ఓదెల, ఆగస్టు 4: ఆధునీకరణ పనుల పేరిట కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ మధ్యన నడిచే సింగరేణి, రామగిరి రైళ్లను రద్దు చేసి నెలన్నర దాటింది. దీంతో కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సికింద్రాబాద్ సెక్షన్లో రైల్వే ఆధునీకరణ పనుల పేరిట జూన్ 20న వారం పాటు సింగరేణి (17033, 17034), రామగిరి (17003, 17004) రైళ్లను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి పదిహేనురోజులకోసారి పొడిగిస్తూ వస్తున్నది. సికింద్రాబాద్ సెక్షన్లో పనులు జరిగితే కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ రైళ్లను రద్దు చేయడం ఏమిటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేసున్నారు. తాజాగా ఆగస్టు 13 వరకు రైళ్ల రద్దును పొడిగించారు.
సింగరేణి రైలును ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభించారు. ఈ రైలు కార్మికులు, ఉద్యోగుల రవాణాకు సౌలభ్యంగా ఉన్నది. అలాగే సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయాలు, దవాఖానలు కొత్తగూడెంలోనే ఉన్నాయి. కార్మికులు ముఖ్యమైన పనుల కోసం కొత్తగూడెం, అలాగే భద్రాచలంలోని పుణ్యక్షేత్రానికి సింగరేణి రైలులో వెళ్తుంటారు. అలాగే రామగిరి కాజీపేట్ నుంచి బల్లార్షా వరకు వెళ్తుంది. ఉదయం, సాయంత్రం ప్రభుత్వ కార్యాలయాల పనివేళలకు అనుగుణంగా నడుస్తుండడంతో ఉద్యోగులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలు రద్దుతో వీరు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అవసరం లేకున్న రైళ్ల రద్దును పొడిగిస్తూ వస్తున్నా బీజేపీ సర్కారుపై మండిపడుతున్నారు. ఈ రైళ్ల రద్దు నేపథ్యంలో సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్నగర్ మధ్యన నడిచే కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలును కొలనూర్, పొత్కపల్లి స్టేషన్లలో ఆపాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవ డం లేదని ఆవేదనకు గురవుతున్నారు. వెంటనే రైళ్లను పునరుద్ధ్దరించాలని ప్రజలు కోరుతున్నారు.