడి చాటలు కొనుక్కొని పోతుంటారు. దీంతో ఆమాత్రం రాబడి ఉన్నది. ప్లాస్టిక్ వస్తువులు రావడంతో మా వస్తువులకు ఆదరణ తగ్గింది. పల్లెల్లో ఉండే మేదరులు మస్తు తిప్పలు పడుతున్నరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కుటుంబానికి రూ. లక్ష ఇస్తామని చెప్పడం ఆనందంగా ఉన్నది. అంతరించి పోతున్న మా వృత్తికి ప్రాణం పోసినట్టయింది. మాలాంటి ఎందరికో మేలు జేస్తున్న సీఎం సారును మేం మరువం. ఆ సారు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి కృపాకటాక్షాలతో సల్లంగుండాలె.
– చిలివేరి అమృతమ్మ, ధర్మపురి
సీఎం కేసీఆర్ సారుతోనే మేలు
రాష్ట్రం రాకముందు పదేండ్లు పాలించిన కాంగ్రెస్ వృత్తిపనిజేసుకొని బతికేటోళ్లకు చేసిందేమీలేదు. ఓట్లప్పుడు వచ్చి ఇదిజేత్తాం..అదిజేత్తాం అని చెప్పి గెలిచినంక మరిచిపోయేది. మార్కెట్ల ప్లాస్టిక్ చాటలు, గుల్లలు దొరుకుతుండడంతో మేదరోళ్లు ఆగమైపోయిన్రు..ఇప్పుడు సీఎం కేసీఆర్ పనిజేసుకొని బతికేటోళ్లకు రూ. లక్ష ఇస్తానని చెప్పడం సంతోషంగా ఉన్నది. ఇంత మంచి కార్యక్రమం జేస్తున్న ఆయనను బతికినంతకాలం గురుతుపెట్టుకుంటం.
– మేదరి రాజయ్య, నారాయణపూర్ (ఎల్లారెడ్డిపేట)
ఈ సర్కారుతోనే న్యాయం
నేను ఏండ్ల సంది కుమ్మరి పనిజేసుకుంటనే భార్యాబిడ్డలను సాదుకుంటున్న. అయితే మార్కెట్లో ప్లాస్టిక్ వస్తువులు దొరుకుతుండడంతో మా కుమ్మరి కుండకు గిరాకీ లేకుండవోయింది. గతంలో ఎలినవాళ్లు కులవృత్తులను పట్టించుకోలేదు. గిసోంటి టైంల ముఖ్యమంత్రి కేసీఆర్ వృత్తిపనిని నమ్ముకున్న నాలాంటి వాళ్లకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం గొప్ప విషయం.
– శనిగరం శంకర్, కుమ్మరి (గంభీరావుపేట)
రూ. లక్షతో మిషిన్ కొనుక్కుంట..
మేం మేరోళ్లం. మిషిన్ కుట్టుకుంట బతుకుతున్న. ఇరువై, ముప్పై ఏండ్ల కిందట గిరాకీ బాగానే ఉండేది. ఇప్పుడు రెడీమేడ్ బట్టలు మార్కెట్లోకి వచ్చినంక మా బతుకులు ఆగమైనయ్. ఎప్పుడో పండుగలు, లగ్గాలప్పుడు దప్పితే ఏడాదిలో చాలా రోజులు ఖాళీగానే ఉంటున్న. గతంల ఆదుకోవాలని ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోలె. ఇప్పుడు కేసీఆర్ సారు మాలాంటోళ్లను గుర్తించిండు. రూ. లక్ష అందజేస్తానని చెప్పడం సంతోషంగా ఉన్నది. ఆయన ఇచ్చే పైసలతో కొత్తరకం మిషిన్లు కొనుక్కుంట. మమ్మల్ని ఆదుకుంటున్న కేసీఆర్సారుకు కృతజ్ఞతలు.
