మానకొండూర్, మార్చి 29: బీఆర్ఎస్లో ఉండి పదేండ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారే ద్రోహులకు ప్రజలే బుద్ధిచెబుతారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. అవకాశవాదులు పార్టీని వీడినంత మాత్రాన జరిగే నష్టమేమీలేదన్నారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. నికార్సయిన తెలంగాణవాదులు, ఉద్యమ నేతలే పార్టీకి శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మానకొండూర్ గడిమహాల్లో విలేకరులతో మాట్లాడారు. జాతీయ పార్టీలని చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్కు అభ్యర్థులు కరువయ్యే బీఆర్ఎస్ నుంచి చేర్చుకుంటున్నారని విమర్శించారు.
వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు జోకర్లా ఉన్న కేశవరావును కేసీఆర్ ఆదరించి ఉన్నత పదవులు కట్టబెట్టారని, ఆయన బిడ్డ విజయలక్ష్మిని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ను చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కేశవరావు కాంగ్రెస్లోకి వెళ్లి సాధించేదేమీ ఉండదని, మళ్లీ జోకర్లా మిగిలిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇంట్లో కూర్చున్న కడియం శ్రీహరిని చేరదీసి కేసీఆర్ మంత్రిని చేశారని, హేమాహేమీలను కాదని ఆయన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. అలాంటి వారు స్వార్థం కోసం పార్టీ మారి నమ్మక ద్రోహులుగా మిగిలిపోయారని దుయ్యబట్టారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ద్రోహులకు తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. భవిష్యత్లో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించి ఆరు గ్యారెంటీల అమలుపై పోరాటం చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ను అఖండ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇస్తామని ప్రకటించారు. అందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, నాయకులు రామంచ గోపాల్రెడ్డి, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్గౌడ్, పోలాడి వంశీధర్రావు, నెల్లి శంకర్, ఇస్కుల్ల ఆంజనేయులు ఉన్నారు.