మానకొండూర్రూరల్, నవంబర్ 11 : చెంజర్ల శివారు గ్రామాలైన ఖాదరగూడెం, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లికి సాగు, తాగు నీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం మానకొండూర్ మండలంలోని ఖాదరగూడెం, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 ఏండ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వాలని ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని మండిపడ్డారు.
ఖాదరగూడెం, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లిలో నాడు తాగు నీటికే గొడవలైన చరిత్ర ఉందని, అలాంటి ఆ గ్రామాలకు కాళేశ్వరం జలాలు అందించామని చెప్పారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని, అక్కడ కేవలం 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నట్లు వాళ్లే చెబుతున్నారని, అలాంటోళ్లు మనకు కావాలా?, 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల పేరుతో మీ ఊళ్లోకి వస్తున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావద్దని సూచించారు. ఎన్నికలు కాగానే ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్లో చేరిన వారికి ఎమ్మెల్యే, జీవీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరగంగా ఆహ్వానించారు. ప్రతి గ్రామంలో మహిళలు కోలాటాలు, బతుకమ్మలు, మంగళహారతులు, బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శంకరపట్నం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.