శంకరపట్నం, అక్టోబర్ 31: రైతులకు పంట రుణాలు నిలుపుదల చేయాలన్న కాంగ్రెసోళ్లను పల్లెల్లో అడుగుపెట్టనీయవద్దని బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. నాడు పల్లెలను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఈ విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. తాను ఎమ్మెల్యే పదవి చేపట్టాక మానకొండూర్ నియోజకవర్గంలో పల్లెలు పచ్చగా కళకళలాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి, అర్కండ్ల, ముత్తారం, మక్త గ్రామాల్లో రసమయి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి నిరోధకుల చేతులకు అప్పగించవద్దని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. నియోజకవర్గంలో 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని పునరుద్ఘాటించారు. చెరువుల్లో నీళ్లు 24 గంటలు మత్తడి దుంకుతున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. ఎరడపల్లిలో కోట్లాది రూపాయలతో వంతెనలు నిర్మించామని గుర్తు చేశారు.
ముత్తారం స్వచ్ఛతకు మారు పేరుగా నిలిచిందని ప్రశంసించారు. అర్కండ్లలో మౌలిక వసతులు కల్పించగా, మక్తకు జీపీ హోదా కల్పించి ఇక్కడి ప్రజలు గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత తమదేనన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. దేశంలో పంట పెట్టుబడి సాయం చేస్తున్న ఏకైక సర్కార్ తమదేనన్నారు. బీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 5 లక్షల బీమా సౌకర్యం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్లో లాగా అన్ని గ్రామాల్లో దళితబంధు అమలు చేసి తీరుతామని చెప్పారు. స్థలం లేని వారికి ఇల్లు కట్టుకునే వారందరికీ స్థలం కొని 3 లక్షలు అందజేస్తామన్నారు. తెలంగాణలో ఉన్నన్ని పథకాలు ఏ రాష్ట్రంలో లేవని గుర్తించాలన్నారు. కవ్వంపల్లి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తనను దీవిస్తే కేసీఆర్ను దీవించినట్లేనని మరిచిపోవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి విజయాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాలకు రాగా, డప్పులు, కోలాటాలు, నృత్యాలతో, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తగట్టుకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు ఎరడపల్లిలో బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎల్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, సర్పంచులు రంజిత్రావు, చేర్ల అనిత, పంజాల రేణుక, నెలవేని సుష్మ, ఎంపీటీసీ సంపత్, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, యూత్ మండలాధ్యక్షుడు అలీమొద్దీన్, బీఆర్ఎస్ మండల మహిళా ఉపాధ్యక్షురాలు తిరుమల తదితరులు పాల్గొన్నారు.