-గట్ల వెంకటేశ్, మేర (గోదావరిఖని)
గతంల ఏ ప్రభుత్వాలు పట్టించుకోలె
మేం తరతరాలుగా నకాశి వృత్తిని నమ్ముకొని బతుకుతున్నం. ఓపికున్నంతవరకు ఇదే వృత్తిని కొనసాగిస్తం. నా ముగ్గురు కొడుకులు అన్న కొడుకులు కూడా ఇదే పనిజేత్తున్నరు. ఒకప్పుడు ఈ పనికి మంచి ఆదరణ ఉండేది. కళాకారులుగా మాకు గుర్తింపు ఉండేది. కాలక్రమంలో ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. గతంల పాలించిన ప్రభుత్వాలు ఒక్కరూపాయి కూడా సాయం చేయలేదు. ఎందరో సీఎంలు వచ్చినా మా తలరాత మారలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కులవృత్తుల వారిని ఆదుకోవాలని నిర్ణయించడం, లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం ఎంతో సంతోషంగా ఉన్నది.
– ధనూరి లక్ష్మీనారాయణ, నకాశి కళాకారుడు(జగిత్యాల)
యాది పెట్టుకుంటం
ఈ ప్రభుత్వం అన్ని కులాలకు మంచిజేత్తున్నది. ఇప్పటికే కటింగ్ షాపులకు ఉచిత కరెంట్ ఇస్తున్నది. ఇప్పుడు కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న మాలాంటి వారికి సర్కార్ రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం సంతోషంగా ఉన్నది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం సారుకు బతికింతకాలం యాది పెట్టుకుంటం.
-మంథని రాంమూర్తి, నాయిబ్రహ్మణుడు (మంథని)
అన్ని విధాలా మాకు అండ
నేను గీతకార్మికున్ని. ప్రాణాలను పణంగా కల్లు గీస్తం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మమ్మల్ని గతంల ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలె. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలా అండగా ఉన్నది. మొన్ననే రైతు బీమా లెక్క గీతకార్మికుల బీమా అమలు చేస్తమని సీఎం కేసీఆర్ సారు చెప్పిండు. ఇప్పుడు మాలాంటి కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిండు. చాలా సంతోషం. మేమంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– గడ్డం తిరుపతి గౌడ్, గీతా కార్మికుడు, తాట్లవాయి (రాయికల్)
సర్కారుకు రుణపడి ఉంటం..
రాష్ట్రం రాకముందు రజకులకు కనీస గౌరవం దక్కలే. కనీసం బతుకు దెరువు కూడా లేదు. చాలీ చాలని బతుకులు ఎల్లదీస్తున్నం. తెలంగాణ అచ్చినంక, కేసీఆర్ సార్ సీఎం అయినంక మాకింత గుర్తింపు వచ్చింది. ఇస్తిరి పెట్టెలు ఇచ్చిండు. ఫ్రీగా కరెంట్ ఇస్తుండు. దోబీఘాట్లు కట్టించిండు. మా బతుకులు మార్చేందుకు రూ. లక్ష ఇస్తానన్న ఆయనకు రుణపడి ఉంటం.
– రెడ్డిరాజుల సదయ్య, రజకుడు వీణవంక
గుర్తించింది కేసీఆర్ సారే..
నేను కొన్నేండ్లుగా సెలూన్ నడుపుతూ బతుకుతున్న. తెలంగాణ అచ్చినంకా కేసీఆర్ సార్ సీఎం అయినంకనే మాకు కొంత గుర్తింపు వచ్చింది. షాపుల్లో సపరేట్ మీటర్లు పెట్టి 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నరు. దీంతోని మాకు చానా లాభం అయితంది. మళ్లా ఇపుడు కుల వృత్తుల కోసం ఆర్థిక సాయం ప్రకటించుడు చానా గొప్ప విషయం. ఈ పైసలు వస్తే నా షాపును మరింత డెవలప్ చేసుకుంట.
– నడిగొట్టు కుమారస్వామి, సెలూన్ నిర్వాహకుడు (మానకొండూర్)
వృత్తులకు జీవం పోస్తున్నరు..
యాంత్రీకరణ పెరుగడంతో కులవృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నాకు వృత్తి నైపుణ్యం ఉన్నా మిషిన్లు కొనే ఆర్థిక స్థోమతలేక అష్టకష్టాలు పడుతున్నం. అయితే తెలంగాణ వచ్చినంక చేతిపనివాళ్లకు మేలు జరుగుతున్నది. సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆదుకుంటున్నరు. కులవృత్తులకు జీవం పోస్తున్నరు. ఇప్పుడు రూ. లక్ష అందిస్తామని ప్రకటించడం ఎంతో సంతోషం. ఈ పైసలు అందింతే అవసరమున్న పరికరాలు కొనుక్కుంట.
– రవీంద్రాచారి, వడ్రంగి, రామకృష్ణ కాలనీ (తిమ్మాపూర్)
మాకు మేలు జరుగుతది..
మాకు నగల తయారే ఆధారం. మా వృత్తిలో నిత్యం పనిదొరుకుతది. కానీ, పెట్టుబడి లేక దుకాణాలు నడుపుకునేందుకు ఇబ్బందిపడుతున్నం. దీంతో దిక్కుతోచని స్థితిలో కూలీ పనికి పోతున్నరు. కొందరు వేరే పనిచూసుకుంటున్నరు. కార్పొరేట్ పోటీని తట్టుకోలేక అవుసుల పని మూలకు వడ్డది. ఇప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చే పైసలు మాకింత పెట్టుబడికో, పని ముట్లు కొనుక్కోవడానికో ఉపయోగపడ్తయి.
– అనుసూరి శ్రీనివాసాచారి, గోల్డ్స్మిత్ (కరీంనగర్)
షాపును డెవలప్ చేసుకుంట..
నేను మంథనిల చిన్న రేకుల డబ్బాల లాండ్రీషాపు నడుపుకొంటున్న. ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుండడంతో ఉన్నంతలో మంచిగానే బతుకుతున్నం. ఇప్పుడు సర్కారు ద్వారా రూ. లక్ష ఇస్తానని ప్రకటించడం ఆనందంగా ఉన్నది. ఈ పైసలతో షాపును డెవలప్ చేసుకుంట. కులవృత్తుల వాళ్లను ఆదుకుంటున్న ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంట.
-చంద్రగిరి, లింగయ్య, ఇస్త్రీ షాపు నిర్వాహకుడు (మంథని)
మా బతుకులు మారుతయ్..
కుల వృత్తిని నమ్ముకుని బతుకుతున్నం. పొద్దటికి ఉంటే మాపటికి ఉండదు.. మాపటికి ఉంటే పొద్దటికి ఉండదు అన్నట్లు ఉన్నయ్ మా బతుకులు. ఎంత కట్టం జేసి చాట్లు , గుల్లలు అల్లినా మిగిలేది అంతంతే. మా జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ సారు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామనడం సంతోషంగా ఉన్నది. ఆయన తప్పకుంట చేస్తాడనే నమ్మకం ఉన్నది.
– ఏకుల శకుంతల, మేదరి (కరీంనగర్)
ఇన్నేండ్లు ఎవరూ పట్టించుకోలె..
రెడీమేడ్ సామాను మార్కెట్లోకి అచ్చినంక వడ్రంగి వృత్తి దెబ్బతిన్నది. సిమెంట్ దర్వాజలు, ప్లాస్టిక్ తలుపులు, కిటికీలు దొరుకుతున్నయ్. చేద్దామంటే పనిలేక వారంల మూడు రోజులు ఖాళీగా ఉండాల్సి అత్తున్నది. గతంలో ఎందరో పరిపాలన జేసిన్రు. కానీ కుల వృత్తుల గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు మాలాంటోళ్లను గుర్తించిన్రు. లక్ష రూపాయలు అందజేస్తామని ప్రకటించడం ఆనందంగా ఉన్నది.
-సీపెల్లి మారుతి చారి, వడ్రంగి (గోదావరిఖని)
రూ. లక్ష ఇవ్వడం గొప్ప విషయం
బ్యాంకు గ్యారంటీ లేకుండా కులవృత్తులను నమ్ముకున్న వారికి రూ. లక్ష సాయం చేయాలని నిర్ణయించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్కు నా ధన్యవాదాలు. వందల ఏండ్ల సంది వడ్లోళ్లకు కులవృత్తే ఆధారం. వడ్లోళ్లే కాదు.. కమ్మరులు, కంచరి కులస్తులు, విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం కులవృత్తులనే నమ్ముకొని బతుకుతంది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా మిషనరీ అయిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో మా వృత్తి దెబ్బతిన్నది. తరుణంలో సీఎం కేసీఆర్ కులవృత్తుల వారికి లక్ష రూపాయల సాయం అని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మాలాంటి వారెందరో రుణపడి ఉంటారు.
– మ్యాలపు శ్రీనివాస్, వడ్రంగి (జగిత్యాల)
కుల వృత్తులకు గౌరవం
సీఎం కేసీఆర్ మొదటి నుంచీ కులవృత్తు లకు చేయూతనందిస్తున్నరు. వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రోత్సాహం అందిస్తున్నరు. ఇప్పటికే అనే క సబ్సిడీ, సంక్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తున్నరు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కృషితో కులవృత్తులకు మరింత గౌరవం దకింది. కుటుంబాలకు రూ.లక్ష ఇస్తామ ని చెప్పడం చాలా గొప్ప విషయం. ఇది చేతివృత్తులను నమ్ముకున్న కుటుంబాలకు భరోసానిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా శాలివాహన కుమ్మరి సంఘం పక్షాన సీఎంకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఇల్లందుల వెంకటేశం, శాలివాహన కుమ్మరి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి(వేములవాడ)
ఆర్థికసాయం అభినందనీయం
కుల వృత్తులను నమ్ముకొని బతుకున్న కుటుంబాలకు సర్కారు రూ. లక్ష ఆర్ధిక సాయం అందిస్తామనడం అభినందనీయం. ఇది గొప్ప నిర్ణయం. నేను హేయిర్ైస్టెల్ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న. అయితే షాపు చిన్నగా ఉండడంతో గిరాకీ కూడా తక్కువగా ఉంటున్నది. ఇప్పుడు సర్కారు అందించే లక్ష రూపాయలతో షాపును విస్తరించుకుంట. నాలాంటి ఎందరినో ఆదుకుంటున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– గొల్లపల్లి శ్రీనివాస్, నాయీబ్రాహ్మణుడు (పెగడపల్లి)
గిసొంటి సీఎం ఉండాలే..
మేం తాటి, ఈత చెట్లు ఎక్కి కల్లు గీస్తూ ఇల్లు గడుపుకొంటున్నం. మమ్మల్ని ఏ సర్కారు పట్టించుకోలె. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ కులవృత్తి పనిచేసే వారిని ఆదుకుంటున్నడు. గీత కార్మికులు ప్రమాదవశాత్తూ తాటి చెట్టు పై నుంచి పడి చనిపోతే రూ. 5 లక్షల బీమా ఇస్తున్నడు. ఇపుడు కుల వృత్తులకు లక్ష రూపాయలు ఇస్తమని చెప్పడం చానా సం తోషంగా ఉన్నది. ఇసొంటి ముఖ్యమం త్రే ఎప్పటికి ఉండాలె.
– ఎగోలపు కొంరయ్య, గీత కార్మికుడు, గోపాల్రావు పేట (రామడుగు)