పెగడపల్లి, జనవరి 9: రాష్ట్రంలో మాదిరిగానే దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని, రాబోయే రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. సోమవారం పెగడపల్లి మండలం లింగాపూర్, పెగడపల్లి మండల కేంద్రంలో దాదాపు 4కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎంపీపీ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు 32 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని, దేశ ప్రజలకు అలాంటి పాలనను అందించేందుకు బీఆర్ఎస్ను స్థాపించారని చెప్పారు. పార్టీకి అన్ని రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నదని, కేసీఆర్పై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ ఎదుగుదలను ఆపలేరని మంత్రి స్పష్టం చేశారు.