ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 9: మంత్రి కేటీఆర్ మరోసారి మాటనిలబెట్టుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చి, ‘నేనున్నా’ననే భరోసానిచ్చారు. అలాగే విద్యార్థుల కోరిక మేరకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించి, చదువులకు ప్రోత్సాహం అందించారు. వీర్నపల్లి వైస్ ఎంపీపీ (గర్జనపల్లి ఎంపీటీసీ) ఈసంపల్లి హేమలత భర్త దేవేందర్ గుండెపోటుతో మృతి చెందగా, గత నెల 30న బాధిత కుటుంబాన్ని అమాత్యుడు రామన్న పరామర్శించారు. కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అదే రోజు పోతిరెడ్డిపల్లిలో పర్యటించిన సందర్భంగా, స్థానిక విద్యార్థులు వెంకటాపూర్ వెళ్లేందుకు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు.
వెంటనే స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి ఫొటోలు సైతం తీసుకున్నారు. మాటిచ్చి పదిహేను రోజులు గడువక ముందే ఈసంపల్లి హేమలత ఇద్దరు కూతుళ్ల పేరిట 2.50 లక్షల చొప్పున కేడీసీసీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. సదరు బాండ్లను బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గురువారం దేవేందర్ కుటుంబసభ్యులకు అందించారు. అలాగే విద్యార్థుల కోరిక మేరకు పోతిరెడ్డిపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. ఇక్కడ ఎంపీపీ మాలోత్ భూలా, జడ్పీటీసీ గుగులోత్ కళావతి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్, సర్పంచ్ గొర్రె కరుణ, ఉపసర్పంచ్ దర్శనాల రామస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.