గన్నేరువరం, ఏప్రిల్ 26 : బండి సంజయ్కు మత రాజకీయాలు తప్ప అభివృద్ధి చేతకాదని, ఆయన ఐదేళ్లలో ఎంపీగా చేసిందేమీ లేదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ఆయనకు అభివృద్ధి చేతగాక పూటకో మాట.. రోజుకో వేషం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజలు మోసపోయారని చెప్పారు. మరోసారి అలాంటి మాయమాటలు నమ్మవద్దని, మరోసారి మోసపోవద్దని సూచించారు. గన్నేరువరంలో శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఈ ఐదేళ్లలో ధర్మం.. ధర్మం అనడం తప్ప ఎంపీగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదని విమర్శించారు. ఆయన అసమర్థత కారణంగానే కరీంనగర్కు వచ్చిన ట్రిపుల్ఐటీని కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలించిందని చెప్పారు. కేంద్ర పథకాలకు ఏటా వచ్చే నిధులను సంజయ్ తాను తెచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఉన్న సమయంలోనే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ తెచ్చానని, రూ.వెయ్యి కోట్లతో కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు.
సంజయ్కి సోయి ఉంటే వేములవాడ, కొండగట్టు ఆలయాలకు ఒక రూపాయి కూడా నిధులు ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అమలు చేయడం లేదని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు తాను ఎంపీగా ఉన్న సమయంలో గన్నేరువరం మండల కేంద్రాన్ని తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు 72 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేయించి, పనులు ప్రారంభించినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పనులు సాగనివ్వడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒకటయ్యాయని, ప్రజలు ఆ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్, రెడ్డవేని తిరుపతి, గడ్డం నాగరాజు పాల్గొన్నారు.
రైతుల కండ్లల్లో కన్నీళ్లు కాదు, మొఖంలో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెచ్చి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చిండు. రైతుబంధు ద్వారా 10 వేలు, రైతు రుణమాఫీ, రైతు బీమా పథకం ద్వారా 5 లక్షల సాయం అందించిండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతా తారుమారైంది. నాలుగు నెలల్లోనే రాష్ట్రమంతా కరువచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి.
-మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్