కార్పొరేషన్, అక్టోబర్ 28: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరీంనగర్లో జీవన ప్రమాణాలు పెరిగాయని, వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తిరుమల్నగర్ వాసుల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. మంత్రికి మాజీ కార్పొరేటర్ నలువాల రవీందర్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మంత్రి గంగుల కమలాకర్ను శాలువాలతో సతరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మానేరు రివర్ ఫ్రంట్ను అద్భుత కట్టడంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విలువైన ఓటును బీఆర్ఎస్కు వేసి అభివృద్దిని కొనసాగించాలని సూచించారు. వేల కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయంలోకి నెట్టివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి జయంతిని పురస్కరించుకొని వాల్మీకినగర్లోని వాల్మీకి మహర్షి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. వాల్మీకి బోయలు ఆర్థికంగా ఎదిగేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, స్థానిక నాయకుడువంగల పవన్ తదితరులు పాల్గొన్నారు.