స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చొరవతో సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నాటి చీకట్లు తొలగించుకొని కొత్త వెలుగులు విరజిమ్ముతున్నది. అయితే ఈ వెలుగుల ప్రస్థానం నిరంతరం కొనసాగాలన్నా.. పెరుగబోయే డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కావాలన్నా అది భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ద్వారానే సాధ్యమవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అందుకే సెస్ ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు జైకొడుతున్నారు. ఈ మేరకు గ్రామాలతోపాటు పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుండగా.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా గెలువాలన్న తపనతో ఓటర్లును తమవైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలిస్తూ మాయమాటలు చెబుతున్నారు. అయినా నమ్మని ఓటర్లు అమాత్యుడు కేటీఆర్పై అంచెంచల విశ్వాసం చూపుతూ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య రాష్ట్రంలో సెస్ పరిధిలోని వినియోగదారులు పడని కష్టమంటూ లేదు. ముఖ్యంగా ఆనాడు మెట్టప్రాంతంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నాణ్యమైన విద్యుత్ రాక, అందులోనూ ఆరు గంటలూ కరంట్ లేక అన్నదాతలు అనేక అవస్థలు పడేవారు. అంతేకాదు, విరిగిన పోల్స్, వేలాడే తీగలతోపాటు ఎక్కడచూసినా ట్రాన్స్ఫార్మర్లు తగినంత సామర్థ్యం లేక మోటర్లు కోకొల్లలుగా కాలిపోయేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీపంట కాలంలో కనీసం రెండు నుంచి నాలుగు సార్లు మోటర్లు కాలిపోయి రైతన్న ఆర్థికంగా నష్టపోయేది. అలాగే, ఆనాడు కోతలతో సాంచాలు మూతపడేవి. పవర్ హాలిడేల పేరిట కరంట్ ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో కార్మికులకు ఉపాధిలేక వందల కుటుంబాలు ఆత్మహత్యల పాలయ్యాయి. ఇలా చెప్పుకుంటూపోతే సమైక్య రాష్ట్రంలో సెస్ పరిధిలోని వినియోగదారుల కష్టాలు వర్ణణాతీతంగా ఉండేవి.
కరెంట్ కష్టాలు తప్పినయ్
మాది శివంగాళపల్లి. నాకు మూడున్నరెకరాల పొలం ఉంది. గతంలో కరంటు కోసం అరిగోసపడ్డాం. ఎప్పుడు వస్తదో.. పోతదో తెలియక నరకం చూసినం. రాత్రిపూట కరంటు కోసం పొలాల దగ్గర్నే పడుకునేది. ఎప్పుడిస్తరో అని ఎదురుచూసేటోళ్లం. నిద్ర పోయేటోళ్లం కాదు. ఇగ మోటరు కాన్నే చీకట్ల పురుగుబూసి రాకుండా కట్టెలతో మంట పెట్టుకొని ఉండేది. ఎప్పుడో రాత్రి రెండు, మూడు గంటలకు అచ్చేది. అది కూడా ఓ గంట ఇచ్చి, మళ్లో గంట బంజేసేటోళ్లు. ఇగ పొలం ఏం పారుతది. చివరి పొలానికి నీళ్లందక ఎండిపోయేది. అప్పుడు మాకు నిమ్మపల్లిలో ఉన్న సబ్స్టేషన్ నుంచే కరంట్ వచ్చేది. మోటర్లు ఎక్కువై ట్రాన్స్ఫార్మర్, మోటర్లు కాలేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినంక మూడు ఊళ్లకు ఓ సబ్స్టేషన్ పెట్టిన్రు. మా పొలానికి దగ్గర్లనే కోనరావుపేటలో ఏర్పాటు చేసిన్రు. ఇప్పుడు 24గంటల కరంటు ఉంటుంది. మూడెకురాలు పారుతుంది. సీఎం కేసీఆర్ సారు వల్లనే కరంటు గోస తప్పింది.
– ఉప్పల బాల్రెడ్డి, రైతు, శివంగాళపల్లి
(కోనరావుపేట)
స్వరాష్ట్రంలో వెలుగులు
నాడు చీకట్లు అలుముకున్న సెస్ నేడు వెలుగులు విరజిమ్ముతున్నది. స్వరాష్ట్రంలో సెస్ రూపురేఖలను మంత్రి కేటీఆర్ పూర్తిగా మార్చేశారు. విద్యుత్ మూడింతలు పెరిగినా.. అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలక భూమిక పోషించారు. 70కోట్లతో పెద్దూరులో 220 కేవీసబ్స్టేషన్, 260.50 కోట్లతో సగటున ప్రతి రెండు గ్రామాలకొక 33/11కేవీసబ్స్టేషన్ మంజూరు చేయించారు. మొత్తంగా 27 ఏర్పాటు చేయించారు. ఫలితంగా నాడు ఏడారిని తలపించిన ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా మారింది. 2014కు ముందు వ్యవసాయ కనెక్షన్లు 40 వేలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 73,735కి చేరింది. ఏడాదికి 200 మిలియన్ యూనిట్ల నుంచి 630 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సెస్ సరఫరా చేస్తున్నది. ఇందుకు ప్రభుత్వం 308 కోట్లు చెల్లిస్తున్నది. అలాగే మరమగ్గాల పరిశ్రమకు 27 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తుండగా, నేతన్నలకు అండగా నిలిచేందుకు మంత్రి కేటీఆర్ మరమగ్గాలకు విద్యుత్ రాయితీని కల్పిస్తున్నారు. ఇందు కోసం ఏడాదికి ప్రభుత్వం 5.50కోట్లు భారాన్ని భరిస్తున్నది. 2018 సంవత్సరం నుంచి 2022 వరకు వ్యవసాయానికి 1460కోట్లు, మరమగ్గాల సబ్సిడీ 2001 నుంచి 2022వరకు 115.50 కోట్లు చెల్లించింది. నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్లు, ధోబీలకు 250 యూనిట్ల కరెంటు సబ్సిడీపై అందిస్తున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నది. వంగి, విరిగి పోయిన స్థితిలో ఉన్న వి ద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లను సరిచేసేందుకు 7.42 కోట్లు వెచ్చించింది. వీటిలో మిడిల్ పోల్స్ 35 28, దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తగా 4954 వేశారు. థర్డ్వైరు 483 కిలోమీటర్లు సరిచేశారు.
అందరి చూపూ బీఆర్ఎస్ వైపే
నాటి సమైక్యాంధ్ర, నేటి స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని బేరీజు వేసుకుంటున్న సిరిసిల్ల సెస్ ఓటర్లు కాదు, ప్రజలంతా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారు. ఓటు వేసేందుకు నిర్ణయించుకొని ఇప్పటికే అనేక గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. పలు సంఘాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఏ ఓటర్ను కదిలించిన మంత్రి కేటీఆర్పై ఉన్న అంచంచల విశ్వాసం చూపుతున్నా రు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా అన్ని చోట్ల ఓటర్లను కలిసి జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్లో పూర్తి కానున్న ప్రాజెక్టులు, తద్వారా పెరగనున్న సాగు, విద్యుత్ డిమాండ్కు అను గుణంగా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తీసుకునే చర్యలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో వాస్తవాలన్నీ ఓటర్ల, ప్రజల కండ్ల ముందే కనిపిస్తుండడంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు మంచి స్పందన వస్తున్నది. ఈ స్పందనను తట్టుకోలేని కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఎలాగైనా సరే గెలువాలన్న తపనతో ప్రజలను మాయ మాటలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను డైరెక్టర్గా గెలిపిస్తే బిల్లులు మాఫీ చేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది ఫ్రీగా ఇంటి కనెక్షన్లు ఇస్తామని చెబుతున్నారు. ఇది ఆచరణ సాధ్యం కాదన్న విషయాన్ని గమనించి ప్రజలు, ఓటర్లు వారి ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని సదరు నేతలు తమ పంతం నెగ్గించు కోవడానికి టీఆర్ఎస్ అభ్యర్థులపై అసత్య ప్రచారాలకు ఒడిగడు తున్నారు. అయితే.. ఓటర్లు మాత్రం ఇవేమీ పట్టించు కోకుండా తమకు వెలుగులు ఇస్తున్న బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి సెస్ను మరింత బలోపేతం చేసుకునేందుకు బాటలు వేసుకుం టామని చెబు తున్నారు. స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు.
రామన్నకు రుణపడి ఉండాలె..
సరిగ్గా ఇరవై ఏళ్ల కింద సిరిసిల్ల అంటే సావుల ఖిల్లా అనేటోళ్లు. ఏరోజు ఎవరి సావు వినాల్సి వస్తుందోనన్న భయం ఉండేది. ఏవాడకు పోయినా ఇక్కడో కార్మికుడు ఉరేసుకున్నాడన్న వార్తే. ముష్టిపెల్లిలో కొండ కిష్టయ్య కుటుంబంతో మొదలైన ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగినయ్. సాంచాలు సడ్వగ నడవక జోకి అమ్ముకున్నరు. పనిలేక చాలా మంది పొట్ట చేతపట్టుకొని బొంబై, భీవండీకి వలస పోయిన్రు. తెలంగాణ వచ్చినంక మంత్రి కేటీఆర్ పుణ్యాన సాంచాలకు మంచి రోజులచ్చినయ్. కరెంటు సబ్సిడీ ఇస్తున్రు. బతుకమ్మ చీరెలతో చేతినిండా పని కల్పించిన్రు. కడుపు నిండాతింటున్నం. కంటి నిండా నిద్ర పోతున్నం. ఇన్ని జేత్తున్న రామన్న చెప్పినోళ్లకే సెస్ ఎలక్షన్లో ఓటేత్తం.
– జక్కని గణేశ్, నేత కార్మికుడు (సిరిసిల్ల)
బీఆర్ఎస్ అభ్యర్థులకే మా సంపూర్ణ మద్దతు
దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నది. మరమగ్గాల ఆధునీకరణ, నూలు, కరెంటు సబ్సిడీలు ఇచ్చి అండగా నిలిచింది. సాంచాల పరిశ్రమ మూసి వేద్దామనుకున్న సమయంలో మంత్రి కేటీఆర్ నేనున్నానంటూ మాకు కొండంత దైర్యం ఇచ్చిండు. ఆయన ప్రోత్సాహం, సహకారంతోనే ఈరోజు మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది. ఏడాదికి 5.50 కోట్లు కరెంటు సబ్సిడీ చెల్లిస్తున్నది. పదివేల బిల్లు వచ్చే కార్ఖానాలకు 5వేలు కడుతున్నం. మిగిలిన 5వేలు ప్రభుత్వమే సెస్కు చెల్లిస్తున్నది. మా పరిశ్రమకు అండగా నిలిచిన కేటీఆర్ కోసం కృతజ్ఞతగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం పక్షాన తీర్మానం చేసుకున్నం.
– మండల సత్యం, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు