బీఆర్ఎస్ ఫుల్జోష్ మీదున్నది. పార్టీ బలపరిచిన అభ్యర్థుల అఖండ విజయంతో సంబురాల్లో మునిగితేలుతున్నది. సోమవారం సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఆయా మండల కేంద్రాల్లో అభ్యర్థులతో కలిసి విజయోత్సవ ర్యాలీలు తీశారు. ‘జై కేటీఆర్.. జైజై బీఆర్ఎస్’ నినాదాలతో హోరెత్తించారు. కాగా, బోయినపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
– రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 24 నమస్తే తెలంగాణ)/ వేములవాడ
‘సెస్’ గెలుపుపై బీఆర్ఎస్ హర్షాతిరేకాలు
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/వేములవాడ: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. వేములవాడ కౌంటింగ్ కేంద్రం ఎదుట కార్యకర్తలు పటాకులు కాల్చి, కేక్లు కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, చేనేత, జౌళీశాఖ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణిలు గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్, బొల్లి రాంమోహన్, వేములవాడ నాయకులు మాధవితోపాటు అన్ని మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు సంబురాల్లో పాల్గొన్నారు.
అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు తీశారు. కాగా, బోయినపల్లి సెస్ డైరెక్టర్గా కొట్టెపల్లి సుధాకర్ ఘన విజయం సాధించడంతో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్ను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు సెస్ డైరెక్టర్ను పార్టీ శ్రేణులు ఎత్తుకొని ‘బీఆర్ఎస్ జిందాబాద్’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే, డైరెక్టర్, నృత్యం చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా బోయినపల్లికి చేరుకొని విజయోత్సవ ర్యాలీ తీశారు.
మంత్రి కేటీఆర్ నమ్మకాన్ని నిలబెట్టారు..
మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో బరిలో నిలిచిన తనను ప్రజలు ఆశీర్వదించారు. అమాత్యుడి నమ్మకాన్ని నిలబెట్టారు. సెస్ పరిధిలో తంగళ్లపల్లి స్థానంలో 2545 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం సంతోషంగా ఉంది. నా విజయానికి కృషిచేసిన పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా, సెస్ అభివృద్ధికి కృషి చేస్తా. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తా. రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తా.
– చిక్కాల రామారావు, తంగళ్లపల్లి సెస్ డైరెక్టర్ (సిరిసిల్లరూరల్)
రైతు సమస్యల్లో పాలుపంచుకుంటా
విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేస్తా. రైతులకు సాగునీరుతోపాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. రూరల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వారి సమస్యలు పరిష్కరిస్తూ సేవ చేస్తా.
– ఆకుల దేవరాజం, సెస్ డైరెక్టర్, వేములవాడ రూరల్
మార్మోగిన తెలంగాణ చౌక్..
జిల్లాలోని అన్ని మండలాల నుంచి వచ్చిన తరలివచ్చిన వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వేములవాడలోని తెలంగాణచౌక్ జనసందోహంగా మారింది. అభ్యర్థుల గెలుపు ఖరారు కాగానే పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ‘జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై కేటీఆర్.. జై చెన్నమనేని’ నినాదాలతో తెలంగాణచౌక్ మార్మోగింది.
ఎమ్మెల్యే చేసిన అభివృద్ధే నన్ను గెలిపించింది..
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి చేసిన అభివృద్ధే నన్ను విజయ తీరాలకు చేర్చింది. మండలంలో అన్ని పార్టీలు కలిసి ఏకమై స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చినా ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైపే నిలిచారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్, సాగు నీటి కొరత లేకుండా చేసిన ప్రభుత్వానికే పట్టంకట్టారు. నా గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ఎమ్మెల్యే, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కతజ్ఞతలు.
– మల్లుగారి రవీందర్ రెడ్డి, సెస్డైరెక్టర్ (ఇల్లంతకుంట)
సంక్షేమ పథకాలే గెలిపించాయి..
ప్రజా సంక్షేమ పథకాలే నా విజయానికి దోహద పడ్డాయి. సమైక్య పాలనలో కూలీలుగా మారి వలస వెళ్లిన రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారు. నిరంతరం విద్యుత్, ప్రతి మడికి సాగు నీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మించి రైతుల బతుకులు మార్చారు. నా గెలుపు కోసం కృషిచేసిన ఎమ్మెల్యే రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, జోగినపల్లి ప్రేమ్సాగర్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్యకు కృతజ్ఞతలు. రైతు సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తా.
– కొట్టెపల్లి సుధాకర్, సెస్ డైరెక్టర్, (బోయినపల్లి)
నమ్మకాన్ని నిలబెడతా..
నాపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు ఉంచిన నమ్మకాన్ని నిల బెట్టుకుంటా. వారిద్దరి సహ కారంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. రైతులకు అందుబాటులో ఉండి, నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. చందుర్తిని విద్యుత్ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. నాపై నమ్మకంతో చందుర్తి సెస్ డైరెక్టర్గా గెలిపించిన మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తా.
– పొన్నాల శ్రీనివాస్రావు, సెస్ డైరెక్టర్ (చందుర్తి)
బీఆర్ఎస్ వైపే జనం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నన్ను గెలిపించాయి. రజకులకు, నాయీబ్రాహ్మణులకు అందిస్తున్న 250 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇంకా వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్ పథకాలు ప్రజల మనుస్సును తాకాయి. ఎవరేం చెప్పినా ప్రజలు మా వైపే నిలిచారు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు సహకారంతో ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తా.
– నామాల ఉమ, సెస్ డైరెక్టర్, వేములవాడ టౌన్1
వినియోదారులకు అందుబాటులో ఉంటా..
