“పెద్దసంఖ్యలో ఉన్న కార్యకర్తలే బీఆర్ఎస్ బలగం.. పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను తెచ్చారు. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సముద్రంపాలవుతున్న గోదావరిని నీటిని మన భూములకు మళ్లించారు. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం గన్నేరువరంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్టారావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.
– తిమ్మాపూర్ రూరల్, మార్చి 28
తిమ్మాపూర్ రూరల్, మార్చి 28: ‘తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చాటి చెప్పండి.. ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టండి’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక్కడికి తరలివచ్చిన కార్యకర్తలే మన బలగం అని, వీరందరిని సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడపగడపకూ చేర్చాలని ఉద్బోధించారు. ఉమ్మడి పాలనలోని పరిస్థితులు, రాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చిన మార్పులను ప్రజలకు విడమరిచి చెప్పాలని విజ్ఞప్తిచేశారు. మంగళవారం గన్నేరువరంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి వినోద్తో పాటు పార్టీ జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్టారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోనే పెద్దసంఖ్యలో సభ్యత్వం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని స్పష్టం చేశారు. ఇరవై ఏండ్ల కింద గన్నేరువరం మండలం ఎలా ఉండేదో, పచ్చని పైర్లతో ఇప్పుడెలా కళకళలాడుతున్నదో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సాగుకు సీఎం కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు, రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించాల న్నారు. తెలంగాణ వస్తే కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని, అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఎద్దేవా చేశారని, కానీ ఇప్పుడు అదే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి వెలుగులు నింపారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వృథాగా పోయే వెయ్యి టీఎంసీల గోదారి జలాలను బీడు భూ ములకు తరలించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ పథకాల అమలు వెనుక ఎంత కష్టం దాగి ఉన్నదో ప్రజలకు వివరించాలన్నారు. గతంలో వడ్లను దొంగ లు ఎత్తుకెళ్తారని రాశులపై గుర్తులను పెట్టి వెళ్లేవాళ్లమ ని, ఇప్పుడు వడ్ల రాశులను రోడ్లపై కుప్పలుగా పోసి ధైర్యంగా అమ్ముకునే స్థాయికి ఎదిగామని స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు లేకున్నా గొప్ప గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఆయన దృఢ సంకల్పంతోనే నేడు సాగు పండుగులా మారిందన్నారు. నేడు మూడేండ్లు కరువు వచ్చినా తెలంగాణకు ఎలాం టి ఢోకా లేదని చెప్పారు.
కేంద్రం పెట్టే కేసులకు భయపడం
ప్రతిపక్ష పార్టీల నాయకులు రేవంత్రెడ్డి, బండి సంజయ్ లేనిపోనివి చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వారికి పార్టీ నాయకులు దీటుగా సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. కేంద్రం కొర్రీలు పెడుతూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నది..వాటిని ధై ర్యంగా ఎదుర్కొంటాం’ అని తేల్చిచెప్పారు. తప్పు చే యనప్పుడు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
టీఎస్పీఎస్సీలో ఇద్దరు సిబ్బంది చేసిన తప్పుకు ప్రభుత్వంపై, మంత్రులపై తెలివి లేకుండా ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని ఆక్షేపించారు. కార్యక్రమ అనంతరం మండల పార్టీ ఆధ్వర్యంలో వినోద్కుమార్, రసరమయి, సారయ్య, జీవీఆర్లను గజమాలతో సత్కరించారు. అంతకుముందు కాసింపేట చౌరస్తా వద్ద అతిథులకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బైక్ ర్యాలీగా వచ్చారు. సమావేశం వద్ద పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఇక్కడ ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, పార్టీ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, నాయకులు మన్మోహన్రావు, తీగల మోహన్రెడ్డి, కచ్చు రాజయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గన్నేరువరం అభివృద్ధిపై చర్చపెట్టాలె..
తాను ఎమ్మెల్యే అయ్యాక గన్నేరువరం మండలం ఎంతగానో అభివృద్ధి చెందింది. రూ.117 కోట్లతో పనులు చేపట్టిన. సీఎం కేసీఆర్తో మాట్లాడి గన్నేరువరం-గుండ్లపల్లి- పొత్తూరు దాకా డబుల్ రోడ్డు మంజూరు చేయించిన. కొట్లాడితే పనులు కావని, మనసుంటే అవుతాయని నిరూపించిన. సకల సౌకర్యాలు కల్పించడంతోనే గన్నేరువరం పంచాయతీకి జాతీయ అవార్డు దక్కింది. ఇతరుల్లాగా ఓట్లున్నప్పుడే వచ్చిపోయేవాడిని కాదు. ప్రతిపక్షాలు ఇక్కడి కాలువల్లోని నీళ్లను చూసి కండ్లుమండి ఆరోపణలు చేస్తున్నరు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నరు. మండలాభివృద్ధిపై పార్టీ నాయకులు ప్రజల్లో చర్చపెట్టాలి. పింఛన్లు అందుకునే వారి ఆశీర్వాదం. రైతన్నల దీవెనులుంటే చాలు. ఆపదలో ఉన్నవారు నేరుగా తనను కలిస్తే తీర్చేందుకు సహకరిస్తా.
– రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే, మానకొండూర్
ఐకమత్యంతోనే పార్టీ పటిష్టం
కార్యకర్తలందరూ కలిసి మెలిసి పనిచేసేందుకే పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సూచనల మేరకు సమ్మేళనాలు నిర్వహించుకుం టున్నం. బీఆర్ఎస్ శ్రేణులు కలిసి ఉన్నప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుంది. అత్యధిక మంది కార్యకర్తల కుటుంబాలున్న పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం. సర్దుకుపోయి పరస్పరం సహకరించుకోవాలి. గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నేతల తీరును ప్రజల్లో ఎండగట్టాలి.
– బస్వరాజు సారయ్య, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పార్టీ ఇన్చార్జి
బీఆర్ఎస్ వెంటే సబ్బండవర్గాలు
ఎప్పుడు రాజకీయ సమావేశాలే కాకుండా ఆత్మీయంగా కలుసుకుని మంచిచెడులు చెప్పుకునేందుకే ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకున్నం. కష్టపడ్డ పార్టీ నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. మానకొండూర్ నియోజకవర్గం లో పార్టీ పటిష్టంగా ఉన్నది. యువత చెప్పు డు మాటలకు ఆకర్షితులు కావద్దు. అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్నవారిని సాయం చేయాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు