కొత్తపల్లి, నవంబర్ 13 : పదేళ్ల కాలంగా జరుగుతున్న అభివృద్ధి కొనసాగడంతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా రావాలని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని చెప్పారు. సమైక్యపాలనలో ఆంధ్రోళ్లే ముఖ్యమంత్రులుగా ఉండేవారని, ఇక్కడి నిధులను దోచుకొని ఆంధ్రప్రాంతాన్ని అభివృద్ధి చేసి తెలంగాణకు పైసా నిధులు ఇవ్వక అరిగోస పెట్టారని తెలిపారు. గోదావరి ఈ ప్రాంతం నుంచి వెళ్లినా ఒక్క చుక్క నీరు రాకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వానకాలంలో కూడా ఎల్ఎండీ ఎడారిని తలపించేదని, సాగు, తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ రోజులు రైతులు ఇంకా మరిచిపోలేదన్నారు. సరిపడా కరెంట్ లేక రైతులు పొలాల వద్దే రాత్రిళ్లు పడిగాపులు కాసిన రోజులు ఎలా ఉండేవో గుర్తుంచుకోవాలన్నారు. స్వయంపాలనలో సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతో గొప్పగా అభివృద్ధి చేశామన్నారు.
1956లో మన తాతల చేసిన తప్పుతో పచ్చగా ఉన్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, ఇప్పుడు పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఆంధ్రోళ్లకు మళ్లీ కళ్ళమంట మొదలై దోచుకొనే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. బీజేపీ పేరుతో కిరణ్కుమార్రెడ్డి వస్తే.. పవన్కల్యాణ్తో చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, షర్మిల, కేవీపీ కాంగ్రెస్ ముసుగులో హైదరాబాదులో అడ్డావేయడం ఇందులో భాగమేనని, ప్రజలు ఈ విషయాలను గుర్తుంచుకొని ఓట్లు వేయాలని కోరారు. ఒక తప్పు జరిగితే మళ్లీ నలభై, యాభై ఏళ్ల దరిద్రం చూస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే అధికారం ఢిల్లీలో ఉంటుందని, అదే బీఆర్ఎస్కు ఓటేస్తే మనచేతుల్లోనే ఉంటుందన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తరువాత ఎప్పుడైనా మీ ఊరికి వచ్చాడా? అని ప్రశ్నించారు. తాను మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డనని, మరోసారి ఆశీర్వదిస్తే గొప్పగా పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, సర్పంచ్ మొగిళి మంజుల సమ్మయ్య, ఎంపీటీసీలు పట్టెం శారదలక్ష్మి నారాయణ, తిరుపతినాయక్, నాయకులు జయ ప్రకాశ్రెడ్డి, పిల్లి మహేశ్, కాసారపు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.