జ్యోతినగర్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్ సర్కార్దేనని, పదేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పనైపోయిందని తీవ్రంగా విమర్శించారు. తాము ఓటు ఎందుకు వేశామని ప్రజలు బాధపడుతున్నారని, నాలుగు నెలల్లోనే అసహ్యించుకునే దుస్థితి వచ్చిందన్నారు. మన హక్కులు మనకు దక్కాలన్నా, న్యాయంగా నిధులు రావాలన్నా తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి పార్లమెంట్కు పంపాలని కోరారు.
తాను ప్రశ్నించే గొంతుకనవుతానని, రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో వచ్చే ప్రభుత్వంతోనూ కొట్లాడి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీలోని టీవీ గార్డెన్లో సోమవారం జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కొప్పుల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పుష్కలంగా సాగునీరు, కరెంట్ ఇచ్చారని, రైతుబంధు సకాలంలో అందించారని, పేదల సంక్షేమానికి అనేక పథకాలతో చేయూతనిచ్చి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు.
గోదావరి తీరం పొడవునా బరాజ్లు, రిజర్వాయర్లు నిర్మించి రైతు కండ్లలో కేసీఆర్ ఆనందం నింపారని చెప్పారు. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి ప్రజలను అరిగోసపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నీళ్లియ్యక రైతు కండ్లలో దుఃఖాన్ని మిగిల్చిందని మండిపడ్డారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మరోసారి నమ్మి కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోవద్దని సూచించారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎల్లప్పుడూ కాపాడేది కేసీఆరే. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శ్రీరామరక్ష. రాష్ట్రంలో కేసీఆర్ బస్సుయాత్రకు విశేష స్పందన వస్తున్నది. అది చూసి కాంగ్రెస్ శ్రేణుల్లో వణుకు పుట్టింది. ఈ ఎన్నికల్లో వాళ్లకు ఓటమి తప్పదు. వచ్చే నెల 3, 4 తేదీల్లో రామగుండంలో కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం చేయాలి.
మన సింగరేణి కార్మికుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొప్పుల ఈశ్వర్కు పెద్దపల్లి అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించడం హర్షనీయం. పెద్దపల్లి ఎంపీ సీటును గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలి. గోదావరిఖనిలో మక్కాన్సింగ్ కక్షపూరిత పాలన కొనసాగిస్తున్నరు. అక్రమంగా కేసులు పెట్టిస్తున్నరు. వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే దమ్మున్న ఈశ్వరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి. అందుకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఈ పది రోజులపాటు కష్టపడి పనిచేయాలి. కేసీఆర్ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించి, చైతన్యవంతం చేయాలి.
– కోరుకంటి చందర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే