జగిత్యాల, మే 5 (జగిత్యాల నమస్తే తెలంగాణ) : మనమందరం ఎన్నో దశాబ్ధాలపాటు కలగని, పోరాటాలు చేసి జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, ఇయ్యాళ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీస్తేస్త అంటున్నదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మరి జగిత్యాల జిల్లా ఉండాల్నా..? వద్దా..? అని ఆలోచించాల్సింది మీరేనని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉండాలంటే మీరంతా ఆలోచించి ఓటేయాలని, నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ను, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను, కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ గెలిపించుకోవాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏమీ చేయరని, తెలంగాణ కోసం పేగులు తెగేదాకా తెగించి కొట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలేనని స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధినేత కేసీఆర్ ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత జగిత్యాల పాత బస్టాండ్ వద్ద రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా అశేషంగా తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ, కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. అరచేతిలో స్వర్గం చూపెట్టే ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు, సచ్చేదిన్ తెచ్చిన బీజేపీకి ఓటు వేయడం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందే తప్ప న్యాయం జరగదని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.
అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగమాగం చేస్తున్నదని మండిపడ్డారు. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు విద్యార్థులు ఇలా ఎవరి గురించి పట్టింపు లేదని, ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేవని మండిపడ్డారు. దీనంతటికీ కారణం ఏంటని ప్రశ్నించారు. ఇవన్నీ కేసీఆర్ తెచ్చిన స్కీంలని చెప్పారు. పాత పథకాలకు మంగళం పాడుతున్నారని ఆగ్రహించారు. పోనీ ఎన్నికల్లో చెప్పినట్టు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని, రైతులకు రుణమాఫీ, ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వడం లేదని మండిపడ్డారు. పైగా ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తానంటూ ఇయ్యాళ ఏ ఊరికిపోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెడుతున్నాడని, అటు బాసర సరస్వతి, ఇటు యాదగరి నర్సన్న మీద ఒట్టు పెడుతున్నాడని విమర్శించారు.
ఇలాంటి ఈ ముఖ్యమంత్రిని? నమ్మే పరిస్థితి ఉన్నదా? అని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి.. అడ్డగోలు హామీలు ఇచ్చి.. నోటికొచ్చిన వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రైతు భరోసా ఇవ్వకపోగా.. రైతు బోనస్కు ఎగనామం పెట్టి రైతుబంధు విషయంలో ఆంక్షలు పెడుతామంటూ చెబుతున్నారని మండిపడ్డారు. ఐదు ఎకరాలకు పరిమితి పెడుతామంటే.. మిగిలినవారు రైతులు కారా..? అని ప్రశ్నించారు. నిజంగానే లిమిట్ పెట్టాల్సి వస్తే.. 20 నుంచి 25 ఎకరాల మధ్య పెట్టాలని సూచించారు. రైతన్నలు ఈ విషయంలో ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల, నమస్తే తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల రోడ్షోకు జనం నీరాజనం పలికారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన జగిత్యాలకు చేరుకోగానే అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. కొత్త బస్టాండ్ వద్ద మహిళా కార్యకర్తలు, నాయకులతో కలిసి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మంగళహారతులతో స్వాగతం పలికారు. కేసీఆర్ పట్టణానికి చేరుకోగానే కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాకలు కాల్చి సంబురాలు ప్రారంభించారు.
రాత్రి 8గంటల ప్రాంతంలో కొత్త బస్టాండ్లోని వల్లాభాయ్ విగ్రహం వద్ద నుంచి వేలాది మందితో కేసీఆర్ బస్సుయాత్ర మొదలై, పాతబస్టాండ్కు చేరుకున్నది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన జనం తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ‘సీఎం.. సీఎం’ అనే నినాదాలతో మార్మోగింది. పాతబస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్తోపాటు ప్రభుత్వ దవాఖాన భవనం, ప్రైవేట్ భవనాలు, ఇండ్లపైకి ఎక్కిన యువకులు కేసీఆర్ను చూసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా లిప్టు ద్వారా బస్సు పైకి జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, తర్వాత పెద్దపల్లి, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులు కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేరుకున్నారు.
తర్వాత జిల్లా శాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు చేరుకున్నారు. చివరగా కేసీఆర్ బస్సుపైకి చేరుకొని అభివాదం చేయడంతో ప్రజలంతా ఒక్కసారిగా ‘జై కేసీఆర్’ ‘సీఎం.. సీఎం’ అంటూ హోరెత్తించారు. అశేషంగా తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి కేసీఆర్ 23 నిమిషాల పాటు ఉత్సాహభరితంగా ప్రసంగించారు. 8.35 గంటల నుంచి ప్రారంభించి, 8.58 నిమిషాలకు ముగించారు.
తెలంగాణ యాసతో చలోక్తులు విసురుతూ.. ప్రజలను కట్టిపడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశ్నలు అడుగుతూ.. సమాధానాలు రాబట్టారు. కాంగ్రెస్ జిల్లాలను రద్దు చేస్తామంటున్నది. జగిత్యాల జిల్లా ఉండాలా? వద్దా? అని అడిగితే.. ‘ఉండాలి.. ఉండాలి’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన హామీలు జగిత్యాల వారికి అందినయట కదా..? అంటూ నవ్వుకుంటూ ప్రశ్నించడంతో, ‘లేదు లేదు’ అంటూ ప్రజలు బదులిచ్చారు. మహిళలకు రూ.2500 వచ్చాయట? ఈరోజు నిర్మల్ మీటింగ్లో రాహుల్గాంధీ చెప్పిండు. మీకు వచ్చాయా? లేదా? అన్న పశ్నకు మహిళలు రాలేదంటూ అంటూ చేతులు ఎత్తి అడ్డంగా ఊపారు.
తెలంగాణను ఎంత నేను బాగు చేసిన్నో మీరంతా కండ్లారా చూసిన్రు. నా కండ్ల ముందే తెలంగాణ ఆగమైతుంటే ఇప్పుడు నేను పిడికిలి బిగించి పోరాడడానికి వచ్చిన. జగిత్యాలలో చాల మంది రచయితలు ఉన్నరు. మేధావులు ఉన్నరు. మా రమణయ్య సారు లాంటి పెద్దలు ఉన్నరు. మీ అందరికీ దండం పెట్టి చెబుతున్న. మన నీళ్లను పోగొట్టుకోవద్దు. మన హక్కులు, నిధులు పోగొట్టుకోవద్దు. అందరం కలిసి ముందుకు పోవాలి. నాడు ఉద్యమానికి బలం చేకూర్చిన గడ్డ జగిత్యాల.
ఇప్పుడు అదే స్పూర్తితో వాస్తవాలను ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది. దయేసి మేధావులు, యువకులు, విద్యార్థులు అందరూ విజ్ఞతతో ఆలోచించాలి. కేసీఆర్ గుండె చీల్చితే తెలంగాణ ఉంటది. కేసీఆర్ బతికున్నంత వరకు తెలంగాణకు అంకితమై పోరాడుతడు. మీరందరు దయచేసి నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ను, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను, కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ను గెలిపించాలి.
మీ అందరికీ తెలుసు. ఉద్యమ సమయంలో నేను ఈ ప్రాంతమంతా తిరిగిన. జగిత్యాలకు కూడా చాలాసార్లు వచ్చిన. వరదకాలువ బాధ చూసి మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నం. దానిలో మత్స్యకారులు బతికిన్రు. రైతులు బతికిన్రు. చెరువులను నింపడానికి ఓటీలు పెట్టినం. ఆనాడు ఎమ్మెల్యేల సూచన మేరకు ఎన్ని తూములు కావాలంటే అన్ని తూములు పెట్టినం. చెరువులు నింపుకున్నం. ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మండంగా బతికిన్రు. ఇయాళ ఎందకు వరదకాలువను ఎండబెట్టిన్రు? ఏ కారణం చేత ఎండబెట్టిన్రు? పంటలు ఎండబెట్టిన్రు? పొలాలు ఎండిపోయినయి. దీనికి ఎవరు బాధ్యులు? దయచేసి ఆలోచించాలి. కొత్త స్కీములు గంగల కలిసినయి.. పాతస్కీములు మొత్తం బందు పెట్టిన్రు.
మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయా..? బందయినయా..? అందరి పేదల ఇండ్లల్ల నల్లాలు పెట్టి గోదావరి నీళ్లు దుంకిచ్చినం. మరిప్పుడు ఏం రోగం వచ్చింది? కరెంట్ కోతలు మోపైనయి..? మరీ ఎక్కడికి పోయింది తొమ్మిదేళ్లు వచ్చిన కరెంట్? ఇది ఎవరి అసమర్థత? కేసీ ఆర్ కిట్ వస్తున్నదా..? అదీ బంద్ పెట్టిన్రు. సీఎంఆర్ఎఫ్ వస్తు న్నదా..? అదీ వస్తలేదు. మరీ ఇవన్నీ ఏమైనయ్? మీకు చేనేత కార్మి కులు పట్టది. గీత కార్మికులు పట్టది. విద్యార్థులు పట్టది. ఫీజలు పట్ట య్. విదేశాల్లో సదువుకునే పేద విద్యర్థులకు రూ.20 లక్షలు స్కాల ర్షిప్ ఇచ్చినం. అవి బంద్ పెట్టిన్రు. ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టిన్రు. ఎందుకింత నిర్లక్ష్యం? కొత్త స్కీములు గంగల కలిసినయి. ఒక్కటీ అమలు కాలేదు. పాతస్కీములు మొత్తం బందుపెట్టిన్రు.
మొన్నటిదాకా నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నరు? మరీ నాలుగు రూపాలన్నా తెచ్చిన్రా..? ఏమైనా అభివృద్ధి చేసిన్రా..? ఇక్కడ అర్వింద్ ఈ ప్రాంతం గురించి ఏనాడైనా ఆలోచించాడా..? పొద్దున లేస్తే విషం చిమ్మడం తప్పా.. నాలుగు రూపాయల పనైనా చేసిండా..? పసుపు బోర్డు వచ్చిందా..? షుగర్ ఫ్యాక్టరీ తెరిచిన్రా..? మరి ఎందుకేయాలె ఓటు. దయచేసి ఆలోచన చేయాలె. మోడీ చెప్పింది జరగదు. ఆయన చెప్పేదంతా గ్యాస్ పురాణమే. మోడీ దేశానికి ప్రధానమంత్రి అయి పదేళ్లయింది. అచ్చేదిన్ రాలేదు కానీ, సచ్చేదిన్ వచ్చింది.
జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో బీడీ కార్మికులు చాలా మంది ఉన్నరు. ఏ ప్రభుత్వమన్నా.. కాంగ్రెసన్నా.. బీజేపన్నా మీకు ఏనాడైనా రూపాయి పెన్షన్ ఇచ్చిందా..? మిమ్మిల్ని ఆదుకున్నది, బతుకులు నిలబెట్టింది బీఆర్స్సే ప్రభుత్వమే. ఇయాళ బీడీ ఖార్ఖానాలు మోడీ బంద్ చేయిస్తున్నడు. రేవంత్రెడ్డి డబ్బా కొడుతున్నడు. మీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నడు. ఇయాళ బీడీ కార్మికులు కూడా ఆలోచించి, టేకేదార్లందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి బీఆర్ఎస్ను గెలిపించాలి. మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కర్రకాల్చి వాత పెట్టాలి.
మనకున్నది ఒకటే గోదావరి నది. నరేంద్రమోడీ మన గోదావరిని ఎత్తుకపోత అంటున్నడు. ముఖ్యమంత్రి సప్పుడు చేయడు. మరీ గోదావరిని ఎవరు కాపాడాలి? బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందు మాట్లాడుతరా..? చేతులు కట్టుకొని నిలబడుతరు. కాంగ్రెసోళ్లు మాట్లాడుతరా..?, మూతి ముడుసుకుంటరు. అదే బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే పార్లమెంట్లో దద్దరిల్లేలా కొట్లాడుతరు. మన గోదావరి మనకు దక్కాలన్నా..? మన కృష్ణా నీళ్లు మనకు దక్కాలన్నా..? మనకు న్యాయం జరగాలన్నా..
మన నిధులు రావాలన్నా..? కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారెంటీలను అమలు చేయించాలన్నా.. పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించాలి. మనోళ్లయితనే పేగులు తెగేదాకా కొట్లాడుతరు తప్ప వేరెవరు కొట్లాడరు. ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్. దయచేసి అందరూ విజ్ఞతతో ఆలోచించి ముందుకు రావాలి. యువసోదరులారా ఈ తెలంగాణ మీది. ఈ భవిష్యత్తు మీది. మీరు యువకులు ఆలోచించి ఓటేయాలె తప్ప ఆగమాగం ఓటెయద్దు. గుడ్డిగా ఎవరో చెప్పిన మాటలు వినకుండా ఎవరు గెలిస్తే మంచిదో ఆలోచన చేసి ఓటేయాలి.