మాట్లాడితే దేవుళ్లు, గుళ్లు అనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ఐదేండ్లలో ఏం చేసిండు? కరీంనగర్ లోక్సభ పరిధిలో ఎములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ఇల్లందకుంటలో రాములోరి ఆలయాలకు మోదీని అడిగి ఐదు పైసలన్నా తెచ్చిండా..? ఒక్క గుడి కట్టలే, ఒక్క బడి కట్టలే. దేవుడి పేరిట రాజకీయం చేయడం తప్ప నువ్వేం చేశావ్..? దమ్ముంటే చర్చకు రావాలి. సమయం, స్థలం ఎక్కడో చెబితే అక్కడికి వచ్చి చర్చించేందుకు మా పార్లమెంట్ అభ్యర్థి బీ వినోద్కుమార్ సిద్ధంగా ఉన్నరు. నువ్వు రెడీనా..?
– ఎంపీ సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్
కరీంనగర్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ బండి సంజయ్కి దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ఐదేళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా సంజయ్ ఏం చేశారో.. సమాధానం చెప్పే సత్తా ఉందా..? అని ప్రశ్నించారు. కరీంనగర్లోని రాజశ్రీ గార్డెన్లో బుధవారం నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సోషల్ వారియర్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నాటి ఉద్యమ పరిస్థితులు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సాధించిన విజయాలను సమగ్రంగా వివరించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, కానీ తమ పార్టీని బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారని, అందులో కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ అగ్రగన్యులని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనకు బొట్టుపెట్టుడు నేర్పించినట్టు, గుళ్లకు వెళ్లడం అలవాటు చేశారన్నట్టు, దేవుళ్లను వాళ్లే పరిచయం చేశారన్నట్లు బిల్డప్లు ఇస్తున్నారని విమర్శించారు.
మనం కూడా హిందువులమేనని, హిందూ ధర్మాన్ని బలంగా నమ్మే వాళ్లమేనన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా యాదాద్రి కట్టి నా వాళ్లలాగా రాజకీయం కోసం మాత్రం దేవుళ్లను ఎన్నడూ వాడుకోలేదని అన్నారు. దేవున్ని, ధర్మాన్ని శ్రద్ధతోని అకుంఠిత భక్తితో కొలిచే వారు ఏనాడూ రాజకీయం చేయరని, బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
వినోద్కుమార్ ఎంపీగా ఉన్నపుడు ట్రిపుల్ ఐటీ కోసం ప్రతిపాదించారని, కేసీఆర్ ఎంపీగా ఉన్నపుడు కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు ప్రతిపాదించారని, కనీసం ఈ పనులైనా పూర్తి చేసేందుకు ప్రయత్నించావా..? అని సంజయ్ను కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన అట్టర్ ప్లాప్ అయ్యారని, ఆయనతో ఏం జరిగింది? ఏం ఒరిగిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో వినోద్కుమార్ 553 ప్రశ్నలు అడిగితే, బండి సంజయ్ 57 ప్రశ్నలు మాత్రమే అడిగాడని ఆధారాలతో సహా చూపించారు.
ఇలాంటి ఎంపీ కావాలా..? విద్యావంతుడైన వినోద్కుమార్ కావాలా..? కరీంనగర్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. పదేళ్లలో లోక్సభలో బీఆర్ఎస్ 4,754 ప్రశ్నలు సంధిస్తే, కాంగ్రెస్ 1,271, బీజేపీ 190 ప్రశ్నలు మాత్రమే అడిగిందని అన్నారు. అందుకే పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నామని చెప్పారు. కరీంనగర్లో కూడా బోయినపల్లి వినోద్కుమార్ గెలిచి తీరాలని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్ల గెలిచారో ఒకసారి ఆలోచన చేయాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్, మానకొండూర్లో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడలో ఆది శ్రీనివాస్ నాలుగేసి సార్లు, చొప్పదండిలో మేడిపల్లి సత్యం రెండుసార్లు ఓడిపోయారని, కేవలం పలుసార్లు ఓడిపోయారనే సానుభూతితోనే గెలిచారని చెప్పారు. సిరిసిల్లలో తనపై పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి కూడా ఇదే ప్రచారం చేసుకున్నారని, కానీ సక్సెస్ కాలేకపోయారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పని చేయలేదనే ఆరోపణలు లేవని, వాళ్లపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు సానుభూతి కలిసివచ్చిందన్నారు. ఏడుపులు, బొబ్బలతో, కాళ్లు పట్టుకొని, కడుపుల తలపెట్టి ఓట్లు అడిగిన వాళ్లంతా ఎమ్మెల్యేలు అయ్యారని, ఇప్పుడు వాళ్లపై ఎలాంటి సానుభూతి ఉండదన్నారు. అయినా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్గా పనిచేస్తున్నది. ఒక్కొక్కరూ వెయ్యి రెండు వేల ఓట్లను ప్రభావితం చేసే శక్తి ఉన్నవాళ్లు మన వారియర్స్. 1969లో మొదటి తెలంగాణ ఉద్యమంలో ఇంత ప్రచార మాధ్యమాలు లేవు. అయినా ఉద్యమం ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్టు ఒకరి ద్వారా ఇంకొకరికి చేరుతూ దావానంలా వ్యాప్తి చెందింది. తర్వాత ఏ రోజుకారోజు పేపర్లు, ఎప్పటికపుడు సమాచారం అందించే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా వీటన్నింటిని తలదన్నుతున్నది.
యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రాం, ట్విట్టర్ (ఎక్స్), వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ఐదు అస్ర్తాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పించుకుని మోడీ పీఎం, రేవంత్ సీఎం అయ్యారు. మేం అధికారంలోకి వస్తామని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సి వస్తదని కాంగ్రెస్ నాయకులు కూడా అనుకోలేదు. ఈ క్రమంలో ఏది పడితే అది ఫ్రీ అని చెప్పుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ నాయకులు వాటిని లెక్క గడుతరని వాళ్లు ఊహించలేదు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి అనేక సందర్భాలున్నాయి. బీజేపీ ప్రతి గెలుపు వెనుక కాంగ్రెస్ ఉన్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి రావడంతో అప్పుడు పోటీ చేసిన పొన్నం ప్రభాకర్కు డిపాజిట్ దక్కలేదు. ఈ విషయాన్ని మరిచిపోవద్దు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను గెలిపించేందుకు కాంగ్రెస్ నామమాత్రుడైన ఒక యువకుడిని పెట్టింది. పైగా బీజేపీకి తమ పార్టీ బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేయడం సిగ్గుచేటు. సోషల్ వారియర్స్ ప్రతి విషయాన్నీ వీడియో తీసి మాకు పంపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలు సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు, అసత్యాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వారియర్స్కు బీఆర్ఎస్ నాయకులు అవగాహన కల్పించారు. కేసీఆర్ సర్కారు పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాల గురించి సమగ్రంగా వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఏ విధంగా విఫలమవుతున్నది? ఆ పార్టీ మాట మారుస్తున్న తీరు ఎలా ఉన్నది? సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి? ఎలాంటి పోస్టులు పెట్టాలి? ఇలా ప్రతి విషయంపై సోషల్ మీడియా ఇన్చార్జిలు ప్రశాంత్, క్రిషాంక్, విష్ణువర్ధన్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
రెండు సెషన్లలో ఈ కార్యక్రమం నిర్వహించగా, కేటీఆర్తోపాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఆసాంతం వేదిక కింద ఉండి విన్నారు. కేటీఆర్ కూడా కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇస్తూ వివరించారు. అదానీపై ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఎన్నికల తర్వాత ఏమంటున్నారు? అనే విషయాలను, బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల వేళ ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్ కుమార్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, పలు జిల్లాల జడ్పీ అధ్యక్షులు పాల్గొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అయినా బీఆర్ఎస్కే ఓట్లు అధికంగా వచ్చాయి. ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రాం ఇప్పుడు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఐదు అస్ర్తాలను వాడుకునే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ఇప్పుడున్న మాధ్యమాల్లో సోషల్ మీడియా అత్యంత శక్తి వంతమైనది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం తక్కువ, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎక్కువ. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయాలనే ప్రస్తావించేది. కేసీఆర్కు అభివృద్ధి తప్పితే రాజకీయం చేయడం రాదు. గతంలో నాకు ఈ సోషల్ మీడియాను వాడుకునే పద్ధతి తెలిసేది కాదు. ఇపుడు అన్నింటిని విరివిగా వాడుతున్నా. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఎంతో గొప్పగా పనిచేయాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
– బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎంపీ
రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్దే భవిష్యత్. వారియర్స్ సోషల్ మీడియా వేదికగా చురుగ్గా పనిచేయాలి. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. గతంలో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలో ఎవరూ చేయలేదు. కానీ, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మాట్లాడుతుంటే జెర్రులు పారినట్లుగా ఉంటున్నది. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారం చేశాయి. కానీ, కేసీఆర్ సర్కారు 2,02,637 ఉద్యోగాలు ఇచ్చింది. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా కేసీఆర్ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా. సోషల్ మీడియాలో ఏ పోస్టు పెడితే ఏమవుతుందోనని సోషల్ మీడియా వారియర్స్ భయపడాల్సిన అవసరం లేదు. మనకు కేసీఆర్, కేటీఆర్ ఉన్నారనే ధైర్యంతో పని చేద్దాం. ఈ సారి కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇద్దాం.
– పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే