వీణవంక/ జమ్మికుంట, నవంబర్ 2: ‘సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు.. వాటితో పేదల కడుపులు నిండవు.. ఏడు సార్లు గెలిచిన ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదు.. బీసీ బంధును ఆపారు.. కాంగ్రెస్ నాయకులేమో దళితబంధు, రైతుబంధును ఆపించారు.. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.. నేను మీ బిడ్డను.. ఒక్క అవకాశం ఇవ్వండి.. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తాను’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 15 ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానని, ఎన్నికల్లో ఆశీర్వదిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
గురువారం మండలంలో ప్రచార శంఖారావాన్ని పూరించారు. మొదట బేతిగల్లోని పెద్దమ్మతల్లి, రామాలయంలో సతీసమేతంగా పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. మండలంలోని బేతిగల్, కనపర్తి, నర్సింగాపూర్, వల్భాపూర్లో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. బేతిగల్ నుంచి పోతిరెడ్డిపేటకు రోడ్డు, పోచమ్మతల్లి గుడి నిర్మాణం, భూలక్ష్మీ-మహాలక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, మాచనపల్లి, ఆబాది జమ్మికుంటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాడి కౌశిక్రెడ్డి మాట్లాడారు.
ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు పల్లెల్లో రైతుల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. కరెంట్ ఎప్పుడూ వస్తదో, ఎప్పుడూ పోతదో తెలువక రాత్రిపూట కరెంట్ మోటర్ల కాడికి పోతే పాములు, తేళ్లు కుట్టి, కరెంట్ షాకులతో ఎంత మంది మృతిచెందారో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో, పంట పెట్టుబడి కోసం వడ్డీలకు తీసుకొచ్చి అప్పులు పాలైన రోజులను ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి, హుజూరాబాద్ గడ్డకు గులాబీ బొట్టు పెట్టాలని పిలుపునిచ్చారు. కాగా, గ్రామాల్లో కౌశిక్రెడ్డి ప్రచారానికి ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు. ప్రతి గ్రామంలో మహిళలు, గ్రామస్తులు మంగళహారతులతో, డప్పుచప్పుళ్లతో, పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. పాడి కౌశిక్రెడ్డి-శాలినీరెడ్డి దంపతులు ప్రజల్లోకి వెళ్లి పేరుపేరున నమస్కరిస్తూ ఓటు అభ్యర్థించారు.
ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచి రెండేండ్లు అయిందని, ఇప్పటివరకు ఎప్పుడైనా ముఖం చూపించిండా..? అని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రజలను ప్రశ్నించారు. ఉప ఎన్నికలప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా గెలిచి రాష్ర్టాలు పట్టుకొని తిరుగుతున్నడని విమర్శించారు. ప్రజల కష్టాలు పట్టనోడు ఓట్లు ఎలా అడుగుతాడని, నిత్యం మన మధ్యలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలోనే సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడని, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కాగా, ప్రచారంలో పాడి కౌశిక్రెడ్డితో కలిసి ఆయన సతీమణి శాలినీరెడ్డి పాల్గొన్నారు.
తన భర్తకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కొంగు చాపి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాలాసాధవతరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రఘుపాల్రెడ్డి, సర్పంచులు మోరె సారయ్య, పర్లపెల్లి రమేశ్, గంగాడి సౌజన్యాతిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు జడల పద్మలతారమేశ్, ఉపసర్పంచులు చొప్పరి తిరుపతి, శ్రీనివాస్రెడ్డి, కవితాశ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్రావు, పత్తి కొండల్రెడ్డి, శశికుమార్, సింగిల్విండో డైరెక్టర్ కామిడి కావ్యాశ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జి.రవీందర్రావు, రాజమౌళి, రాజేశ్వర్రావు, పర్లపెల్లి తిరుపతి, కర్నె నర్సయ్య, వెంకటరాజం, జీడి వెంకటస్వామి, తిరుపతి, తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమతాప్రసాద్, జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, సర్పంచులు వంశీధర్రావు, అన్నపూర్ణ, కల్పన, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.