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గుర్తించే మండల ప్రజలు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. నాకు ఓటేసి గెలిపించారు. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నరు. సబ్బండవర్గాలను కంటికి రెప్పలా చూసుకుంటున్నరు. ప్రతిపక్షాల నాయకులు ఎంత ప్రలోభపెట్టినా నన్ను ఆశీర్వదించారు. నాపై నమ్మకంతో గెలిపించిన మండల ప్రజలకు కృతజ్ఞతలు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే రమేశ్బాబు సహకారంతో మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
-ఆకుల గంగారాం (రుద్రంగి)
నా విజయం అమాత్యుడికి అంకితం
ముస్తాబాద్ సెస్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి, నా విజయానికి ప్రత్యేక చొరవతీసుకున్న మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటా. ప్రచారాన్ని పరుగులు పెట్టించి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులకు, ఇంకా నాపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా నా నావైపు నిలిచిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయను. మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా. వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూస్తా. నా ఈ విజయాన్ని మంత్రి కేటీఆర్కు అంకితం ఇస్తున్నా.
– సందుపట్ల అంజిరెడ్డి సెస్ డైరెక్టర్ (ముస్తాబాద్)
నమ్మకాన్ని కాపాడుకుంటా..
నాకు ఓటేసి గెలిపించిన ఓటర్ల విశ్వాసాన్ని కాపాడుకుంటా. నాపై నమ్మకం ఉంచి బరిలో నిలిపి, నా విజయానికి సహకారం, ప్రోత్సాహాన్ని అందించిన మంత్రి కేటీఆర్ రుణం తీర్చుకుంటా. రైతు సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో కష్టపడిన తీరును జీవితకాలం మరిచిపోలేను. నాకు సహకారం అందించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు, సీనియర్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
– వర్స కృష్ణహరి సెస్ డైరెక్టర్ (ఎల్లారెడ్డిపేట)
అమాత్యుడి సహకారంతో అభివృద్ధి చేస్తా
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఎనిమిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని స్వాగతిస్తూ నన్ను దీవించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా విజయానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, వినియోగదారులకు రుణపడి ఉంటా. రాబోయే రోజుల్లో పెరుగనున్న విద్యుత్తు వినియోగం మేరకు లోఓల్టేజీ స మస్య లేకుండా నూతన సబ్స్టేషన్లతోపా టు గ్రామాల వారీగా ట్రాన్స్ఫార్మర్ల సా మర్థ్యం పెంచేందుకు కృషి చేస్తా. రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయిస్తా. విద్యుత్తు సంస్కరణలో సమగ్రాభివృద్ధి సాధించిపెడతా.
– గౌరినేని నారాయణరావు సెస్ డైరెక్టర్ (గంభీరావుపేట)
సెస్ ఎన్నికల్లో డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించిన మంత్రి కేటీఆర్ సార్కు ధన్యవాదాలు. మోటర్లకు మీటర్లు పెడుతామన్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించారు. పార్టీ శ్రేణుల ప్రచారంతో పాటు, మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్లో ఇచ్చిన సందేశంతో ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం వైపే నిలిచారు. నాపై నమ్మకంతో సెస్ డైరెక్టర్గా గెలిపించిన మండల ప్రజలకు రుణపడి ఉంటా. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తా.
– మాడ్గుల మల్లేశం సెస్ డైరెక్టర్ (వీర్నపల్లి)
సెస్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా..
మంత్రి కేటీఆర్, సెస్ ఓటర్లు డైరెక్టర్గా భారీ మెజార్టీతో నాకు ఘన విజయాన్ని అందించారు. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమం వైపే నిలిచారు. చాలా సంతోషంగా ఉంది. వీరందరూ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నా విజయంలో భాగస్వాములైన మంత్రి కేటీఆర్కు, పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ రుణపడి ఉంటా. సెస్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. తోటి సభ్యులతో కలిసి అన్నిరంగాల్లో ముందుకుతీసుకెళ్లేందుకు కృషిచేస్తా.
– దార్నం లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్, సిరిసిల్ల సెస్ టౌన్-2
నా గెలుపు.. ప్రజా విజయం
ప్రజల ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను గెలుపొందా. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపే ప్రజలు నిలిచారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతన్నలు నాపై నమ్మకం ఉంచి అఖండ విజయాన్ని అందించారు. వారందిరికి పేరు, పేరునా కృతజ్ఞతలు. రెండుసార్లు డైరెక్టర్గా అవకాశం కల్పించిన ప్రజానీకానికి నావంతుగా కరెంటు సమస్యల పరిష్కారానికి ముందుంటా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ అరుణ సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.
– దేవరకొండ తిరుపతి, సెస్ డైరెక్టర్ కోనరావుపేట
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..
మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో సిరిసిల్ల సెస్ టౌన్-1డైరెక్టర్గా విజయం సాధించా. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతన్నలకు, పట్టణాభివృద్ధికి చేసిన పనులే నన్ను గెలిపించాయి. ముఖ్యంగా సెస్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. ప్రచారంలో మొదటి రోజు నుండే ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పాల్గొని విజయానికి అన్ని విధాలుగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. టౌన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.
– దిడ్డిరమాదేవి, సెస్ డైరెక్టర్ (సిరిసిల్ల టౌన్-1)
ప్రజలకు రుణపడి ఉంటా..
వేములవాడ అర్బన్ మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు సహకారంతో విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తా. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తా. ఇతర పార్టీల నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా, ప్రలోభ పెట్టినా మా పై నమ్మకంతో ఇంతటి గొప్ప విషయాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉంటా.
– రేగులపాటి హరిచరణ్ రావు, సెస్ డైరెక్టర్, వేములవాడ టౌన్2