కార్పొరేషన్, అక్టోబర్ 28 : ఎన్నికల హామీలతో మోసకారి కాంగ్రెస్ను నమ్మవద్దని, నమ్మి ఓటు వేస్తే అధోగతి తప్పదని చొప్పదండి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జి, మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అని ఆ పార్టీ మభ్యపెడుతున్నదని, నమ్మితే మునుగుడు ఖాయమన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ చేత్తులెత్తేసిందని, అక్కడ ప్రజలను మోసం చేసినట్టే ఇక్కడ కూడా మోసం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సురక్షితంగా ఉటుందని, బీఆర్ఎస్కు ఓటు వేయకపోతే భవిష్యత్తు పిల్లల బతుకుల్లో మట్టి కొట్టినట్లే అవుతుందన్నారు. కరీంనగర్లోని గంగాధర జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య నివాసంలో శనివారం చొప్పదండి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి మంత్రి గంగుల హాజరై, మాట్లాడారు. చొప్పదండి ఇన్చార్జిగా అధినేత కేసీఆర్ తనకు గొప్ప అవకాశం ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు తీసిందని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 56 ఏళ్ల కిత్రం తమ తాతలు తప్పు చేస్తే మన తరాలు తీవ్ర నష్టపోయాయని, సాగునీరు లేక పని లేక విదేశాలకు వలసపోయే పరిస్థితులను చూశామన్నారు. సమైక్యాంధ్రలో ఆంధ్రల్లో వరదల్లో కొబ్బరిచెట్లు పోతే నాయకులంతా తరలివెళ్లి నష్టపరిహారం అందించే వారని, కానీ, తెలంగాణ వరి నారు ఎండిపోతే పట్టించుకునే దిక్కు ఉండేదని కాదన్నారు. గోదారి గతంలో ధవళేశర్వం వద్దే ఆగేదని, ఇప్పుడు కాళేశ్వరం వద్ద ఆగడంతో ప్రతి ఏకరాకు సాగునీరు అందుతుందన్నారు.
ఇప్పుడు ప్రపంచమే తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్లో పెరిగిన సంపదను తెలంగాణ జిల్లాలకు పంచుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉండాల్సినా అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన మొదటిసారి జరిగినప్పుడు ఆంధ్రలోని టీడీపీ, కాంగ్రెస్ నాయకులంతా ఏకమైన అడ్డుకున్నారని, అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ వస్తే గుడ్డిదీపం అవుతుందన్నారని గుర్తు చేశారు. ఆ కిరణ్కుమార్ ఇప్పుడు బీజేపీ ముసుగులో హైదరాబాద్లో ఉన్నారని, ఆయనకు ఇక్కడ ఏం పని అని నిలదీశారు. గుంటూర్లోనే, విజయవాడలో ఎందుకు ఉండడం లేదన్నారు.
షర్మిల ఎందుకు ఇక్కడ తిరుగుతుందని, కేవీపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. అదే మనం గుంటూరు పోయి రాజకీయం చేయనిస్తారని ప్రశ్నించారు. ఏదో విధంగా కేసీఆర్ ఓడిపోతే తీసుకెళ్లి మళ్లీ తెలంగాణను ఆంధ్రలో కలపాలన్న కుట్రలు సాగుతున్నాయన్నారు. 1956లో కుట్రలు జరిగాయని, మళ్లీ జరిగితే ఇక్కడ సంపద, కరెంటు, బొగ్గు, నీరు తరలించుకుపోతారని దుయ్యబట్టారు. తెచ్చుకున్న తెలంగాణ మన చేతుల్లోనే ఉండాలన్నారు. పోరాడి సాధించుకున్న మన రాష్టాన్ని కాపాడుకోవాలంటే ఆచితూచి ఓటు వేయాల్సినా అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి చొప్పదండిలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో చొప్పదండి నియోజకవర్గ ముఖ్య నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, ప్రేంసాగర్రావు, ఎనుగు రవీందర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, తిరుమల్రావు, మధుకర్, నాయకులు, ముఖ్యకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే పార్టీకి కొండంత బలం. బీఆర్ఎస్కు బలమైన కార్యకర్తల శక్తి ఉన్నది. ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశాం. యువత, మహిళలు, ప్రజలందరు కూడ బీఆర్ఎస్కు అండగా ఉన్నరు. వారిని కలుసుకొని మన పథకాలపై వివరించాల్సినా అవసరం ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్తలు బలంగా కృషి చేయాలి.
రాష్ర్టానికి టాక్స్ల నుంచి వచ్చే ఆదాయం గత పదేళ్లలోనే మూడింతలు పెరిగింది. ఇప్పటికే పెద్ద ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ర్టానికి వస్తున్న ఆదాయం వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతం. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అందరు కలిసి గెలిపించుకోవాలి. ఇప్పటికే పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఏటా నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. రాబోయే రోజుల్లో మరింతగా నిధులు పెరిగే అవకాశమున్నది. మూడోసారి సీఎంగా కేసీఆర్ను నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేసి అభ్యర్థులను గెలిపించాలి.
– బోయినపల్లి వినోద్కుమార్,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు