సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 27: రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందే బీఆర్ఎస్ పార్టీ అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ నాయకుల కుట్రలను ప్రజలు తిప్పికొట్టి, బీఆర్ఎస్ను ఆశీర్వదించారని తెలిపారు. గత పాలకుల హయాంలో రాష్ట్ర రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొన్నదని, నాణ్యమైన కరెంటు ఇవ్వాలని, పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలని అడిగినందుకు బషీర్బాగ్లో నలుగురు రైతులను నాటి పాలకులు పొట్టనపెట్టుకున్నారని విమర్శించారు.
ఈ ఘటనతో చలించిన కేసీఆర్ రైతురాజ్యం రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్న సంకల్పంతో తన పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి అని గుర్తుచేశారు. ఆ తరువాత క్రమంలో జరిగిన ఉద్యమం మొ త్తం నీళ్ల కోసం జరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానాలను భగవద్గీతగా భావించి ఒక్కో అక్షరానికి అర్థం చెప్పేలా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నారని చెప్పారు. మూడున్నరేండ్ల కా లంలోనే ప్రపంచం ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. కళ్లున్న వారందరికీ తెలంగాణ కాలువల్లో పారుతున్న నీళ్లు కనిపిస్తున్నాయని, కళ్లే లేని వారికి మనం ఏం చెప్పగలమన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిర్మించి న మిడ్మానేరు తెలంగాణకు గుండెకాయ అని అభివర్ణించారు. ఇల్లంతకుంటలోని అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీరు అందిస్తున్నామన్నారు. రైతులు కేసీఆర్లో దేవున్ని చూశారని, అందుకే దేవునికి పరమాన్నం పెట్టిన విధంగా కేసీఆర్కు సెస్ 15 డైరెక్టర్ స్థానాలను కానుకగా అందించారని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పక్షపాతిగా రైతాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నదని ఎమెల్యే విమర్శించారు. మార్కెట్ వ్యవస్థను పునురుద్దరించాలని డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కనీసం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. దేశవ్యాప్తంగా ప్రధా ని మోదీ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రైతులను దేవుళ్లలా భావించే సీఎం కేసీఆర్ బాధిత కుటంబాలను పరామర్శించి వారికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఒకప్పుడు అర్ధాకలితో అలమటించిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఇతర రైతులకు సహాయం చేసేలా ఎదగడంలోనే మన అభివృద్ధి కనిస్తుందన్నారు.
సెస్ ఫుల్ఫాం చెప్తే రాజీనామా చేస్తా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను చాలా గ్రామాల్లో అసలు ప్రజలు గుర్తుబట్టడం లేదని, అలాంటి వ్యక్తి సెస్లో విజయం సాధిస్తామని ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కనీసం సెస్ ఫుల్ఫామ్ చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. “సెస్ అంటే తెల్వదు, రైతుల గురించి ఎలాంటి అవగాహన లేని వ్యక్తి” అని విమర్శించారు. బండికి తెలిసిందల్లా అబద్ధాలను ప్రచా రం చేయడం, యువతను మతం పేరుతో రెచ్చగొట్టడం మాత్రమేనన్నారు. సెస్లో కనీసం ఒక్క స్థానం సాధించని బీజేపీని రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గెలిపిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్న విషయాన్ని రైతాంగం సెస్ ఎన్నికల ద్వారానే నిరూపించిందని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రైతాంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతుబీమా వంటి ఒక్క పథకమైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతు సంక్షేమ పాలనను దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. రైతు కల్లాలు బంద్, మోటర్లకు మీటర్ల ఏర్పాటుపై బండి సంజయ్ ప్రధాని మోదీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. సెస్లో జరిగిన ఎన్నికల్లో ఇల్లంతకుంట మండలంలో బీజేపీ, కాంగ్రెస్ ఏకమై బీఆర్ఎస్ మద్దతుదారుడికి వ్యతిరేకంగా పనిచేసిప్పటికీ రైతులు తమకు మద్దతుగా నిలిచారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సెస్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగలేదనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ఎక్కడా పార్టీ కండువాలతో రాజకీయం చేయలేదన్నారు. ఎన్నికల ఫలితాలపై బండి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు మతిభ్రమించినట్లు అనిపిస్తుందని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని సూచించారు. మునుగోడు ఎన్నికల్లోనూ ఇదేతంతు వ్యవహరించాడని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాజన్నసిరిసిల్ల జిల్లా చారిత్రాత్మక అభివృద్ధి సాధిస్తున్నదని స్పష్టం చేశారు. సెస్ ఫలితాలే రాబోయే ఎన్నికల్లో పునరావృతమవుతాయన్నారు. ఉద్యమకారులందరికీ సెస్ పాలకవర్గంలో సముచితస్థానం కల్పించామన్నారు.
ప్రజలంతా బీఆర్ఎస్ వైపే..
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకమంతా సెస్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వైపే నిలిచారని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. మంత్రి కేటీఆర్ జిల్లా అభివృద్ధితో పాటు సెస్లో విప్లవాత్మక అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు, రైతాంగానికి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నదని చెప్పారు. సెస్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం హర్షణీయమన్నారు. 15 డైరెక్టర్ స్థానాల్లో మంత్రి కేటీఆర్ సూచించిన వారికి ఘన విజయాన్ని అందించారని చెప్పారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిం దం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, సెస్ పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.